breaking news
female childrens
-
పుడితే కదా బతికేది
‘నేను పుట్టక ముందే నా మీద హత్యాయత్నం జరిగింది’ అని మొదలవుతుంది ఒక నవల. ఇవాళ దేశంలో పుడుతున్న చాలామంది ఆడపిల్లలు ఆ హత్యాయత్నాన్ని తప్పించుకుని భూమ్మీద పడ్డవారే. అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నవారే. జన్మించాక రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చింది. కాని జన్మించే హక్కుకే ఆడపిల్లకు పెద్ద గండం వచ్చి పడుతోంది.2017–18 సంవత్సరంలో ఈ దేశం కోల్పోయిన ఆడ శిశువుల సంఖ్య దాదాపు 7 కోట్లు అని ఒక అంచనా. మొదటి కాన్పులో అబ్బాయి పుడితే, లేదా గర్భంలో ఉన్నది అబ్బాయి అని తేలితే తల్లిదండ్రులు సంతోషంగా ఆ గర్భాన్ని ఆహ్వానిస్తారు. తర్వాతి కాన్పులో అమ్మాయిని అంగీకరించే అవకాశం ఉంది. కాని తొలి కాన్పులో అమ్మాయి ఉందని తేలి, గత సంవత్సం అటువంటి గర్భాల్ని రాల్చేసిన సంఖ్య దాదాపు రెండున్నర కోట్లు.టెక్నాలజీ మనిషికి మేలు చేస్తుందని అనుకుంటాము కానీ అది చేసే చెడు కూడా ఉంటుంది. స్కానింగ్ సెంటర్లు రాకపూర్వం గర్భంలో ఉన్న శిశువులకు వచ్చే సమస్యలను తెలుసుకోవడం, పిండ ఆరోగ్యాన్ని గమనించడం కష్టంగా ఉండేది. స్కానింగ్ సెంటర్లు వచ్చాక పిండ ఆరోగ్య ప్రాధాన్యం వెనక్కు వెళ్లి ఆ పిండం అబ్బాయా అమ్మాయా తేలడం ముఖ్యం అయిపోయింది. లింగ నిర్థారణ పరీక్ష ఫలితం విచక్షణ లేకుండా బయటపెట్టడం వల్ల దేశంలో కోట్లాది అబార్షన్లు జరిగాయి. అవన్నీ ఆడశిశువును వద్దనుకున్నవే. దీనిని గమనించిన ప్రభుత్వం 1994లో ‘ప్రీ కన్సెప్షన్ ప్రీనాటల్ డయాగ్నస్టిక్ యాక్ట్’ (పిసిపిఎన్డిటి యాక్ట్) తీసుకు వచ్చింది. దీనిప్రకారం స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్థారణ చేయడం నేరం. కాని ఈ చట్టం వచ్చాక కూడా పరిస్థితి పూర్తిగా మెరుగవలేదని సర్వేలు చెబుతున్నాయి. 2016 ‘సెక్స్ రేషియో ఎట్ బర్త్’ (ఎస్ఆర్బి) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఉన్న అమ్మాయిల సంఖ్య 806. ఇది జాతీయ సగటు 877 కంటే తక్కువ. తెలంగాణలో ఈ సంఖ్య కొంత మెరుగ్గా 881గా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ ప్రకారం 2016కు ప్రకటించుకున్న సంఖ్యలు ఆంధ్రప్రదేశ్ 947గా, తెలంగాణ 917గా ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవచ్చు.. ఎలాగైనా చేయొచ్చు.. పిఎన్డిటి చట్టం ప్రకారం ప్రభుత్వ ధ్రువీకరణ లేని స్కానింగ్ సెంటర్లు గర్భిణులకు పరీక్షలు చేయకూడదు. వారికి దొంగ గుర్తింపు కార్డులు ఇవ్వడం, వేరే పేరు నమోదు చేసి పరీక్షించడం ఇవన్నీ నేరం. ప్రతి రికార్డు నిక్షిప్తం చేయాలి. యంత్ర తయారీ సంస్థలు కూడా గుర్తింపు ఉన్న సంస్థలకే స్కానింగ్ మెషినరీని అమ్మాల్సి ఉంటుంది. కాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది అనుమతి లేని వ్యక్తులు ఈ స్కానింగ్ సామగ్రిని కొనుగోలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న సెంటర్లు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్.ఎం.పి డాక్టర్లే తమ క్లినిక్లలో ఈ సామగ్రి పెట్టి పరీక్షలు చేసి పుట్టేది ఆడపిల్లో మగపిల్లాడో చెప్పేస్తున్నారు. మామూలు స్కానింగ్కు ఆరువందల రూపాయలు అయితే అమ్మాయో అబ్బాయో చెప్పడానికి మూడు వేల నుంచి ఆరువేల రూపాయలు తీసుకుంటున్నారు. దీనిని నిరోధించే అజమాయిషీ బృందాలు జిల్లాల వారీగా లేకపోవడం ఒక కారణం. ఈ అజమాయిషీ బృందాల ఖర్చు కేంద్రం భరించి ఆ నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా పిఎన్డిటి చట్టాన్ని అధికారులు తమకు గిట్టని డాక్టర్ల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తున్నారని కొన్ని పెద్ద హాస్పిటళ్ల అధినేత గుర్రుగా ఉన్నారు. చాలా తక్కువ చోట్ల మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీం పట్నంలో లింగ్ నిర్థారణ చేస్తున్న ఒక సెంటర్పై పోలీసులు మారువేషంలో వెళ్లి దాడి చేసి ఆ సెంటర్ను మూయించారు. కాని ఇలా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలోనూ జరగడం లేదు. ఈ చట్టం వచ్చాక లింగ నిర్ధారణ చేసి పట్టుబడి శిక్ష అనుభవించిన డాక్టర్ ఒక్కరూ లేరని తెలిస్తే దీని అమలు ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ మోడల్ బెస్ట్ ఢిల్లీలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడ శిశువుల మరణానికి కారణమవుతున్న స్కానింగ్ సెంటర్లపై అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడికి దిగింది. అటువంటి సెంటర్ల గురించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వ్యక్తికి యాభై వేల రూపాయల బహుమతి ప్రకటించింది. అందుకు సహకరించి ‘స్టింగ్ ఆపరేషన్’ లో పాల్గొన్న నిజ గర్భిణీకి ఏకంకా లక్షన్నర రూపాయల కానుక ప్రకటించింది. ఉత్తరాదిలో ఆడ శిశువుల మరణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యాణా, రాజస్తాన్, ఢిల్లీ ముందు వరుసలో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ దురవస్థకు దూరంగా ఉన్న రాష్ట్రంగా కేరళ మార్కులు కొట్టేసింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతంత మాత్రమే.ప్రజలలో మార్పు, ప్రభుత్వాల పూనిక ఆడపిల్లను పుట్టనిస్తాయి. ఆడపిల్లను ఎదగనిస్తాయి. ఆడపిల్లను కన్నందుకు సమాజం గర్వపడేలా వారు నిరూపించుకోవడానికి అవకాశమిస్తాయి. అటువంటి దశవైపు మనం త్వరత్వరగా అడుగులు వేయాలని ఆశిద్దాం. -
కనురెప్పలు కాటేశాయ్
♦ ముగ్గురు బాలికలకు విషమిచ్చి బావిలో తోసిన తండ్రి ♦ ఇద్దరు మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరో బాలిక ♦ నాయుడుపేటలో చంటిబిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి తండ్రే కాలయముడై.. కనురెప్పలే కంటిని కాటేశాయి. భార్య వదిలి వెళ్లిపోయిందన్న అక్కసుతో ముగ్గురు కుమార్తెలకు విషం తాగించి బావిలో తోసేశాడు ఓ తండ్రి. వారిలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడగా.. మరో బాలిక ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఏం కష్టవచ్చిందో తెలీదుగానీ కడుపు తీపిని చంపుకున్న ఓ తల్లి ఏడాది బిడ్డతో కలిసి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేట పట్టణ పరిధిలోని తూమ్మురు గ్రామ సమీపంలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. కామిరెడ్డిపాడు (సోమశిల) : పేదరికంలో పుట్టినా వారిది అందమైన జీవితం. ముత్యాల్లాంటి ముగ్గురు ఆడ పిల్లలు ఆ ఇంట్లో సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు తెగమురిసిపోయారు. అంతలోనే సంతో షం ఆవిరైంది. కుటుంబానికి ఆర్థిక ఉన్నతి కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం అప్పు చేసి మరీ ఆ ఇంటాయన కువైట్ వెళ్లాడు. ఇదే అదునుగా మరో వ్యక్తితో చనువు పెంచుకున్న ఆ ఇంటావిడ 20 రోజుల క్రితం బిడ్డల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి ఆమె భర్త రెండురోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. మనసులో రగిలిన సంఘర్షణ అతణ్ణి స్థిమితంగా ఉండనివ్వలేదు. మానవ మృగంలా మారి తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చాడు. అక్కడితో ఆగకుండా వారిలో ఇద్దర్ని నూతిలోకి విసిరేశాడు. మూడో బిడ్డనూ విసిరేయబోతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే విష ప్రభావానికి గురైన ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో హరిత(8), కీర్తి(6) అనే చిన్నారులు మరణించగా.. ప్రేమ (4) ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం కువైట్కు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన నల్లు పెంచలరత్నంకు వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి ఎగువమిట్టకు చెందిన భానుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. పెంచలరత్నం జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం అప్పు చేసి కువైట్ వెళ్లి గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. ఈ క్రమంలో అతని భార్య భాను గ్రామంలోని సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుని 20 రోజుల క్రితం పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అనంతసాగరం పోలీసులకు ఫిర్యాదు సైతం అందింది. విషయం తెలుసుకున్న పెంచలరత్నం రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్నాడు. ముగ్గురు బిడ్డల్ని గ్రామానికి సమీపంలోని పొలాల్లో గల దిగుడు బావి వద్దకు తీసుకెళ్లాడు. ముగ్గురికీ పురుగు మందు తాగించి హరిత, కీర్తిలను బావిలోకి తోసేశాడు. కాలనీ వాసులు గమనించి మూడో కుమార్తె ప్రేమను బావిలో పడేయనివ్వకుండా అడ్డుకున్నారు. బాలికను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. పెంచలరత్నంను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ కేఎస్వీ సుబ్బారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సోమశిల ఎస్సై శివరాకేష్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆత్మకూరు తరలించారు. గ్రామంలో విషాదం ఇద్దరు పసికందులు తండ్రి ఘాతుకానికి బలైపోయారన్న విషయం తెలిసి ఘటనా స్థలానికి గ్రామస్తులు తండోతండలుగా తరలివచ్చారు. బిడ్డల్ని చంపేందుకు చేతులెట్టాడాయిరా అంటూ వాపోయారు. అందరితో కలివిడిగా తిరిగే చిన్నారులు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే కొంప తీసింది పెంచలరత్నం కువైట్ వెళ్లడంతో అతని భార్య సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తితో కలిసి తరచూ భర్త పెంచలరత్నంకు సెల్ఫోన్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసిన భర్త ఫోన్లో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో 20 రోజుల క్రితం ఆమె ఆ వ్యక్తితో కలిసి పరారైంది. విషయం తెలిసి స్వగ్రామానికి చేరుకున్న పెంచలరత్నం భార్యపై కోపాన్ని బిడ్డలపై చూపాడు. ఆమెకు పుట్టిన బిడ్డలు తనకొద్దంటూ ఘాతుకానికి పాల్పడ్డాడు.