conveyor belt
-
కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. సొరంగం లోపల 13 కి.మీ. దూరంలో ఉన్న మట్టి, శిథిలాలను వేగంగా తొలగించేందుకు ఆధారమైన కన్వేయర్ బెల్టును మంగళవారం మధ్యాహ్నానికి సహాయక బృందాలు అందుబాటులోకి తెచ్చాయి. సింగరేణి సంస్థకు చెందిన నిపుణులు కన్వేయర్ బెల్టు జాయింట్ మెషీన్, డ్రమ్ పరికరాలను బిగించి పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్టు ద్వారా గంటకు 800 టన్నుల మేర మట్టిని తరలించేందుకు వీలుంటుంది. అయితే ఇది టనెŠన్ల్ బోర్ (టీబీ) మెషీన్లో అంతర్భాగంగా పనిచేస్తుంది. ఇప్పుడు టీబీఎం ముక్కలుగా మారటంతో సింగరేణి మైనింగ్ రెస్క్యూ బృందాలు, ఆర్మీకి చెందిన మినీ బాబ్క్యాట్ డోజర్ల సాయంతో గంటకు 20 టన్నుల వరకు మట్టిని బయటకు తరలించే వీలుందని చెబుతున్నారు. సొరంగంలోని ప్రమాద స్థలంలో సుమారు 8 నుంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పేరుకుపోయినట్టు అంచనా వేస్తుండగా, ఈ మొత్తం శిథిలాలను తొలగించేందుకు కనీసం రెండు రోజులైనా పడుతుందని చెబుతున్నారు. దీంతో ఏ క్షణమైనా కార్మికుల ఆనవాళ్లు లభించే అవకాశం ఉంది. రంగంలోకి రోబోటిక్స్ నిపుణులు సొరంగం కుప్పకూలిన చోట మట్టిని తొలగిస్తే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుండటంతో సహాయక చర్యల్లో రోబోలను వినియోగించాలని భావిస్తున్నారు. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎన్వీ రోబోటిక్స్కు చెందిన నిపుణులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన రోబోల ద్వారా సహాయక చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సొరంగం లోపల ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న సహాయ సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మెడికల్ విభాగం సహకారం అందిస్తున్నాయి. అలాగే సొరంగం కుప్పకూలడంపై ప్రమాద స్థలానికి ఎగువ భాగంలో నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ నిపుణుల బృందం సర్వే చేపడుతోంది. ఎస్డీఆర్ఎఫ్ డీజీపీ నాగిరెడ్డి మంగళవారం సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్యాబిన్ ప్రదేశంలో చిక్కుకుని ఉంటారా? ప్రమాద స్థలంలో జీపీఆర్ గుర్తించిన నాలుగు పాయింట్లలో తవ్వకాలు జరిపినా కార్మికుల జాడ కనిపించలేదు. రాడార్ సూచించిన సమీపంలోని ప్రాంతాలను సైతం జల్లెడ పడుతున్నారు. సింగరేణి మైనింగ్ రెస్క్యూ టీం, ర్యాట్ మైనర్స్ మాన్యువల్ డిగ్గింగ్ పద్ధతిలో సాధారణ గడ్డపార, సమ్మెట, తట్ట సామగ్రితోనే తవ్వకాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో టీబీఎం క్యాబిన్ ఉంటుందని భావిస్తున్న చోట తవ్వకాలు జరపగా, కార్మికుల ఆనవాళ్లు లభించినట్టుగా తెలిసింది. ఆ ప్రాంతంలోనే ప్రత్యేకంగా రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రితో పాటు వైద్య శాఖకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. -
లగేజ్ మోసే బాధ లేదు.. ఎంచక్కా అదే వస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనిషి అన్ని పనులను సునాయాసంగా చేసుకోవడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, విమాశ్రయాలలో పైకి ఎక్కడానికి లేదా కిందికి దిగటానికి ఎస్కలేటర్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాడు. లగేజ్ తీసుకెళ్లడానికి కూడా బెల్ట్ కన్వేయర్స్ ఉపయోగిస్తున్నాడు. అయితే ఇవన్నీ చిన్న దూరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదే ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంటే? నిజంగా ఇది వినటానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ..! దీన్ని నిజం చేయడానికే జపాన్.. సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది.జపాన్ గవర్నమెంట్ ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిస్టిక్స్ లింక్లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. ఒక వ్యక్తి తన లగేజిని ప్రత్యేకంగా తనతోపాటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయన్నమాట.ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే లగేజీని మనతో పాటు తీసుకెళ్లాలి. కానీ కన్వేయర్ బెల్ట్ ఉంటే.. లగేజ్ అక్కడ ఇచ్చేసి మీరు హ్యాపీగా విజయవాడ వెళ్లిపోవచ్చు. లగేజీని దొంగలు తీసుకెళ్లారని భయంగానీ.. ఎక్కడైనా మరచిపోతామేమో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ నిర్వాహకులు లేదా అధికారులు ఆ లగేజీని గమ్యానికి చేరుస్తారు. మీరు మళ్ళీ అక్కడ తీసుకుంటే సరిపోతుంది.జపాన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి గత ఫిబ్రవరి నుంచి చర్చలు జరుపుతోంది. ఇది 2034 నాటికి అమలులోకి వస్తుందని సమాచారం. మొదటి లింక్ టోక్యో నుంచి ఒకసా మధ్య ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చిన తరువాత లక్షల టన్నుల బరువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు.టోక్యో నుంచి ఒకసా నగరాల మధ్య సుమారు 500 కిమీ దూరాన్ని కవర్ చేయడానికి భారీ కన్వేయర్ బెల్ట్లను ఏర్పటు చేస్తారు. ఈ బెల్ట్ కన్వేయర్స్ హైవేల పక్కన, సొరంగాలు మార్గాల్లో కొనసాగుతుంది. ఇది మొత్తం డ్రైవర్లెస్ టెక్నాలజీతో రూపొందుతుంది. ఇందులో కార్గోలు లగేజీని సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తాయి. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా డ్రైవర్స్ అవసరం లేదు.ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడానికి మంత్రిత్వ శాఖ ప్రైవేట్ కంపెనీలకు పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని రవాణా & పర్యాటక మంత్రి టెట్సువో సైటో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇది అద్భుతమైన టెక్నాలజీ అనే చెప్పాలి. ఇలాంటి సదుపాయాన్ని మన దేశంలో కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్ను, 1950లో క్యాప్ ల్యాంప్లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
స్వల్పంగా కాలిన కన్వేయర్బెల్ట్
పరవాడ: బంకర్కు బొగ్గు తరలించే కన్వేయర్ బెల్ట్ స్వల్పంగా కాలింది. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 3, 4 యూనిట్లకు బొగ్గును తరలించే 20-ఏ కన్వేయర్ బెల్ట్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ రెండు యూనిట్లకు బొగ్గు సరఫరా చేయడానికి అదనపు బెల్ట్ సౌకర్యం ఉండటంతో సరఫరాలో ఎలాంటి మార్పురాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.