breaking news
croplands
-
నేల.. నిస్సారం
న్యూఢిల్లీ: దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయి అని అభ్యుదయ కవి గురజాడ అప్పారావు తన రచనల ద్వారా ఉపదేశించారు. అయితే దేశంలో మనుషులను మాత్రమే పట్టించుకుంటే సరిపోదని, మట్టిని సైతం అందులోనూ సేద్యభూములనూ పట్టించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తాజా అధ్యయనం కొత్త ప్రమాద ఘంటికలు మోగించింది. మనుషులు బాగుండాలంటే వాళ్లు తినే ఆహారం పోషకాలతో సమృద్ధిగా ఉండాలి. పోషకాలు సమపాళ్లలో ఉండాలంటే పంటలు పండించే నేలల్లో సహజ పోషకాలు తగు మోతాదులో ఉండాలి. అయితే అధిక దిగుబడి ఆశతో రైతన్నలు కోట్ల టన్నుల కొద్దీ కృత్రిమ రసాయనాలను పొలాల్లో వెదజల్లుతూ నేల సహజ సారానికి ఉరివేస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. భారతీయ నేలల్లో సహజ పోషకాలైన నైట్రోజన్, సేంద్రీయ కార్బన్ల మోతాదుకు చాలా తక్కువగా ఉందని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే మేథో సంస్థ అయిన ‘ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్’ ప్రకటించింది. సంస్థ తన అధ్యయనంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ‘నేల ఆరోగ్య కార్డు’ల నుంచి సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి చేదు నిజాలను బహిర్గతంచేసింది. రాజస్థాన్లోని నీమ్లీ పట్టణంలోని అనిల్ అగర్వాల్ పర్యావరణ శిక్షణా కేంద్రంలో జరిగిన సుస్థిర ఆహార వ్యవస్థల జాతీయ సదస్సులో ‘సుస్థిర ఆహార వ్యవస్థలు: వాతావరణ మార్పుల వేళ అజెండా’’ పేరిట ఈ నివేదికను విడుదలచేశారు. 64% నేలల్లో తక్కువ నైట్రోజన్ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని నేల శాంపిళ్లపై అధ్యయం చేయగా 64 శాతం శాంపిళ్లలో నైట్రోజన్ తగు మోతాదులో లేదని తేలింది. ఇక 48.5 శాతం శాంపిళ్లలో సేంద్రీయ కర్బనం తక్కువగా ఉందని అధ్యయనం కుండ బద్దలు కొట్టింది. భారత్లో 2023–24కాలంలో రైతులు ఏకంగా 601 లక్షల మెట్రిక్ టన్నుల కృత్రిమ ఎరువులను తమ సాగుభూముల్లో వినియోగించారు. ఇన్ని కోట్ల టన్నుల ఎరువులు వాడినా సాగు నేలల్లో నైట్రోజన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదల కన్పించలేదని అధ్యయనం ప్రకటించింది. నైట్రోజన్, సేంద్రీయ కర్బనం తగు మోతాదులో ఉంటేనే ఆ భూమిలో పంట బాగా పండుతుంది. వాతావరణ మార్పులను సైతం తట్టుకుంటూ పంట బలంగా ఎదుగుతుంది. అతిగా ఫెర్టిలైజర్లనూ వాడినా అది నేల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వైఫల్యాన్ని చవిచూస్తోందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘కృత్రిమంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మిశ్రమ ఎరువులను ఉపయోగించినా ఎలాంటి ప్రయోజనం దక్కట్లేదు. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే దీర్ఘకాలికంగా చూస్తే పంట దిగుబడి తగ్గిపోతుంది. అది దేశంలో ఆహార భద్రతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తుంది. నేలలో కర్బన ధాతువు తగ్గిపోతే వాతావరణ మార్పులను భవిష్యత్తులో ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. ఆరోగ్యవంతమైన నేల మాత్రమే సేంద్రీయ కార్బన్ను తనలో పట్టి ఉంచగల్గుతుంది. అలాంటి అత్యవశ్యకమైన కార్బన్ నెమ్మదిగా భారతీయ నేలల్లో తగ్గిపోతోంది. ఏటా కనీసం 7 టెరాగ్రాముల కార్బన్ నేల నుంచి అదృశ్యమవుతోంది’’ అని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. అక్కరకొస్తున్న సాయిల్ హెల్త్ కార్డ్ పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నేల ఆరోగ్య కార్డ్(ఎస్హెచ్సీ) పథకాన్ని ప్రారంభించింది. సుస్థిర వ్యవసాయ జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రైతన్నల సాగులో ఉన్న భూమి నుంచి కొంత మట్టిని సేకరించి అందులో 12 రకాల రసాయనాలు ఉన్నాయో లేదో, ఎంత పాళ్లలో ఉన్నాయో లెక్కించి ఎస్హెచ్సీని ఇస్తారు. గత రెండేళ్లలో దాదాపు 1.3 కోట్ల నేల శాంపిళ్లను ఇలా ల్యాబ్లో పరీక్షించి ఏఏ ప్రాంతాల్లో సాగునేలల స్వభావం, ఆరోగ్యం ఎలా ఉందో లెక్కించారు. మరింత కృషి జరగాలి..భూసార పరీక్షలు చేసి భూ ఆరోగ్యకార్డ్ల జారీతో ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎని్వరోన్మెంట్(సీఎస్ఈ)లోని ఆహార వ్యవస్థల కార్యక్రమ డైరెక్టర్ అమిత్ ఖురానా వ్యాఖ్యానించారు. ‘‘ ఆయా సాగు భూముల్లో సహాజ ధాతువులు పెరిగేలా కృషి చేయాలి. రైతులు సైతం తమ వంతుగా సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలి. అప్పుడు నేల ఆరోగ్యం బాగుంటుంది. అధిక కృత్రిమ ఎరువులతో నేల నిస్సారంగా తయారవుతుంది. ప్రభుత్వాలు కేవలం నేల ల సామర్థ్యాన్ని గణించి కార్డ్లు జారీచేస్తే సరిపోదు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) వంటి అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ సాయిల్ ల్యాబోరేటరీ నెట్వర్క్లతో సమన్వయంతో కలిసి పనిచేయాలి. వాళ్ల సూచనలు, సలహాలను అమలుచేయాలి’’ అని ఖురానా సూచించారు. ‘‘ భారత్లో 14 కోట్ల వ్యవసాయ కుటుంబాలు ఉంటే ఇప్పటిదాకా కేవలం 1.1 కోట్ల భూ కార్డ్ల పరీక్ష పూర్తయింది. పరీక్షలకు, ఆచరణకు మధ్య ఉన్న అగాథాలను పూడ్చాలి’’ అని ఆఘాఖాన్ ఫౌండేషన్లో వ్యవసాయ, ఆహార భద్రత, వాతావరణ మార్పుల విభాగ అంతర్జాతీయ సారథి అపూర్వ ఓజా సూచించారు. కార్బన్ లోపాలకు బయోచార్తో చెక్ పంట వ్యర్థాలు, కొయ్య వంటి సేంద్రీయ పదార్థాలను ఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణంలో మండించడం(పైరోలైసిస్) ద్వారా ఉత్పన్నమయ్యే జీవ బొగ్గునే బయోచార్ అంటారు. అది బొగ్గు పులుసు వాయువును నేలలోనే బంధిస్తుంది. ఈ కట్టె బొగ్గు నేల సారాన్నీ, పంట దిగుబడినీ పెంచుతుంది. పొలంలో, పల్లెల్లో ఉత్పన్నమయ్యే పంట వ్యర్థాలను, కలప ముక్కలను అక్కడికక్కడే బయోచార్గా మార్చి నేలలో నిక్షిప్తం చేస్తే ఆయా సాగు భూముల్లో కార్బన్ స్థాయిలు మెరుగవుతాయి. అయితే భారత్లో సరైన ప్రమాణాల మేరకు బయోచార్ను ఉత్పత్తిచేసే పరిస్థితులు లేవు. పైగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పథకాలు తెస్తున్నప్పటికీ ఆ పథకాల పరిధిలో ఉన్న సాగు భూముల విస్తీర్ణం సైతం చాలా తక్కువగా ఉంది. బయోచార్ వినియోగం, సేంద్రీయ వ్యవసాయం ద్వారా మాత్రమే కర్బనపాళ్లను పెంచి నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, తద్వారా భారతీయులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ సదస్సు అభిప్రాయపడింది. -
తెలంగాణలో నీళ్లున్నా బీళ్లాయె! ఆ భయాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కావాల్సినన్ని నీళ్లున్నాయి. అయినా వ్యవసాయ భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వరి వేయొద్దని సర్కారు సూచించడంతో రైతులు ఆ పంట సాగు గణనీయంగా తగ్గించేశారు. రైతుబంధు రాదనే ప్రచారం వల్ల కూడా చాలామంది వెనక్కు తగ్గారు. మరోవైపు చెరువుల కింద ఉన్న భూములకు నీరు వదలక పోవడంతో ఆ ప్రాంతాల్లో వరి నాట్లు పడలేదు. అదే సమయంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలన్న వ్యవసాయ శాఖ పిలుపును రైతులు పెద్దగా పట్టించుకోలేదు. వరి సాగు తగ్గడం, ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగక పోవడంతో లక్షలాది ఎకరాల్లో పంట భూములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులున్నా భూములు ఖాళీగా ఉండటం ప్రమాదకరమైన ధోరణి అని, మంచి పరిణామం కూడా కాదని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనకరంగా సాగు యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా గత ఏడాది ఏకంగా 68.14 (187%) లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా నీళ్లున్నా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలాగే గతేడాది యాసంగి సీజన్ మొత్తం తీసుకుంటే ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాంతో పోలిస్తే ఇప్పుడు నాలుగో వంతు కూడా నాట్లు పడలేదు. పొద్దుతిరుగుడు, మినుము మినహా వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, పొద్దు తిరుగుడు, శనగ, వేరుశనగ, మినుము వంటి పంటలను సాగు చేయాలని, వాటి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. కొద్ది మొత్తంలో సాగయ్యే పొద్దుతిరుగుడు, మినుము మినహా మిగతా పంటల సాగు పెరగలేదు. పొద్దు తిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు కాగా, 23,881 ఎకరాల్లో సాగైంది. అలాగే మినుము సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 24,018 ఎకరాలు కాగా, 70,827 ఎకరాల్లో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, 3.13 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగను కనీసం ఐదారు లక్షల ఎకరాలకు పెంచాలని అధికారులు భావించినా ఆ మేరకు సాగవలేదు. ఇక శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, కొద్దిగా పెరిగి 3.27 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ల„ý ల ఎకరాల్లో వరిని నిలిపివేస్తున్నప్పుడు ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా లక్షల ఎకరాల్లో అదనంగా పెరగాలన్నది సర్కారు ఆకాంక్ష. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. కేవలం వేల ఎకరాల్లో ఉన్న చిన్నపాటి పంటల విస్తీర్ణం మాత్రమే రెండు మూడింతలు పెరిగింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రత్యామ్నాయ పంటల సాగు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు సకాలంలో రైతులకు చెప్పలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా అవసరమైన విత్తనాలను పూర్తిస్థాయిలో అందించలేదన్న విమర్శలున్నాయి. కొన్ని రకాల విత్తనాలను సరఫరా చేశారే కానీ, రైతులు కోరిన వెరైటీలను అందుబాటులోకి తీసుకురాలేక పోయారు. ఇదిగో ఇలా బీడుగా వదిలేసిన ఈ భూమి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన రాంరెడ్డిది. తొమ్మిదెకరాల ఈ పొలం పక్క నుంచే గూడెం ఎత్తిపోతల పథకం కాలువ ఉంది. గతంలోనే బోరుబావి కూడా తవ్వించాడు. ఏటా వరి సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం పుష్కలంగా నీరున్నా ఈ యాసంగిలో ఏ పంట వేయాలో తెలి యక ఆరెకరాలు బీడుగా వదిలేశాడు. ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనబోమని, వరి సాగు చేయొ ద్దని సూచించడంతో వరి వేస్తే ధాన్యం అమ్ముకోవ డం ఇబ్బంది అవుతుందని రెండెకరాల్లోనే వరివేశాడు. కూరగాయలు, నువ్వులు అరెకరం చొప్పున సాగు చేస్తున్నాడు. మిగతా పంటలు ఏం వేయాలో తెలియక ఆరెకరాలు ఇలా బీడుగా వదిలేశాడు. – మంచిర్యాల, అగ్రికల్చర్ మూడెకరాల వరి పొలం బీడే.. ఏటా ప్రాజెక్టు కాలువ కింద యాసంగి వరి పంట సాగు చేసుకునేది. ఈ ఏడాది వరి సాగు వద్దని ప్రభుత్వం చెప్పింది. పంట వేసుకుంటే నష్టపోవుడేనని, వేరే పంటలు వేసుకోవలన్నరు. గట్లని కంది, పెసలు, నువ్వులు వేసుకుంటే పొద్దంతా ఆవులు, రాత్రి అడవి పందులతో నష్టం ఉంటది. చుట్ట పక్కల పొలం రైతులూ వరి వేయలేదు. నా మూడెకరాల వరి పొలం కూడా ఈ ఏడాది బీడే ఉన్నది. – తోట బాపయ్య, నెన్నెల, మంచిర్యాల జిల్లా మాకు తెలిసింది వరి పంటే.. బోరుకింద ఏటా యాసంగిలో దొడ్డు వరి సాగు చేసేది. వరి పంట వేయద్దని చెప్పడంతో పోయిన ఏడాది మూడెకరాల వరి సాగు చేసుకుంటే ఈ ఏడాది ఎకరంలోనే నాటు వేసుకున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా రెండు ఎకరాలు బీడు పోయింది. ఏళ్ల తరబడి వరి పంట తప్ప ఏ పంట వేయలే. మాకు తెలిసిందల్లా వరి పంటే. – ఇజ్జగిరి చంద్రయ్య, కుందారం, జైపూర్, మంచిర్యాల జిల్లా పర్యవసానం తీవ్రంగా ఉంటుంది రైతుకు మార్కెట్లో ఎంతో కొంత మంచి ధర వచ్చేది వరితోనే. మిగతా పంటల్లో రాదు. ఇప్పుడు వరి వేయొద్దనడంతో దాన్ని నిలిపివేశారు. అలాగని మిగతా పంటలూ వేయడం లేదు. ఎవరికి వారు పంటల విరామం ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదో ఒక రకమైన నిరసన. వేరే పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడంపై కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లే లెక్క. దీన్ని సాధారణమైన పరిణామం, స్థితిగా తీసుకోకూడదు. దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. వరి భారీగా పండుతున్న సమయంలోనే బియ్యం ధర కిలో రూ. 60కు పైగా పలుకుతోంది. ఆ మేరకు వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. పంట మంచిగా పండితేనే ఆహారం అందరికీ సరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఆహారం అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ప్రభుత్వం మీద భారం పడుతుంది. రేషన్ బియ్యానికి డిమాండ్ 70–80 శాతానికి పెరుగుతుంది. అంతేకాదు పడావు బడ్డాక భూమి ఆరు నెలలు అలాగే ఉంటే పూర్తిగా ఎండిపోతుంది. దాని భూసారం పడిపోతుంది. వరి పండించే భూమి పడావు పడితే ఉప్పు తేలిపోతుంది. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
వరాహ ‘దాడి’
శాయంపేట(భూపాలపల్లి): అరకొర దిగుబడులతో రైతులు సతమతమవుతుంటే వన్యప్రాణుల బెడద గోరుపై రోకలి పోటులా మారింది. గుంపులు గుంపులుగా వస్తున్న అడవి పందులు జిల్లాలో పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను తింటూ వరాహాలు చిందరవందర చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అడవుల దరిదాపుల్లో వ్యవసాయం రైతన్నలకు కత్తిమీద సాములా మారింది. వన్యప్రాణుల విహారంతో పంటలను రక్షించుకునేందుకు కర్షకులు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. అడవి పందుల సంచారంతో మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పెసర, పండ్ల జాతుల పంటలు ధ్వంసమవుతున్నాయి. జిల్లాలోని ఆత్మకూర్, పరకాల, శాయంపేట, దామెర, గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, సంగెం, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో కొండ, అటవీ, వాగుల ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో పందుల బెడద విపరీతంగా ఉంది. వాటి జోలికెళ్తే అటవీశాఖ అధికారులు కేసులు పెడతారమోనని భయపడుతున్నారు. ఒకదశలో రైతులపై దాడి చేసేందుకు ఎగబడుతున్నాయి. దీంతో రైతులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పంటలను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. వేల ఎకరాల్లో నష్టపోతున్న పంటలు.. వరంగల్ జిల్లాలోని 16 మండలాల వ్యాప్తంగా మొక్కజొన్న పంట ఈ ఏడాది 17,120 ఎకరాల్లో సాగు కాగా అరటి 312 ఎకరాల్లో, దోస 36 ఎకరాల్లో, టమాటా 430 ఎకరాలతో పాటు మొత్తంగా వివిధ కూరగాయ పంటలు 1930 ఎకరాల్లో సాగు అవుతుంది. అయితే అవి తినే కంటే ఎక్కువగా పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. సుమారు మొక్కజొన్న ఎకరం సాగు చేసేందుకు సుమారు రూ.18 వేలకు పైబడి పెట్టుబడి ఖర్చులు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో మొక్కజొన్న పంట పీచు దశలో ఉండడంతో పందులు దాడులకు ఎగబడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇతర జిల్లాల్లో మార్గాలు ఇలా.. అడవి జంతువుల నుంచి పంటలను పంటలను కాపాడేందుకు సంగారెడ్డి, మెదక్లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని చోట్ల రైతులే వారి ఆలోచనలతో చిన్నచిన్న పద్ధతులతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పంట చుట్టూ షా ఫ్లవర్ను ఏర్పాటు చే సుకుంటే వాటికి ముళ్లుండి పంటల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే పంట చుట్టూ కుళ్లిన కోడిగుడ్లు, వెంట్రుకలు, కారం పొడి చల్లడం వంటి చేస్తే అడవి పందుల బారి నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. కొంత మంది రైతులు పంట చుట్టు ఫెన్సింగ్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ వాటికి కాపాలా రాత్రివేళల్లో రైతులు అక్కడే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్వగాన్ అనే కెమికల్ను తాడులో ముంచి పంట చుట్టూ కట్టేస్తే వాసనకు పంటల్లోకి పందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు రాలేదు.. గుట్టలు, వాగులు, అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్న పంటలపై అడవి పందులు దాడి చేస్తున్నట్లు వింటున్నాం. అయితే రైతులు ఇప్పటివరకు పంటలు నష్టపోయినట్లు రాత పూర్వకంగా ఫిర్యాదు రాలేదు. రైతులు కమ్యునిటీగా ఏర్పడి సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసుకుంటే పంటలపై అటవి జంతువుల దాడికి యత్నించకుండా పంటలను కాపాడుకోవచ్చు. –ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయాధికారి -
పరడలో పంటపొలాలు పరిశీలన
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారి బి. సన్నిరాజ్ పంటపొలాలను, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి ఆకు ఎరుపురంగులోకి మారితే మెగ్నిషియం లోపనివారణగా గుర్తించి ఒక లీటరు నీటి రెండు గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్ను పిచికారీ చేయాలని సూచించారు. వరి ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారటంతో పాటు వడ్ల గింజలపై నల్ల మచ్చలు ఏర్పడితే దీని నివారణకు ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ఫ్రొఫెనోపాస్ కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట రైతులు ప్రభాకర్రెడ్డి, మోహన్రెడ్డి, శశిపాల్రెడ్డి, మాండ్ర వీరయ్య ఉన్నారు. -
నల్లగొండలో దారుణం.. పసికందు మృతి
-
నల్లగొండలో దారుణం.. పసికందు మృతి
నేరేడుచర్ల(నల్లగొండ): నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం కోమటికుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంటపొలాల్లో వదిలి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శిశువుకు సంబంధించిన వాళ్ల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.


