ఇదో గో‘దారి’దోపిడీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :దేవీపట్నం-సింగనపల్లి (పశ్చిమగోదావరి) మధ్య ప్రయాణికులను గోదావరి దాటించే రేవు దేవీపట్నం మండల పరిషత్ ఆధీనంలో ఉంది. ఈ రేవులో దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన మండలాధికారులే దోపిడిలో భాగస్వాములవుతున్నారు. కనిష్ట నిర్ణాయక ధర ఉత్తర్వులు జిల్లాపరిషత్ నుంచి ఇంకా అందలేదనే కుంటిసాకుతో 2014-15 సంవత్సరానికి రేవు వేలం హక్కులను పాతపాటదారుకే కట్టబెట్టేశారు. ముందు పత్రికల్లో ప్రకటన ఇచ్చి, నిర్దేశించిన సమయంలో బహిరంగ వేలం నిర్వహించాలి. ఎక్కువకు పాడుకుని, రేవుపై హక్కు దక్కించుకోవాలనుకుంటే..వేలంలో ముందుగా 40 శాతం, పాడుకున్న మూడు నెలల లోగా మిగిలిన 60 శాతం సొమ్ము చెల్లించాలి.
అలా చెల్లించకపోతే రేవు నిర్వహణ ఒప్పందాన్ని రద్దు చేసి తిరిగి వేలం నిర్వహించొచ్చు. వేలంలో పాల్గొనే వారు సాల్వెన్సీ (పూచీగా ఆస్తులు చూపడం) ఇవ్వాలి. వేలంలో పాడిన సొమ్ము చెల్లించకుంటే ఆ ఆస్తుల ద్వారా ఆ సొమ్మును రాబట్టుకోవాలి. కానీ ఈ రేవుకు మూడేళ్లుగా వేలమనేదే లేదు. అక్కడి మండలపరిషత్ అధికారులు చెప్పిందే శాసనం, చేసేదే చట్టం. ఉన్నతాధికారులు ఎప్పుడైనా అడుగుతారేమోననే భయం లేకుండా అడ్డగోలుగా తమకు నచ్చిన వారికి రేవును అప్పగించేస్తున్నారు. ఈ ఏడాది కూడా వేలం ఊసే లేకుండా గత పాటదారుడికే రోజు వారీ రూ.1103 ప్రతిపాదికన చెల్లించే ఒప్పందంతో రేవును ధారాదత్తం చేసేశారు. గత ఏడాది నిర్ణయించిన మొత్తం రూ.3,65,999కు కేవలం 10 శాతం పెంచి చూపించి రూ.4,02,599కు పాతపాటదారుకే వచ్చే మార్చి వరకు రేవు హక్కులు కట్టబెట్టేశారు.
ఆ మొత్తంలోనూ ఎగవేతే..
కాగా.. అతి తక్కువకు వేలం ఖరారు చేసినప్పుడు కూడా పాటదారు పూర్తి సొమ్ము జమ చేయకుండా ఖజానాకు కన్నం పెట్టిన వైనమూ వెలుగులోకి వచ్చింది. ఇలా ఎగవేసిన సొమ్ము రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ రేవును 2009-10లో రూ.4.50 లక్షలకు పాడుకున్న కంఠంశెట్టి పాశాలయ్య చెల్లించింది రూ.2,45,547 మాత్రమే. మిగిలిన రూ.2,04,534 ఎగవేశారు. 2010-11లో రూ.5.50 లక్షలకు పాడుకున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బొరుసు వీరవెంకటసత్యనారాయణ ఖజానాకు చెల్లించింది రూ.2.70 లక్షలు మాత్రమే. మిగిలిన రూ.2.80 లక్షలు చెల్లించలేదు. అదేంటని అడిగిన నాథుడే లేడు. 2011-12లో వేలం నిర్వహించగా సూరం వెంకన్నదొర రూ.3,00,499కు పాడుకున్నారు. ఏడాది పాటు ప్రయాణికుల నుంచి సొమ్ములు వసూలు చేసుకున్నా ఆ సంవత్సరానికి ు నిర్వహణకు ఒక్క పైసా కూడా జమచేయలేదు. ఇటీవల దేవీపట్నం ఉపసర్పంచ్ పోలిశెట్టి శివరామకృష్ణ నాయుడు సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే ఈ విషయాన్ని జిల్లా పరిషత్తు తెలియచేయడం గమనార్హం. ఏ ఏడాది బహిరంగ వేలం ద్వారా ఎంత సొమ్ము వచ్చింది, ఎంత జమ చేశారనే దానిపై అధికారులు పెదవివిప్పడం లేదు.
చివరికి వేలానికీ ఎగనామం..
రేవుకు 2012-13, 2013-14 సంవత్సరాల్లో వేలం నిర్వహించకుండానే రూ.3,65,999కు కట్టబెట్టారు. ఆ రెండేళ్లూ రోజుకు రూ.1668 వంతున జమచేసేలా రేవును కట్టబెట్టేశారు. 2014-15 వచ్చేసరికి రోజుకు రూ.1103కు అప్పగించడం గమనార్హం. ఎక్కడైనా ఒక ఏడాదికి మరో ఏడాదికి వేలం సొమ్ము పెరుగుతుంటుంది. కానీ ఇక్కడ మాత్రం తగ్గుతూ వస్తోంది. అక్కడి మండలాధికారులు తమకు నచ్చిన వారికి నచ్చినంతకు కట్టబెట్టేసి అందినకాడికి వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. 2011-12లో ఈ రేవు నుంచి ప్రయాణికులను దాటించే హక్కుకు రోజుకు రూ.1668 చెల్లించాలనిఅధికారులు నిర్ణయించారు.
అప్పుడు ప్రయాణికుడి నుంచి రూ.5, వాహనానికి రూ.10 వసూలు చేసేవారు. 2013-14కు వచ్చేసరికి అడ్డగోలుగా వేలం హక్కులు కట్టబెట్టిన నిర్వాహకుడిపై ‘కరుణ’ చూపుతూ మండలాధికారులు రోజువారీ అద్దె తగ్గించేశారు. దాని ప్రకారం ప్రయాణికులకు టిక్కెట్ల ధరలు తగ్గించడం మాట అటుంచి రూ.5కు బదులు రూ.10 వసూలుకు అనుమతించేశారు. వాహనదారుల నుంచి రూ.10కు బదులు రూ.20, రూ.30 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఏటా అనధికారికంగా రేవును కట్టబెడుతున్న వారి పేర్లు మారుస్తూ ఒకే బినామీదారు రేవును గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, మండలాధికారికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడమే దీనికి కారణమని అంటున్నారు.
నివేదిక కోరిన పీఓ
దేవీపట్నం-సింగనపల్లి రేవుకు సంబంధించి అన్ని వివరాలు తన కార్యాలయానికి అందజేయాలని ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు దేవీపట్నం ఎంపీడీఓ బి.శివమూర్తిని ఆదేశించారు. ఇప్పటి వరకూ పాటదారులు ఎంత బకాయి చెల్లించాలి, తీసుకున్న చర్యలు, ప్రస్తుత ఏడాదికి ఎందుకు వేలం నిర్వహించలేదు, బినామీలు రేవు నిర్వహించడంపై తీసుకున్న చర్యలు తదితర వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించినట్టు పీఓ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ఎంపీడీఓ శివమూర్తిని వివరణ కోరగా పాటదారులు బకాయిలున్న మాట వాస్తవమేనని, నోటీసులు జారీచేస్తున్నామని చెప్పారు.