ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య
పెందుర్తి(విశాఖపట్టణం జిల్లా): అనారోగ్య సమస్యలతో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం విశాఖ జిల్లా పెందుర్తి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు..పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండకు చెందిన గరుగు రమేష్(29), సూర్యకుమారీ(25)లకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే బతుకుదెరువు కోసం విశాఖ వచ్చి పెందుర్తిలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా, బుధవారం ఉదయం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రిపోర్టులు చూసుకొని బాధపడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.