breaking news
In charge regime
-
కమిషనర్ కావలెను..!
- ఇన్చార్జి పాలనలో కార్పొరేషన్ - రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భర్తీ - ఖమ్మానికి మాత్రం గ్రహణం సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్ నియూమకంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఒక్క ఖమ్మం మినహా రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కమిషనర్లు నియమితులయ్యారు. ఖమ్మం అర్బన్ మండలంలోని తొమ్మిది పంచాయతీలతో కార్పొరేషన్గా అవతరించినప్పటికీ పూర్తిస్థాయి కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురపాలకాలపై మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో కూడా ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ నియామక విషయం చర్చకు రాలేదని తెలిసింది. కార్పొరేషన్ స్థాయికి తగినట్టుగా ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాల్సుంది. నూతన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కమిషనర్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నగర ప్రజలకు సక్రమంగా అందడం లేదు. నగరంలో ఆసరా పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంకా వేలమంది లబ్ధిదారులు పింఛన్ కోసం కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. ఆహార భద్రత కార్డుల ప్రక్రియ ప్రహసనంగా మారే పరిస్థితుంది. ఇన్చార్జి కమిషనర్ పాలనలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మధ్య సఖ్యత లేకపోవడంతో పాలన గాడి తప్పింది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయూనికి వస్తున్న ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరంలోని రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. త్వరలో జీహెచ్ఎంసీ, వరంగల్తోపాటు ఖమ్మం కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.., ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతున్నా.. కమిషనర్ నియామకం దిశగా మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం ఈ వేసవిలో ఖమ్మం నగరానికి మంచినీటి ఎద్దడి పొంచి ఉంది. ఆ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయలేదు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొనైనా ఐఏఎస్ స్థాయి అధికారిని కమిషనర్గా నియమిస్తే పాలన గాడిలో పడడంతోపాటు నగర ప్రజల సమస్యలకు మోక్షం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కుంటుపడిన ‘పల్లె’ పాలన
డిచ్పల్లి : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది. దీంతో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించే పంచాయతీ రాజ్ శాఖలో మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శుల కొరత వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇన్చార్జిల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖలో అధికారుల సంఖ్య నానాటికి పలుచబడిపోతోంది. జిల్లాలో 36 మండలాలకు గాను 16 మండలాలకు ఇన్చార్జి ఎంపీడీఓలే విధులు నిర్వహిస్తున్నారు. 36 మండలాల్లో 718 గ్రామపంచాయతీలు ఉండగా పాలనా సౌలభ్యం కోసం 477 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్కు ఒక కార్యదర్శి ఉండాలి. అయితే జిల్లాలో 148 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శి రెండు, మూడు క్లస్టర్లకు ఇన్చార్జిగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు పంచాయతీ రాజ్ శాఖలో కీలక భూమిక పోషించే ఈఓపీఆర్డీలదీ ఇదే పరిస్థితి. 36 మండలాలకు గాను కేవలం 14 మంది ఈఓపీఆర్డీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన మండలాల్లో సూపరింటెండెంట్లు, ఈఓలు ఇన్చార్జి ఈఓపీఆర్డీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జిలుగా విధులు నిర్వహించడంతో పనిభారం అధికమై ఏ ఒక్క గ్రామానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి తోడు పలు గ్రామాల్లో బిల్కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, కారోబార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పని భారాన్ని బట్టి గ్రామంలోని యువకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుని పని చేయించుకుంటున్నారు. ఇన్చార్జిల పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు సమస్యలతో సతమవుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వరాష్ట్రంలోనైనా పరిస్థితులు మారేనా.. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీల భర్తీపై అప్పటి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ప్రస్తుతం మన రాష్ట్రం మనకు ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా పంచాయతీ రాజ్ శాఖలో పెరుగుతున్న ఖాళీల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందని ఆశాభావంలో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీలు ఉండడం వల్ల అభివృద్ధి అస్తవ్యస్థంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం పల్లెల అభివృద్ధి గురించి ఆలోచించి పంచాయతీ రాజ్ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇటు ప్రజలు, అటు శాఖలోని సిబ్బంది కోరుతున్నారు.