breaking news
jaribu lands
-
గ్రాసం లేక గ్రామం విడిచి.. బతుకు జీవుడా..!
పల్నాట దుర్భిక్షం నీరింకిన కుంటలు, చెరువులు మచ్చుకైనా కనిపించని పచ్చిక బయళ్లు మేత, నీరు కోసం వెంపర్లాడుతున్న జీవాలు వలసబాట పడుతున్న పోషకులు కారంపూడి/గురజాల రూరల్: పల్నాడు ప్రాంతం.. జరీబు భూములు లేకున్నా జీవాలకు బాగా మేత దొరుకుతుందని పేరు. ఇతర జిల్లాల నుంచే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మేకలు, గొర్రెలకాపరులు మేత కోసం వాటిని ఇక్కడికి తోలుకొచ్చేవారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మాగాణులు కూడా బీళ్లుగా మారాయి. పచ్చిక బయళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. కుంటలు, చెరువుల్లో నీరింకి పోయింది. మేతకు, తాగునీటికి కరువొచ్చింది. పల్నాడుకు దక్షిణ సరిహద్దులో 42 కిలోమీటర్ల దూరం వ్యాపించి వున్న నల్లమల అడవిలో సైతం మేత దొరకని పరిస్థితి దాపురించింది. దీంతో జీవాల పోషణ కష్టమైంది. గత్యంతరం లేక జీవాల పోషకులు వలసబాట పడుతున్నారు. పల్నాడు నుంచి జీవాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పల్నాడు టు ప్రకాశం.. పల్నాడు ప్రాంతంలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు సుమారు 2.5 లక్షల దాకా వున్నాయి. రెండు రోజులుగా నాలుగు వేల జీవాలతో కాపరులు వలసవెళ్తున్నారు. మిగిలిన వారు కూడా వీరి బాటలోనే పయనించే ఆలోచనలో వున్నారు. ఎక్కువగా ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ పంట కాల్వలకు నీరు రాక గడ్డి మొలిచిందని, కొద్దిపాటి వర్షాలకు మాగాణి భూముల్లో పచ్చిక పట్టిందని తెలుసుకుని, ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలి పోతున్నారు. ఎగువ పల్నాడు(మాచర్ల, విజయపురిసౌత్, రెంటచింతల) నుంచి మేత కోసం అన్వేషించుకుంటూ కారంపూడి ప్రాంతానికి వచ్చిన కాపరులు ఇక్కడ కూడా మేత లేకపోవడంతో ఇక్కడ నుంచి లారీలలో ప్రకాశం జిల్లా కారంచేడుకు తరలిపోతున్నారు. సాధారణంగా జీవాలను ఎంత దూరమైనా నడిపించుకుంటూనే వెళ్తారు. కానీ మార్గంలో సరైన మేత లేక జీవాలు నడవలేక పోతుండటంతో లారీలలో తరలించాల్సి వస్తోందని జీవాల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే రానున్న వేసవి ఇంకెలా వుంటుందోననే ఆందోళన చెందుతున్నారు. జీవాలకు కొత్త జబ్బులు.. గురజాల రూరల్ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఉన్న మూడు కుంటల్లోనూ నీరు ఇంకిపోయింది. అడవిలోని పచ్చికబయళ్లు ఎండిపోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు జీవాలకు కొత్తజబ్బులు సోకుతున్నాయ. ఇక చేసేది లేక గ్రామం వదిలి జీవాలతో వలసపోతున్నారు పోషకులు. రెండు రోజుల్లో దాదాపు 60 కుటుంబాలు 8000 జీవాలను లారీలకు ఎక్కించుకొని తరలివెళ్లారు. పిల్లల చదువులను కూడా మధ్యలోనే ఆపేసి, వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, గొర్రెల, మేకల పెంపకందారులు కంటతడిపెడుతున్నారు. -
కళకళ..వెలవెల!
తుళ్లూరు/ తాడేపల్లి : రైతుల ఇంట అతిపెద్ద పండుగ సంక్రాంతికి సంబంధించి రాజధాని ప్రాంతంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఆనందాలు, సంతోష సంబ రాలతో కళకళలాడుతుండగా, మరో వైపు భవితపై బెంగతో ఆందోళన చెందుతున్న రైతుల లోగిళ్లు వెలవెలబోతున్నాయి. తుళ్లూరు మండలంలోని మెట్టభూముల రైతులు ఈ పండుగను ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. జరీబు భూములు ఉన్న గ్రామాల్లో సంక్రాంతి సందడి కనిపించటం లేదు. ఆది నుంచి ఇక్కడి రైతులు రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఏటా మూడు పంటలు పండే భూములు ఇస్తే భవిష్యత్ ఏమిటనేది అర్థంకాని పరిస్థితిలో సంక్రాంతి వేళ సైతం తమ నిరసనలను ముగ్గుల రూపంలో తెలియజేస్తున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతు కుటుంబాల మ హిళలు తమ భూము లు ఇవ్వబోమనే రీతి లో ముగ్గులు వేశారు. రాజధాని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ గ్రామాల్లో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. తమ భూములను ప్ర భుత్వం లాగేసుకుంటే ఎలా బతకాలనే ఆందోళనతో కాలం గడు పుతున్నారు. ఉండవల్లి, పెనుమాకలో సంక్రాంతి కళ తప్పింది. భోగి మంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి పెనుమాక, ఉండవల్లిలో నిరసనలతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం రైతు కుటుంబాల్లో సంక్రాంతి హడావుడి కనిపించడంలేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం పెనుమాక, ఉండవల్లి రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి రైతులు ఏదో ఒక రూపంలో నిరసనలు తెలియజేస్తున్నారు. అరుునా సర్కారు తన నిర్ణయూన్ని వెనక్కు తీసుకోలేదు. మూడురోజుల నుంచి పెనుమాక, ఉండవ ల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని భూమి ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మరో పక్క పోలీసు పికెట్ గ్రామంలో ఏర్పాటుచేశారు. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా పెనుమాక , ఉండవల్లివాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు మండలంలో ఘనంగా సంక్రాంతి.. ఇప్పటివరకు పల్లెటూరుగా వున్న తుళ్లూరు ఒక్కసారిగా నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా మారిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూములు విక్రయించుకోవడంతో వచ్చిపడిన డబ్బుతో పండుగను గత ఏడాది కంటే రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాల నిర్వహణకు నిధులు విడుదల చేయడంతో గ్రామాలన్నీ పండుగ ఊపులో ఉన్నాయి. బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తుళ్లూరుతోపాటు అనేక గ్రామాల్లో సేవాసంస్థలు, ప్రజాసంఘాలతో పాటు ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం త్వరగా జరగాలని, గ్రామాలు సుఖశాంతులతో ఉండాలని సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. {పధానంగా తుళ్లూరు, పెదపరిమి, మందడం, రాయపూడి, అనంతవరం, వడ్డమాను, బోరుపాలెం గ్రామాలలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి, కనుమ పండుగలను కూడా అదేస్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బంధువులు, స్నేహితుల రాకతో అక్కడి రైతుల లోగిళ్లు కళకళలాడుతున్నాయి.