‘కాపులకు బాబు తీరని ద్రోహం’
చిలకలూరిపేట టౌన్: సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు తీరని ద్రోహం చేశారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి గోవిందు శంకర్ శ్రీనివాసన్ ఆరోపించారు. పట్టణంలోని కాపు సంక్షేమ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ.1000 కోట్లు చొప్పున సంక్షేమానికి నిధులు కేటాయిస్తానని ఎన్నికల ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కాపులను అణగదొక్కే కుట్రలకు తెరతీశారని ధ్వజమెత్తారు.
హక్కుల సాధన కోసం పోరాడుతుంటే అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ కింద అర్హులైన ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదని ఆరోపించారు. తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యలో ఈ నెల 7న కాకినాడలో భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. సమావేశంలో కాపు జేఏసీ కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, పాశం రామారావు, శనివారపు సాంబశివరావు పాల్గొన్నారు.