దారిద్ర్యానికి, ఆకలికి మతం లేదు: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దారిద్ర్యానికి, ఆకలికి మతం అనేది లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇంతపెద్ద దేశంలో ఎన్నికలు శాంతియుతంగా జరగడం ముదావహమన్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘాన్ని అభినందించాలన్నారు. ఈ ఎన్నికలు ఆశావహ దృక్పథంలో జరిగాయని, 66.4 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమన్నారు.
కుల, మత సరిహద్దలు చెరిపేసి అభివృధ్ధికి ప్రజలు ఓటు వేశారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఎన్నుకున్నందుకు ప్రజలు అభినందనీయులు అని పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన లోక్సభ స్పీకర్కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలు గ్రామాలకు విస్తరించాలని సూచించారు.
రాష్ట్రపతి ప్రసంగం...
* మనం ప్రజల సేవ కోసమే పార్లమెంటులో ఉన్నాము. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు.
* కొత్త సభ్యులందరికీ స్వాగతం. రాబోయే రోజుల్లో ఫలప్రదమైన పార్లమెంటు సమావేశాలను జరుపుకుందాం. కొత్త ఎంపీలు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధులు.
* ప్రజలలో ఎన్నికలు, ఓటింగ్ పట్ల కనిపించిన అమిత ఆసక్తి మన ప్రగతికి చిహ్నం. ఇది ఆనందదాయకం. 66 శాతం ప్రజలు ఓటు వేయడం, ఒకే పార్టీ కి 30 ఏళ్ల తరువాత అధికారంలోకి రప్పించడం, కుల, మత, వర్గ భేదాలను విస్మరించి ఓటు వేయడం శుభపరిణామం. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' (దేశమంతా ఒక్కటే... దీన్ని ఘనమైన దేశంగా చేద్దాం) అన్నదే మా నినాదాం. పేదరికాన్ని నిర్మూలించడమే మా కర్తవ్యం.
* కొత్త స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచిది. లోకసభ మహిళను స్పీకర్ గా తిరిగి ఎన్నుకోవడం ద్వారా మనం మహిళల పట్ల మన గౌరవాన్ని మరో మారు ప్రదర్శించాము.
* ప్రభుత్వం కొత్త భూ విధానాన్ని అవలంబించబోతోంది. వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించడమే మా లక్ష్యం. ఈ సారి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని మాకు తెలుసు. అందుకే మేము అత్యవసర ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాము.
* 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' (అందరి తోడుగా, అందరి అభివృద్ధి కోసం) అన్నదే నా ప్రభుత్వ విధానం. అతి తక్కువ ప్రభుత్వం, అత్యధిక పాలన అన్న విధానాన్నే నా ప్రభుత్వం పాటించబోతోంది. అందరు అల్పసంఖ్యాకులను పాలనలో, అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తాం.
* కొత్త ఆరోగ్య వైద్య విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. యోగ, ఆరోగ్య విద్యలకు పెద్దపీట వేయబోతున్నాం. స్వచ్ఛ భారత్ అన్న కొత్త ఉద్యమానికి నాంది పలకబోతున్నాం. కొత్త క్రీడా విధానం కూడా త్వరలో రాబోతోంది. స్కూలు విద్యలో క్రీడలు భాగం కాబోతున్నాయి. మంచి క్రీడాకారులను ముందే గుర్తించి, వారికి తగిన శిక్షణ నిచ్చే పనిని చేపట్టబోతున్నాం.
* ప్రతి రాష్ట్రంలోనూ ఐఐటీ, ఐఐఎంలు. ప్రతి వ్యక్తికి వృత్తి నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు అందేలా చూస్తాం.
* ప్రతి నీటి చుక్కా చాలా విలువైనది. అందుకే జలవనరుల పరిరక్షణకు ప్రాధాన్యం. త్వరలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (ప్రధానమంత్రి వ్యవసాయ నీటిపారుదల పథకం) ప్రారంభిస్తాం.