breaking news
ESI medical college
-
ఆధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు: దత్తాత్రేయ
హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానంతో కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి హైదరాబాద్ సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్, సర్జికల్ స్కిల్స్ ల్యాబ్, ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెలి మెడిసిన్ విధానంతో కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. సమయం ఆదా కావడంతోపాటు దూర ప్రాంత నివాసితులకు సకాలంలో వైద్యసేవలు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఒడిశా రాష్ట్ర ఉపాధికల్పన శాఖ సాయంతో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాజ్ హెల్త్కేర్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల, రామచంద్రాపురం మరికొన్ని డిస్పెన్సరీలను టెలి మెడిసిన్కు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటగా ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ను అందుబాటులోకి తేవడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దేవికారాణి, ఆసుపత్రి డీన్ శ్రీనివాస్, ఓటెట్ ట్రస్ట్ ఎండీ కె.ఎన్.భగత్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ మెడికల్ కాలేజీల బాధ్యత ఇక రాష్ట్రాలకే
తిరువనంతపురం: ఈఎస్ఐ వైద్య కళాశాలలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేందుకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయం తీసుకుందని ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారమిక్కడ వెల్లడించారు. ఒక్కో కళాశాల నిర్వహణకు ఏటా రూ.80 కోట్ల వరకు ఖర్చవుతోందని, ఆ మొత్తాన్ని ఇకపై కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించనున్నట్లు వివరించారు. ఇప్పటికే నిర్మాణ ంలో ఉన్న కొల్లంలోని ఈఎస్ఐ కళాశాలను కేరళ ప్రభుత్వానికి అప్పగించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. వారు వీటితో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందే వీలుంటుందని తెలిపారు. కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు జాతీయ వృత్తి నైపుణ్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.