breaking news
galeru-nagari project
-
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్కు, అక్కడ నుంచి మద్రాస్లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
అవుకు రిజర్వాయర్ వద్ద రెండో టన్నెల్ రెడీ
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం(టన్నెల్)లో మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ను నింపడానికి మార్గం సుగమమైంది. ఇది దుర్భిక్ష రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి దోహదం చేస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో నాటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీల పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా 5.7 కి.మీల పొడవున సొరంగం (అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో ఒక్కొక్కటి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలు) తవ్వకం పనులు చేపట్టారు. మహానేత హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో అధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయలేని టీడీపీ సర్కార్ అవుకు సొరంగాలలో ఒక్కో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉండటం వల్ల కూలిపోవడం)లో పనులు చేయాలి. వాటిని చేయలేని టీడీపీ సర్కార్.. ఒక సొరంగంలో 165 మీటర్ల పొడవున సొరంగానికి ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వి.. దాన్ని వరద కాలువతో అనుసంధానం చేసింది. దీని వల్ల పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించవచ్చు. గండికోట రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించక పోవడం వల్ల 26.85 టీఎంసీలకుగాను నాలుగైదు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కార్ నిల్వ చేయగలిగింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోనూ నిర్వాసితులకు పునరవాసం కల్పించపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ 4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగింది. పైడిపాలెం రిజర్వాయర్లో 6 టీఎంసీలకుగానూ ఒక టీఎంసీ నిల్వ చేసింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు ఏర్పడిన లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేసేవారు. పూర్తయిన అవుకు సొరంగాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఈఎన్సీ సి.నారాయణరెడ్డి రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని, బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుమారు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.250 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పది టీఎంసీలకుగాను పది టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 6 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ఆయకట్టుకు పూర్తి స్తాయిలో నీటిని అందిస్తున్నారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలు ఉన్న ప్రాంతంలో రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ వేసి.. వాటికి అడ్డుకట్ట వేశారు. తద్వారా 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. మరో అడుగు ముందుకు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో రెండో సొరంగం(టన్నెల్)లో ఫాల్ట్ జోన్(కూలిన ప్రాంతం)లో 160 మీటర్ల తవ్వకం పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. అత్యాధునిక పోలింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాలీయురిథేన్ యురెథేన్ ఫోమ్ గ్రౌటింగ్ చేస్తూ ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకం పనులను రెండ్రోజుల క్రితం పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో సొరంగానికి 165 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటికే 134 మీటర్లు పూర్తి చేశారు. నెలాఖరుకు మిగతా 131 మీటర్ల లైనింగ్ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులకు తోడుగా ప్రస్తుతం పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా తరలించడానికి మార్గం సుగమం చేశారు. ఇది ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుసాధ్యం చేశాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవుకు రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో 160 మీటర్ల తవ్వకం పనులు పూర్తి చేయడాన్ని సవాల్గా తీసుకున్నాం. హిమాలయాల్లో సొరంగాలు తవ్వే నిపుణులను రప్పించి.. అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సొరంగాన్ని పూర్తి చేయించాం. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి కాలువ ద్వారా తరలించవచ్చు. ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. – శశిభూషణ్కుమార్, ముఖ్య కార్యదర్శి జలవనరుల శాఖ సామర్థ్యం పెంచే పనుల్లో వేగం పెంచాం అసాధ్యమనుకున్న అవుకు రెండో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద మూడో టన్నెల్ తవ్వకం పనులు చేపట్టాం. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. అప్పుడు గాలేరు–నగరి ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే పది రోజుల్లోనే గండికోట రిజర్వాయర్ను నింపి, ఆయకట్టుకు నీళ్లందివచ్చు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, జల వనరుల శాఖ -
‘గాలేరు–నగరి’ బరిలో నాలుగు సంస్థలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ నుంచి శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు అభివృద్ధి చేయడం, అవుకు వద్ద అదనంగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో టన్నెల్ తవ్వే పనులకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లో నాలుగు సంస్థలు పోటీపడుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఈ పనులకు రూ.1269.49 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో నిర్వహించిన టెండర్లో టెక్నికల్ బిడ్ను బుధవారం కర్నూలు ప్రాజెక్ట్ సీఈ మురళీనాథ్రెడ్డి తెరిచారు. ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ), వైఆర్కే (ఎర్రం రామకృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్స్), డీఎస్సార్(జాయింట్ వెంచర్), ఎమ్మార్కేఆర్(మేడా రామకృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ)లు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ► ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్ను తెరుస్తారు. ఈ బిడ్లో తక్కువ ధర(ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని ఎస్ఎల్టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు. ► ఈనెల 29న ఎస్ఎల్టీసీ సమావేశమవుతుంది. టెండర్ ప్రక్రియను పరిశీలించి.. ఆమోదిస్తుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్డర్ జారీ చేస్తారు. -
సీఎం రమేష్ అక్రమాలకు చెక్
గత ప్రభుత్వ హయాంలో భారీగా అంచనాలు పెంచుకొని గాలేరు–నగరి ఫేజ్–2 పనుల్లో కోట్లలో లబ్ధి పొందాలనుకున్న సీఎం రమేష్ (రిత్విక్ కంపెనీ)కు ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్తో అడ్డుకట్ట వేసింది. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టి కాంట్రాక్టర్లు పోటీకి రాకుండారూ.794 కోట్ల గాలేరు–నగరి పనులను రిత్విక్ కంపెనీ అధిక రేట్లకు దక్కించుకుంది. పని కోసం సదరు కంపెనీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హడావుడిగా గత ప్రభుత్వం పనులను సీఎం రమేష్ కంపెనీకి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధిక రేట్లకు పనులు అప్పగించడంతో సుమారు రూ.80 కోట్ల మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గాలేరు–నగరి టెండర్లను సమీక్షించింది. పనుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకుంది. వెంటనే సదరు పని టెండర్లను రద్దు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది. ఈనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి పనుల వేగవంతానికి సిద్ధమవుతోంది. సాక్షి, కడప : జిల్లాలో గాలేరు–నగరి పనులకు సంబంధించి రూ.795 కోట్లు పనులను గత ప్రభుత్వం ఎన్నికల చివరి నిమిషంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కంపెనీకి కట్టబెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం రోజులముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పనులు దక్కించుకునేందుకు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్టు పావులు కదిపింది. అప్పటి సీఎం చంద్రబాబు పేషీ నుంచి జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. అంతకుముందే టెండర్లలో పాల్గొనకుండా మిగిలిన కాంట్రాక్టర్లను సైతం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం సైతం జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను రిత్విక్కు కట్టబెట్టడంలో కీలక భూమిక పోషించారనే ఆరోపణలున్నాయి. అంతకుముందే గాలేరు–నగరిసుజలస్రవంతి రెండోదశ మొదటి ప్యాకేజీ ప్రధాన కాలువ 32.64కిమీ నుంచి 66.150 కి మీ వరకూ తవ్వాల్సి ఉంది. 10 వేల కరాలకు నీళ్లదించే డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు పనుల్లో 2014 నాటికి ుూ.69.89 కోట్ల విలువైన పనులు మిగిలాయి. రెండవ ప్యాకేజీ ప్రధాన కాలువ 66.15 కిమీ నుండి 96.50 వరకూ తవ్వకం చేపట్టాల్సి ఉంది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. రూ.110 కోట్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను బెదిరించి ఒప్పందం రద్దుకు (ప్రీ–క్లోజర్) గత సర్కార్ దరఖాస్తు చేయించింది. దీనిపై జలవనరుల శాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018–19 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ఆధారంగా మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ రెండు నెలల ముందు గాలేరు–నగరి రెండోదశ మొదటి ప్యాకేజీ పనులకు రూ. 391.31 కోట్లఅంచనాతో ప్రిబ్రవరి 11 ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న టెక్నికల్ బిడ్ తెరిచారు. రిత్విక్ ప్రాజెక్ట్, ఎన్సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ షెడ్యూల్లు్న దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్కేఆర్,ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్సీసీ, రిత్విక్ ప్రాజెక్ట్ కంటే ఎక్కువ ధరకు షెడ్యూల్ దాఖలు చేసేలా పావులు కదిపారు. ఖజానాకు రూ. 54.74 కోట్లు మిగిలేవి ఈ టెండర్ల వ్యవహారం కేసు కోర్టు విచారణలో ఉండగానే చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఫిబ్రవరి, 26న ఫైనాన్స్ బిడ్ ఓపన్ చేశారు. సీఎం రమేష్ సంస్థ 3.99 శాతం, ఎక్సెస్ (406.73 కోట్లు), ఎన్సీసీ 4.65 శాతం ఎక్సెస్ 409.50 కోట్లకు టెండరు దాఖలు చేశారు. వీటిని ప్రిబ్రవరి 28 సీవోటీ పరిశీలనకు పంపగా ఒత్తిళ్లకు తలొగ్గి అదే రోజు టెండర్ను ఆమోదించారు. సాధారణ పరిస్థితుల్లో టెండర్ నిర్వహించి ఉంటే కనీసం10 శాతం తక్కువకే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు. అప్పుడు ఖజానాకు రూ. 54.74 కోట్లు మిగిలేవి. ఇదే పద్ధతిలో రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనాతో ఎల్ఎస్–ఓపెన్ విధానంతో నోటిఫికేషన్ జారీ చేయించి 4.76 శాతం అధిక ధరలకు సీఎం రమేష్ కు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై ’ 50.70 కోట్ల భారం పడింది. ఇప్పుడు ప్రజాధనం ఆదా రివర్స్ టెండరింగ్తో ప్రజాధనం ఆదా కానుంది. గాలేరు–నగరి పనులను జగన్ ప్రభుత్వం ఇటీవలనే సమీక్షించింది. గత ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగా యని నిర్దారణకు వచ్చింది. జలవనరుల శాఖ ప్రత్యేఖ అధికారి ఆదిత్యానాథ్ దాస్ ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన గాలేరు–నగరి మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్ట్ విలువగా నిర్ణయించి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించారు. రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో గాలేరు–నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజీ–1లో పనులు ఇలా ప్యాకేజీ–1 పరిధిలో 66.15వ కిలోమీటరు యు.రాజుపాలెం (పెండ్లిమర్రి మండలం) నుండి 94.561 కిలోమీటరు గంగనపల్లె వరకు 28.4 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ పనులు మిగిలి ఉన్నాయి. వీటితోపాటు 52 స్ట్రక్చర్లు, బ్రిడ్జిలు, యూటీ తదితర పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్యాకేజీ–2కు సంబంధించి 32.640 కిలోమీటరు సర్వేరాయసాగర్ నుండి 66.150 కిలోమీటరు నందిమండలం వరకు 33.510 కిలోమీటరు మేర ప్రధాన కాలువ ఉంది. ఈ పనుల్లో కొంతమేర అక్కడక్కడ గతంలోపనిచేసి ఉన్నారు. పాత అంచనాల ప్రకారం రూ.129.94 కోట్ల పనులకుగాను రూ.57.77 కోట్లు కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకోగా, ఇంకా రూ.72.71 కోట్ల బ్యాలెన్స్ వర్క్ మిగిలి ఉంది. కొత్త అంచనాల ప్రకారం రూ. 391.13 కోట్లకు పనులు పెరిగాయి. ప్రస్తుతం ప్రధాన కాలువతోపాటు 70 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా, వీటి పరిధిలో రెండు మాత్రమే నిర్మించారు. ఈ కాలువ పరిధిలో ముద్దనూరు, వీఎన్పల్లె, వేముల, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. -
గాలేరు–నగరి..నిర్లక్ష్యంతో సరి
► బడ్జెట్ కాగితాల్లోనే కనిపిస్తున్న నిధులు ► ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ముందుకు సాగని పనులు ► అధికారులే కారణమంటున్న పాలకులు ► ఎప్పుటికి పూర్తవుతుందో? పాలకులు మారుతున్నారు.. అధికారులు మారిపోతున్నారు.. ఏళ్లు గడిచిపోతున్నాయి.. కృష్ణా జలాలు నగరికి చేరనే లేదు.. రైతుల జీవితాల్లో మార్పు కొంచెమైనా లేదు. అవే అవస్థలు.. కన్నీటి తడులు.. ఎడారిని తలపించే పొలాలు.. ఆశల మోములు.. ఆవేదన సుడిగుండాలు.. అవస్థల బతుకులు.. ఇదీ జిల్లా రైతుల దీన పరిస్థితి. ప్రభుత్వం అధికారుల అలసత్వం వల్ల పనులు ఆలస్యమవు తున్నాయంటోంది. నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేయాలని అధికారులు తలపట్టుకుంటు న్నారు. ఇదీ పాలకుల తీరు. నగరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం గాలేరు–నగరికి శాపంగా మారింది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2009 వరకు పనుల్లో వేగం పుంజుకుంది. తర్వాత ఆయన మరణించారు. ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. కాలువల ఏర్పాటుకు భూములు స్వాధీనం చేసుకున్న పనులే అడపాదడపా చేస్తున్నారు. కాగితాల్లోనే నిధులు 2015–16 వరకు 4,789.96 కోట్లు వెచ్చించారు. 2016–17 బడ్జెట్లో 358.12 కోట్లు, 2017–18లో 363.12 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. జూలై 2017 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇదివరలో చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మాటమార్చింది. ఆడలేనమ్మ మద్దెలపై పడ్డట్టుంది జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రకటించారు. ఆపై మాట మార్చేశారు. అధికారుల అలసత్వం వల్లే పనులు మందకొడిగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. నిధులు విడుదల చేయకుండా తాము ఏపనులు చేస్తామంటూ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఓవైపు కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు. ఇంకా ఎర్త్ వర్క్, రివిట్మెంట్, కాలువల పనులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతంలో ముళ్లకంపలు పేరుకుపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో పగుళ్లు వదలి ఉండటంతో ఇదివరలో చేపట్టిన పనులు కొంతమేరకు మళ్లీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే అంశంలో స్పష్టత రాలేదు. ఏదో ఒకటి చెబుతూ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో తమను మభ్యపెడుతోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని 1.03 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 1.55 లక్షల ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 0.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుంది. 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్పి అవుతాయి. 20 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు.