breaking news
Gudumba prevention
-
గుడుంబా తయారీదారులకు పునరావాసం
♦ రాష్ట్రంలో 7,886 మంది గుర్తింపు ♦ ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.157 కోట్లు ♦ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సాక్షి, సంగారెడ్డి: గుడుంబా తయారీదారులకు పునరావాసం కల్పిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డిలో హరేకృష్ణ సొసైటీ, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7,500 మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ, ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో గుడుంబా నిరోధక, పునరావాస పథకం కింద 165 మంది లబ్ధిదారులకు రూ.3.35 కోట్ల సాయం, కోహిర్ మండలం కవేలీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ప్రారంభించారు. అనంతరం జహీరాబాద్లో ఎంసీహెచ్ను ప్రారంభించడంతో పాటు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుడుంబా తయారీపై ఆధారపడి జైలుపాలైన వారు ఆత్మగౌరవంతో బతికేందుకు తమ ప్రభుత్వం గుడుంబా నిరోధక పునరావాస పథకం ప్రవేశ పెట్టిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,886 మందిని గుర్తించామని, ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.157 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, గుడుంబా, పేకాట వంటి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఎక్సైజ్ అధికారులు గీత కార్మికులను వేధించకుండా.. ఈత వనాల పెంపకం ద్వారా కల్తీ కల్లును నిరోధించాలని సూచించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవిగా ప్రచారం చేసుకుం టున్నారని, ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. సీఎం పరిశీలనలో ఏకీకృత సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని హరీశ్రావు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం దన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, భూపాల్రెడ్డి, బాబూమోహన్, జెడ్పీచైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బూట్లు తొడిగిన మంత్రి జిల్లా కేంద్రం సంగారెడ్డిలో హరేకృష్ణ సొసైటీ, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు స్వయంగా బూట్లు తొడిగారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే చింతాప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ తదితరులు సైతం బూట్లు తొడిగారు. – సంగారెడ్డి అర్బన్ -
హవ్వ... గుడుంబా నియంత్రించారట
గ్రామాల్లో పూర్తి స్థాయిలో గుడుంబా నివారణ కు కృషి చేస్తున్నామంటూ గొప్పలు చె ప్పుకుంటున్న అధికారుల తీరుకు పై చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది. మంత్రి చందూలాల్ మండలంలోని తన స్వగ్రామమైన జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని ఊరచెరువు పునరుద్ధరణ పనుల ప్రారంభించారు. అనంతరం మట్టిని తవ్వేందుకుచెరువు వద్దకు వెళ్లారు. కేవలం నిమిషం వ్యవధిలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి తాగి తూలుతూ శిలాఫలకం ఎదుటే పడిపోయాడు. గుడుంబా రహిత జిల్లాగా మార్చుతున్నామని చెబుతున్న అధికారులు దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. - ములుగు -
మాధారంలో మద్యం నిషేధం
- విక్రయిస్తే జరిమానా,ప్రభుత్వం పథకాలు రద్దుచేయూలని తీర్మానం - అమ్మకందారులకు నోటీసులు మాధారం (రఘునాథపల్లి) : మండలంలోని మాధారంలో బెల్టుషాపులు, గుడుంబా నివారణకు గ్రామస్తులు నడుంబిగించారు. శనివారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బాల్నె అనురాధ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కుల పెద్దలు, మహిళా సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు. గ్రామంలో బెల్టుషాపులు, గుడుంబా విక్రయిస్తే జరిమానాలతో పాటు ప్రభుత్వ పథకాలు పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి గ్రామంలో మద్య నిషేధం అమల్లోకి తేవాలని పకడ్బంధీగా అమలయ్యేలా నిషేధ కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. గ్రామంలో ఎవరైనా బెల్టు షాపు నిర్వహిస్తే రూ 20 వేల జరిమానా, గుడుంబా అమ్మితే రూ 10 వేలు, తాగిన వారికి రూ 5 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ప్రస్తుతం బెల్టు షాపులు నిర్వహిస్తున్న నలుగురికి, గుడుంబా అమ్ముతున్న ఆరుగురికి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు తయారు చేసి స్వయాన నూతనంగా ఎంపికైన నిషేధ కమిటీ సభ్యులు వారి వద్దకు వెళ్లి అందించారు. గ్రామస్తుల నిర్ణయాన్ని ధిక్కరించి మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామాఖ్య సంఘం అధ్యక్షురాలు ఉమ్మగోని సరిత, సీఏ కర్ల పద్మ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మగోని నర్సయ్య, బాల్నె భిక్షపతి, అరూరి బాలస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.