కన్నకూతుళ్లను అమ్మేసిన తండ్రి
ఖమ్మం : రక్తం పంచుకు పుట్టిన బిడ్డలనే కన్న తండ్రి అమ్మేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మంజిల్లా కొత్తగూడెంలోని చాతకొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీకి చెందిన పాషా ఎప్పుడూ గొడవపడుతుండడంతో విసుగెత్తిన భార్య కిరోసిన్ పోసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన జరిగిన మూడ్నెళ్లకే ఉన్న ఇద్దరు ఆడపిల్లలను పోషించలేక అతడు వారిద్దర్ని చెరో ఐదు వేలకు అమ్మేశాడు.
అయితే పిల్లలు కనిపించటం లేదని వారు ఎక్కడున్నారని స్థానికులు అడగ్గా .. అత్తారింట్లో దింపి వచ్చానని పాషా అబద్ధం చెప్పాడు. కాగా అత్తింటివారు పిల్లలను తీసుకెళ్లేందుకు రాగా, అసలు వ్యవహారం బయటపడింది. చిన్నారులను అమ్మిన విషయం తెలుసుకున్న స్థానికులు కోపంతో పాషాను ఉతికారేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.