breaking news
jaya govt
-
ఐఏఎస్ల ఆక్రోశం
ఇద్దరు సస్పెన్షన్ 18 మందికి వెయిటింగ్ లిస్టు ఐపీఎస్లలో కూడా సచివాలయంలో చర్చ అసెంబ్లీకి తాకిన ఐఏఎస్ల ఆక్రోశం సమాధానం కరువుతో వాకౌట్ చెన్నై: జయలలిత ప్రభుత్వ తీరుతో పలువురు ఐఏఎస్లలో ఆక్రోశం రగిలింది. ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు 18 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచడమే కాకుండా... మరి కొందరు సీనియర్లను ప్రాధాన్యత లేని చోట నియమించినట్లు సమాచారం అందడంతో సచివాలయంలో చర్చకు దారి తీసింది. అలాగే ఐపీఎస్ అధికారులు పలువురు ఐఏఎస్ల తరహాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు సిద్ధం అవుతుండడంతో వ్యవహారం కాస్తా అసెంబ్లీకి చేరింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువు కావడంతో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొందరు ఐఏఎస్లను పక్కన పెట్టే పనిలో పడిందని సమాచారం. ఈ అధికారుల్లో ఎక్కువ శాతం మంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల యంత్రాంగం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించ బడ్డ వారే నని తెలిసింది. అయితే ఇదే సమస్యను పలువురు ఐపీఎస్ అధికారులు కూడా ఎదుర్కొంటున్నట్టు సమాచారం. తాజాగా సచివాలయంలో ప్రభుత్వ కక్ష సాధింపునకు ఐఏఎస్లు, ఐపీఎస్లు గురి అవుతున్నట్టుగా చోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ఇటీవల ఆగమేఘాలపై బదిలీ వేటు పడిన జ్ఞానదేశికన్తోపాటు ప్రజా పనుల శాఖ కార్యదర్శి యతీంధ్రనాథన్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే 18 మంది అధికారులకు ఎలాంటి పదవులు లేకుండా వెయింటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మరి కొందరు సీనియర్లు ప్రాధాన్యత లేని చోట్ల తీసుకెళ్లి పడేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కాస్త ఐఏఎస్లలో ఆక్రోశాన్ని రగిల్చింది. సుమారు 35 మంది ఐఏఎస్లు ఏకమై.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో భేటి అనంతరం ఓ నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు సచివాలయంలో చర్చ హోరెత్తుతున్నది. అదే విధంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐపీఎస్ అధికారులు సైతం ఏకం అవుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐఎఎస్, ఐపీఎస్లో రగిలిన అసంతృప్తి జ్వాల ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ బయలుదేరి ఉన్నది. అదే సమయంలో ఈ వ్యవహారం గురువారం అసెంబ్లీని తాకింది. అసెంబ్లీలో ఈ విషయంగా సమాధానం రాబట్టేందుకు ప్రధాన ప్రతి పక్షం డిఎంకే, కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే, పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ ఐఏఎస్ల సస్పెండ్, పక్కన పెట్టే వ్యవహారాల వెనుక కారణాల గురించి ప్రశ్నిస్తే పాలకుల వద్ద సమాధానాలు లేదని మండి పడ్డారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని స్టాలిన్ చెప్పారు. -
హిజ్రాలకూ పోలీసు ఉద్యోగాలు
చెన్నై: హిజ్రాలకు పోలీస్శాఖలో ఉద్యోగాలు కల్పించడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలవనుంది. పోలీస్శాఖలో 13,137 ఖాళీలను భర్తీ చేయాలని జయలలిత ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలో పోలీసు ఉద్యోగాలకు హిజ్రాలకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల్లో హిజ్రా అని స్పష్టం చేసిన వారిని మహిళా విభాగ దరఖాస్తుల జాబితాలో చేర్చి అందుకు అనుగుణమైన పరీక్షలు, పరిశీలనలు నిర్వహించనున్నారు. ఈ తరహా నిర్ణయం దేశంలోనే తొలిసారి కావటం విశేషం. 2013లో పోలీసు ఉద్యోగానికి శాంతి అనే హిజ్రా దరఖాస్తు చేసుకుంది. అనంతరం రాత, శరీర దారుఢ్య పరీక్షతోపాటు ఇంటర్వ్యూలోనూ ఉత్తీర్ణురాలై పోలీసు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంది. అయితే కొన్ని నెలలు ఉద్యోగం చేసిన తరువాత సహజంగా నిర్వహించిన వైద్య పరీక్షలో శాంతి హిజ్రా అని తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో సదరు శాంతి మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. పాఠశాలల్లో తనను మహిళగా గుర్తించారని... అలాగే మహిళా క్రీడాకారిణిగా తమిళనాడు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోనూ పాల్గొన్నట్లు శాంతి హైకోర్టుకు తెలిపింది. దీంతో శాంతిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది. కాగా శాంతి మళ్లీ పోలీసుశాఖలో చేరలేదు. శాంతి విషయంలో హైకోర్టు తీర్పును ఆదర్శంగా తీసుకున్న హిజ్రాలు పోలీసుశాఖలో ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపడంతో ప్రభుత్వం కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు ఆ శాఖలోని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరో నెలరోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. డిసెంబర్లోగా హిజ్రాల నియామకం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.