breaking news
Dr padma
-
అక్రమ డిప్యుటేషన్లపై కలెక్టర్ ఆగ్రహం
సంగారెడ్డి అర్బన్, న్యూస్లైన్: డీఎంహెచ్ఓ కార్యాలయంలో అక్రమ డిప్యుటేషన్ల హవా శీర్షికన సాక్షి దినపత్రికలో వెలువడిన కథనానికి కలెక్టర్ స్మితా సబర్వాల్ స్పందించారు. మంగళవారం ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మను ఏజేసీ మూర్తి సమక్షంలో విచారణకు ఆదేశించారు. పీహెచ్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా కార్యాలయంలో దర్శనమివ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా పైరవీలేమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో కార్యాలయ పనుల నిమిత్తం మాత్రమే జిల్లా కేంద్రానికి వస్తున్నారని డీఎంహెచ్ఓ కలెక్టర్కు వివరణ ఇచ్చారు. కాగా డిప్యుటేషన్లపై కేవలం ఇద్దరు (వాచ్మెన్, ఇమ్యునైజేషన్ సిబ్బంది) మాత్రమే పనిచేస్తున్నారని డీఎంహెచ్ఓ తెలిపారు. కానీ వాస్తవంగా ఆమె పేర్కొంటున్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల తరఫున వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టమవుతోంది. అంతేగాక నిబంధనల మేరకే డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని చెప్పారు. కొత్తవారినెవరిని తీసుకోలేదన్నారు. రికార్డుల ప్రకారం పుల్కల్ పీహెచ్సీ నుంచి పెంటయ్య ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో ఎల్డీ కంప్యూటర్గా, ఆంజనేయులు ఎంఎన్ఓగా జగదేవ్పూర్ పీహెచ్సీలో పనిచేయాల్సి ఉండగా ఎపడమిక్ సెల్లో ఆఫీస్ సబార్డినేట్గా, ప్రేమ్సాగర్ తూప్రాన్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉండగా డీఎంహెచ్ఓ సీసీగా పనిచేస్తున్నారు. ఎంపీహెచ్ఓగా కొండాపూర్ పీహెచ్సీలో పనిచేయాల్సిన ఫయీం మలేరియా శాఖలో, తాజుద్దీన్ వెల్దుర్తి పీహెచ్సీలో ఎంపీహెచ్ఓగా పనిచేయాల్సి ఉండగా మలేరియా శాఖలో పనిచేస్తున్నారు. -
పల్స్పోలియోకు సర్వం సిద్ధం
సంగారెడ్డి అర్బన్, న్యూస్లైన్: జిల్లాలో పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 3,53,656 మంది ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి వారందరికీ చుక్కలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 450 వేల పోలియో చుక్కలు అందుబాటులో ఉంచా రు. ఈ కార్యక్రమ నిర్వహణకు 9,368 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. సీహెచ్ఎన్సీ, ఎస్పీహెచ్ఓ, ప్రోగ్రామ్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఆస్పత్రులు, పీహెచ్సీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రధాన కూడళ్లలో బూత్లను ఏర్పాటు చేసి చుక్కల మందు వేయనున్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మ తెలిపారు. డయేరియా, వాంతులు ఉన్న వారికి చుక్కలు వేయరాదన్నారు. మురికి వాడల్లో నివసిస్తున్న వారు, వలస సంచార జీవనం సాగిస్తున్న వారికి ప్రత్యేకంగా 21వ తేదీన జిల్లాలో మొత్తం 86 మొబైల్ యూనిట్ల ద్వారా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కలు వేస్తామన్నా. క్లస్టర్ల వారీగా చిన్నారుల గుర్తింపు.. జిల్లాలో క్లస్టర్ల వారీగా ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించినట్టు ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మ తెలిపారు. నర్సాపూర్ క్లస్టర్లో 22,689 మంది, రామాయంపేటలో 41,340, జోగిపేటలో 25,019, నారాయణ్ఖేడ్లో 32,287, కోహీర్లో 40,648, సదాశివపేటలో 39,338, పటాన్చెరులో 45,744, సిద్దిపేటలో 36,249, దుబ్బాకలో 8,735, గజ్వేల్లో 37,960 మంది పిల్లలను గుర్తించినట్టు చెప్పారు. పోలియో రహిత సమాజానికి కృషి చేయాలి కలెక్టరేట్, న్యూస్లైన్: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు జేసీ మూర్తి తెలిపారు. ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు జేసీ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఐకేపీ, వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో కార్యక్రమాన్ని వంద శాతం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ పూర్ణచంద్ర, మున్సిపల్ కమిషనర్లు, నగర పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొనాలి.. పల్స్ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విధిగా పాల్గొనాలని డీపీఓ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి 25 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశానికి హాజరు కాని పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.