breaking news
Digital Policies
-
3 నెలలు వాయిదా వేయండి: కేంద్రానికి ట్విటర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలపై ట్విటర్ స్పందించింది. కొత్త ఐటీ నిబంధనల అమలుకు 3 నెలలు గడువును ట్విటర్ కోరింది. కేంద్రంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనలపై సోషల్ మీడియా సంస్థలకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రం, వాట్సప్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త నిబంధనల్లో మార్పుల కోసం న్యాయపరంగా వెళ్తామని ట్విటర్ పేర్కొంది. మే 26వ తేదీ నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. కొత్త డిజిటల్ నిబంధనల వల్ల తమ వినియోగదారుల ప్రైవసీ ప్రొటెక్షన్ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ వాదిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ నిబంధనలపై ట్విటర్ స్పందించింది. భారత చట్టాలను అమలు చేసేందుకు పాటిస్తామని పేర్కొంటూనే ఆ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విటర్ కింది విధంగా స్పందించింది. ‘మేము భారత ప్రజల సేవకు కట్టుబడి ఉన్నాం. ప్రజల సమాచార గోప్యతకు భంగం కలిగించం. కరోనా సమయంలో ట్విటర్ ప్రజలకు ఉన్నదని అందరికీ తెలిసిందే. అలాంటి సేవలను అందుబాటులో ఉంచేందుకు మేం భారత న్యాయసూత్రాలకు అనుగుణంగా పని చేసేందుకు ప్రయత్నిస్తాం. గోప్యత.. పారదర్శకత విషయంలో మేం కచ్చితంగా పాటిస్తాం. ఈ విషయంలో ప్రపంచమంతటా ఒకే నిబద్ధతతో ఉన్నాం. మేం ఇదే కొనసాగిస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూనే చట్టాలకు లోబడి ఉంటాం’ అని ట్విటర్ ప్రతినిధి తెలిపారు. ‘అయితే భారత కొత్త చట్టాలతో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కొంతకాలంలో భారత్లో మా ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, మేం సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయని మా ఆందోళన. ఇలాంటి చట్టాలు రావడం బాధాకరం. సోషల్ మీడియాలో ప్రశాంత చర్చలకు భంగం కలగకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. దీనిపై భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తాం. ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదే’ అని ట్విటర్ స్పష్టం చేసింది. చదవండి: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్ -
కేంద్రం కొత్త నిబంధనలపై వాట్సాప్ న్యాయపోరాటం
-
WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల సదుపాయం తమ ఖాతాదారులకు ఉందని గుర్తుచేసింది. సందేశం పంపినవారు, స్వీకరించిన వారు తప్ప ఇతరులు ఆ మెసేజ్లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరినపుడు లేదా కోర్టులు అడిగినపుడు తొలుత సందేశాన్ని సృష్టించిన వారిని గుర్తించాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయని, ఇది సరైన విధానం కాదని వెల్లడించింది. దీనివల్ల ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్లో ఒక సందేశం మొదట ఎక్కడ పుట్టింది, దాన్ని మొదట ఎవరు సృష్టించారు అనేది గుర్తించి, ధ్రువీకరించాలని ఆదేశించడం... గోప్యత హక్కుకు భంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌర సమాజంతో కలిసి పనిచేస్తాం: వాట్సాప్ కొత్త ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాము వ్యాజ్యం దాఖలు చేయడం నిజమేనని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలియజేశారు. ‘‘కొత్త డిజిటల్ నిబంధనలు అనుచితంగా ఉన్నాయి. వాట్సాప్లో ఒకరికొకరు పంపుకొనే మెసేజ్లను ట్రేస్ చేయాలని, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం అంటే వాట్సాప్లో షేర్ అయ్యే ప్రతి ఒక్క మెసేజ్ తాలూకు సమాచారాన్ని భద్రపర్చమని కోరడమే. అలాగే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. కోట్లాది మంది ప్రజల గోప్యత హక్కును కూడా పణంగా పెట్టినట్లే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... గోప్యత హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఉల్లంఘించడమే’ అని బుధవారం వాట్సాప్ పేర్కొంది. డాక్టర్లు– పేషెంట్లు, లాయర్లు– కక్షిదారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు... ఇలా ఎందరో వాట్సాప్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకుంటారంది. తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడడానికి పౌర సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో కలిసి పని చేస్తామని తెలిపింది. 36 గంటల్లోగా తొలగించాల్సిందే.. సామాజిక మాధ్యమాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు–2021ను ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సోషల్ మీడియా కంపెనీలు 36 గంటల్లోగా తొలగించాలి. ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై స్పందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్టు ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించుకోవాలి. అభ్యంతరకరమైన సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను (పోర్నోగ్రఫీ) తొలగించడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్ వాడాలి. ఏదైనా సందేశాన్ని/ సమాచారాన్ని మొదట ఎవరు సృష్టించారనేది గుర్తించే ఏర్పాటు ఉండాలని కొత్త నిబంధనల్లోని రూల్ 4(2) చెబుతోంది. దీనినే వాట్సాప్ కోర్టులో సవాల్ చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడానికి కేంద్రం 3నెలల గడువిచ్చింది. ఇది మంగళవారంతో ముగిసింది. సోషల్ మీడియా సంస్థలకు ఇదివరకు ‘మధ్యవర్తి హోదా’తో రక్షణ ఉండేది. తమ ఖాతాదారులు పోస్ట్ చేసే కంటెంట్కు సంబంధించి వీటిపై క్రిమినల్ కేసులు, నష్టపరిహారం కేసులకు వీల్లేకుండా ఈ మధ్యవర్తి హోదా కాపాడేది. కొత్త ఐటీ నిబంధనలను అంగీకరించకపోతే ఈ ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోతాయి. ఫలితంగా ఎవరు, ఏది పోస్ట్ చేసినా దానికి ఈ సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అత్యంత తీవ్ర నేరాలను అడ్డుకునేందుకే! కొత్త నిబంధనలన్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అత్యంత తీవ్ర నేరాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో ప్రచారమైన సందేశాల మూలం తెలుసుకునేందుకే కొత్త డిజిటల్ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలతో సత్సంబంధాలు, దేశ రక్షణ, దేశంలో శాంతి భద్రతలు మొదలైనవాటికి విఘాతం కలిగించే అవకాశమున్న నేరాలు, లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు తదితరాలను అడ్డుకోవడానికి, అలాంటి తీవ్ర నేరాల విచారణకు సంబంధిత సోషల్ మీడియా సందేశాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో, ఎలా వ్యాప్తి చెందాయో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాంటి సందేశాల వివరాలు వాట్సాప్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటల్ నిబంధనలను ‘వాట్సాప్’ చివరి నిమిషంలో కోర్టులో సవాలు చేయడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలతో పోలిస్తే.. భారత్ ప్రతిపాదిస్తున్న నిబంధనలు అంత తీవ్రమైనవి కావని వెల్లడించింది. ప్రైవసీ హక్కును ప్రాథమిక హక్కుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలతో వాట్సాప్ సాధారణ కార్యకలాపాలకు, వాట్సాప్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. వారి కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను పాటించే విషయంలో తాజా పరిస్థితిని తక్షణమే తమకు తెలియజేయాలని కేంద్ర ఐటీ శాఖ ప్రధాన సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. అప్రమత్తతతో వ్యవహరించాలంది. తాజా సోషల్ మీడియా నిబంధనల్లో పేర్కొన్న మేరకు.. భారత్లోని తమ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ల వివరాలను తమకు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. సంబంధిత సామాజిక మాధ్యమానికి చెందిన యాప్ పేరు, వెబ్సైట్ పేరు, అందించే సేవలు వివరాలను తెలియజేయాలంది. ఒకవేళ తాము ఈ నిబంధనల పరిధిలోకి రామని భావిస్తే అందుకు కారణాలను వెల్లడించాలి. సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే తాము కోరిన వివరాలను అందించాలని బుధవారం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ప్రధాన సోషల్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో అవి ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌలభ్యాలను కోల్పోవడంతో పాటు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని హెచ్చరించింది. ఇదీ ‘సోషల్ పవర్’ సోషల్ మీడియా వేదికలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ సంస్థలకు ఉన్న వినియోగదారుల సంఖ్య ఇలా ఉంది. వాట్సాప్ 53 కోట్లు ఫేస్బుక్ 41 కోట్లు యూట్యూబ్ 44.8 కోట్లు ఇన్స్టాగ్రామ్ 21 కోట్లు ట్విట్టర్ 1.75 కోట్లు -
కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్
న్యూఢిల్లీ: ఈరోజు(మే 26) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్ నిబంధనల వల్ల తమ వినియోగదారుల ప్రైవసీ ప్రొటెక్షన్ విచ్ఛిన్నం అవుతుందని వాట్సాప్ చెబుతుంది. అందువల్ల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ఆపేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ ఢిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తాజా నిబంధనలలో ఒకటి భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టుకు తెలిపింది. దీనివల్ల 40 కోట్ల భారతీయ వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం తాము అడిగినప్పుడు సమాచారాన్ని వెంటనే అందివ్వాలని సోషల్ మీడియా కంపెనీలకు అధికారులు డిమాండ్ చేస్తారని, ఇది గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వాట్సాప్ ఫిర్యాదులో పేర్కొంది. వాట్సాప్ ప్లాట్ఫామ్లోని సందేశాలకు ఎండ్-టు-ఎండ్ భద్రత ఉంటుందని ప్రస్తుత నిబంధనలను పాటించాలంటే ఎండ్-టు-ఎండ్ భద్రతను విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనలలో మొదట ఎవరు ఫేక్ న్యూస్/తప్పుడు వార్తలను ప్రచారం చేశారో గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలి. అందుకే వాట్సాప్ నిబంధనలను వ్యతిరేకిస్తుంది. సోషల్ మీడియా కంపెనీలు అమలు చేయాల్సిన కొత్త నిబంధనల గురుంచి కేంద్రం మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. చదవండి: స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు -
డిజిటల్ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన కొత్త టెలికాం పాలసీ ‘నేషనల్ డిజిటర్ కమ్యునికేషన్ పాలసీ 2018’ డ్రాఫ్ట్ ద్వారా 2022 కల్లా డిజిటల్ కమ్యునికేషన్ రంగంలో దాదాపు 40 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పాడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వినియోగాదారుడికి దాదాపు 50 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో డిజిటల్ కమ్యునికేషన్ వాటా 6 శాతంగా ఉంది. ఈ పాలసీ ద్వారా అది 8 శాతానికి పెరగనుంది. -
స్కూల్ బ్యాగు భారం తగ్గనుంది: జవదేకర్
నీముచ్: విద్యార్థులపై స్కూలు బ్యాగుల భారం తగ్గించేందుకు కేంద్రం త్వరలో సరికొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్ల డించారు. పాఠశాలల్లో డిజిటల్ విధానాలు అవలంబిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లా జవాద్లో 20 హైటెక్ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ప్రతిపాదిత పథకం కింద డిజిటల్ బోర్డు, ప్రొజెక్టర్ను సమకూర్చుకునే పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన సాఫ్ట్వేర్ను ప్రవేశపెడతామన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు సుమారు 70 లక్షల మంది ఉపాధ్యాయులు 26 కోట్ల మంది విద్యార్థులకు బోధిస్తున్నారని వివరించారు.