breaking news
I cloud
-
పైసా ఖర్చుపెట్టకుండా ఫొటోలు దాచుకోండిలా..
సాధారణంగా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యూజర్లు డాటాను దాచుకోవడానికి ఉచిత స్టోరేజ్ ఉంటుందనేది తెలిసిందే. గూగుల్ తరపున గూగుల్ ఫొటోస్ విషయానికొస్తే 15 జీబీ ఉచిత స్పేస్ ఉంటుంది. అది నిండితే మాత్రం మరికొంత స్పేస్ను కొనుక్కోవాల్సిందే. లేకుంటే కొత్తగా డాటా స్టోర్ కాకపోగా.. ఆల్రెడీ సేవ్ అయిన డాటా కూడా డిలీట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో(యాప్స్తో) ఫొటోల్ని, డాటాను దాచుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?.. టెరాబాక్స్(డ్యూబాక్స్).. గూగుల్ ఫొటోస్కు బెస్ట్ ప్రత్యామ్నాయం ఇది. ఈ యాప్లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. ఫైల్స్, ఫొటోస్, వీడియోలు, ఫోల్డర్లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్గా బ్యాక్ప్లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్షిప్ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్ చేసుకునేందుకు ఎనేబుల్ బటన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. జియోక్లౌడ్ (ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్).. గూగుల్ ఫొటోస్కు ఇంకో ఉచిత ప్రత్యామ్నాయం ఇది. జియో ద్వారా క్లౌడ్ స్టోరేజ్ 50జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. రిఫరెన్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్ను పొందవచ్చు. డెగూ.. ఫొటోలు దాచుకోవడానికి మంచి మార్గం ఇది. ఇది మూడు ప్లాన్లతో ఉంటుంది. మొదటి ప్లాన్లో 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ వస్తుంది. ఒకవేళ ప్రో లెవల్కు వెళ్తే.. 500 జీబీ స్టోరేజ్ ఇస్తారు. 10 టీబీ స్టోరేజ్ ప్లాన్ కూడా ఉంది. వీటితో పాటు స్పాన్సర్డ్ యాడ్స్ను చూసినా.. ఇతరుల్ని ఇన్వైట్ చేసినా అదనంగా మరికొంత ఫ్రీ స్టోరేజ్ ఇస్తారు. అమెజాన్ ఫొటోస్ యాప్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కొందరు కస్టమర్లకే అందించే యాప్ ఇది. అదీ గూగుల్ప్లే స్టోర్లో కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫొటోలకు మాత్రం లిమిట్ ఉండదు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్లిమిటెడ్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రెగ్యులర్గా లభించే మిగతా ఆఫర్ల సంగతి చెప్పనక్కర్లేదు. మైక్రోసాఫ్ట్ 365(వన్ డ్రైవ్).. ఇది ఫ్రీ మాత్రం కాదు. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్లు ఏడాదికి 4,899రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 1 టీబీ స్టోరేజ్ ఇస్తారు. ఇందులో 6,199రూ.లతో ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంటుంది. వర్డ్, పవర్పాయింట్, ఎక్సెల్, అవుట్లుక్ అప్లికేషన్స్ ప్రీమియం ప్రొడక్టులను కూడా పొందవచ్చు. యాపిల్ వన్ ఇండియా ప్లస్.. యాపిల్ వన్ ఇండియా ప్లాన్స్ను మొత్తం కుటుంబం ఉపయోగించుకోవచ్చు. నెలకు 365రూ.లతో ఆరుగురు 200 జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ను వాడుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ఫ్లస్, యాపిల్ ఆర్కేడ్ సర్వీసులతో పాటు 50జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ కూడా దక్కుతుంది. కాకపోతే 195రూ. నెలవారీ ప్లాన్ తీసుకోవాలి. యాపిల్ రెగ్యులర్ యూజర్లు మాత్రం 177రూ. వరకు సేవ్ చేసుకోవచ్చు.| గూగుల్ ఫొటోస్ గురించి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి! -
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్
వాట్సాప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్. ఇద్దరి మధ్యగానీ, గ్రూపులోగానీ సంభాషణలకు, వ్యక్తిగత కాల్స్కు ఇంటర్నెట్ స్వేచ్ఛతో అనుమతించ్చే యాప్. అయితే వాట్సాప్లో యూజర్ భద్రత గురించి బోలెడు అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో ఫేస్బుక్ స్వయంగా వాట్సాప్ యూజర్ల డాటాపై కన్నేసిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో యూజర్ల కోసం ఓ గుడ్న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ చాట్ డాటాకు భద్రత భరోసా ఇస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో ప్రైవసీ అప్డేట్ ఇచ్చింది. చాట్ బ్యాకప్ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘‘ఒకవేళ ఎవరైనా వాట్సాప్ హిస్టరీని బ్యాక్ అప్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్లోని సమాచారాన్ని ఎవరూ అన్లాక్ చేయలేరు’’ అని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ గురువారం వెల్లడించాడు. క్లిక్: ఫేస్బుక్ వల్లే న్యూడిటీ ప్రమోషనా? అయితే సంబంధిత డ్రైవ్ల్లో(ఐక్లౌడ్స్ లేదంటే గూగుల్ డ్రైవ్) ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కీ’ సాయంతో యాసెస్కి అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ యూజర్కు అందుబాటులో రానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. ఇది డిఫాల్ట్గా ఆన్ కాదు. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం గానీ, 64 డిజిట్ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ గనుక మర్చిపోతే.. అకౌంట్ రికవరీకి వాట్సాప్ కూడా ఎలాంటి సాయం అందించలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా వాట్సాప్ను ఉపయోగిస్తుండగా.. భారత్లో యూజర్ల సంఖ్య 40 కోట్లకు పైనే అని ఓ అంచనా. చదవండి: ఫేస్బుక్ కాదు.. పక్కా ఫేక్ బుక్ -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్లకు వస్తుంటాయి. స్టాక్స్లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్వర్డ్తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్గా (కంప్యూటర్లు, డిస్క్లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్లో నమోదైన మొబైల్ నంబర్ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
క్లౌడ్ తో జర భద్రం..!
సేఫ్టీ స్మార్ట్ఫోన్లు వాడటం ఎంత సౌలభ్యకరమో...అంతే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఖరీదైన గాడ్జెట్స్తో ఉన్న సౌకర్యాలే ఒక్కోసారి ఇబ్బందిగా మారతాయి. ఇలాంటి వాటిలో తాజాగా కొంతమంది సెలబ్రిటీలకు తలెత్తిన సమస్య ఏమిటంటే, ఫోటోలు చోరీకి గురవ్వడం. మరి వ్యక్తిగత స్మార్ట్ఫోన్స్లోని ఫోటోలు ఎలా చోరీ అయ్యాయి..?! అంటే... ఇక్కడే ఉంది ఒక ఆసక్తికరమైన విషయం. స్మార్ట్ఫోన్ వినియోగదారులకు క్లౌడ్కంప్యూటింగ్ను వాడుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఫోన్లోని డాటాను క్లౌడ్ సర్వర్లో దాచుకోవచ్చు. దానివల్ల ఫోన్కు కొంచెం మెమొరీ భారం తగ్గుతుంది. ఫోటోలతోనూ, తీసుకొన్న వీడియోలతోనూ ఫోన్లోని డాటాస్పేస్ నిండిపోయినప్పుడు క్లౌడ్ సర్వర్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ వినియోగదారులయితే ‘ఐ క్లౌడ్’లో ఒక అకౌంట్ను క్రియేట్ చేసుకొని ఫోన్లోని డాటాను అందులోకి చేర్చవచ్చు. అవసరం అయినప్పుడు లాగిన్ అయ్యి, దీనిని వాడుకోవచ్చు. దీనికోసం ఐక్లౌడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడే సమస్య తలెత్తుతోందిప్పుడు. ఐ క్లౌండ్లో అకౌంట్ సులభంగా హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత హాలీవుడ్నటీమణులు జెన్నీఫర్ లారెన్స్, కేట్ ఆప్టన్ల ఐ క్లౌడ్ అకౌంట్లు హ్యాక్కు గురయ్యాయి. వారు క్లౌడ్లో దాచుకొన్న ఫోటోలను కొందరు కాపీ చేసుకొన్నారు. తద్వారా వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. మరి ఐ క్లౌడ్ వల్ల సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా బాధితులయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి అమ్మాయిలు ఈ విషయంలో అవగాహనతో వ్యవహరించాల్సి ఉంటుంది. టీనేజ్ గర్ల్స్లో చాలామంది తమ ఫొటోలను క్లౌడ్లో సర్దేయడం జరుగుతోంది. మరి ఇకపై వ్యక్తిగత సమాచారాన్ని క్లౌడ్కు ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి నివారణ ఏముంది? అంటే... ఫోన్లో డాటాస్పేస్ నిండిపోయినప్పుడు క్లౌడ్స్పేస్లో దాచడం కంటే... డాటాకేబుల్ ద్వారా పర్సనల్ కంప్యూటర్లోకి మార్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను దాచడానికి క్లౌడ్స్పేస్ను వీలైనంత తక్కువగా వాడాలని చెబుతున్నారు.