breaking news
Central Home Minister Rajnath Singh
-
తుపాకుల నీడలో కౌంటింగ్
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పోలీసు వలయంలో నిర్వహించేలా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ 11న ఎన్నికల రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కూడా టీడీపీ వర్గీయులు మునుపెన్నడూ లేని రీతిలో గ్రామాలపై దాడులు కొనసాగించారు. రీపోలింగ్ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నానా యాగీ చేశారు. తమ నాయకుడి దారిలోనే టీడీపీ శ్రేణులు మరింత దూకుడుగా వ్యవహరించాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ల్లో చంద్రబాబు హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు, మీడియా చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉక్రోశం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో వివాదాలు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ హెచ్చరిక కౌంటింగ్ సందర్బంగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖతో పాటు నిఘా వర్గాలు కూడా బుధవారం హెచ్చరించాయి. అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తుగా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా మొత్తం 25,224 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని డీజీపీ ఇప్పటికే ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నారు. వాటిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు. ర్యాలీలు.. గుంపులపై నిషేధాజ్ఞలు ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్లు అమల్లోకి తెచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా జనం ఒక చోట గుమికూడడం, మైక్లు వాడటాన్ని నిషేధించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ సెంటర్కు కిలోమీటర్ దూరం వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని పోలీసులు బైండోవర్ చేశారు. రౌడీషీటర్లు, అనుమానితులను పోలీసు కస్టడీలోకి తీసుకుంటున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ ఉదయం వరకూ రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు, వైఎస్ జగన్ నివాసాల వద్ద బందోబస్తు సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ అనంతరం చంద్రబాబు, జగన్ నివాసాల వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతను పెంచారు. ఇరువురు నేతల నివాసాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్షించారు. -
రాజ్నాథ్కు సీఎం స్వాదర సాగతం
విజయవాడ: తొలిసారిగా విజయవాడకు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు సాదర స్వాగతం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు రాజ్నాథ్కు ఘన స్వాగతం పలికారు. నర్సరావుపేట మున్సిపాలిటీ శతాబ్ధి వేడుకల నుంచి నేరుగా గన్నవరం వచ్చిన సీఎం.. రాజ్ నాథ్ రాక కోసం కాసేపు వేచిచూశారు. అనంతరం కేంద్ర మంత్రిని క్యాంప్ ఆఫీస్ కు తోడ్కొని వెళ్లిన సీఎం.. అక్కడ రాజ్ నాథ్ గౌరవార్థం విందు ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా, పలు జిల్లాలు దెబ్బతిన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం.. సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రతిగా ఏపీని అన్నివిదాలా ఆదుకుంటామని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు. శనివారం విజయవాడలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యఅధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?
కశ్మీర్ అంశంపై పాక్కు హోంమంత్రి రాజ్నాథ్ ప్రశ్న * భారత్-పాక్ చర్చల రద్దుపై రాజకీయ పార్టీల విచారం * పాక్ తప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశమిచ్చింది: కాంగ్రెస్ * ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట బయటపెట్టాం: బీజేపీ న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత్-పాకిస్తాన్ల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) స్థాయి చర్చలు రద్దవటం పట్ల కేంద్ర ప్రభుత్వం సహా వివిధ రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయి. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్.. ఆ అంశాన్ని ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రశ్నించారు. ఎన్ఎస్ఏ చర్చలకు ఉఫాలో నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ పక్కకు మళ్లాల్సింది కాదన్నారు. పొరుగుదేశంతో స్నేహసంబంధాలకు భారత్ ఎప్పుడూ సానుకూలంగా ఉందని, ఆ దిశగా కృషి కొనసాగుతుందని అన్నారు. అయితే.. ప్రభుత్వం పాక్ ఆడిన ఆటలో పావుగా మారిందని, ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ తప్పించుకోవటానికి అవకాశమిచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కానీ.. ఈ చర్చల నుంచి తప్పుకున్న పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట తమ సర్కారు బట్టబయలు చేసిందని అధికార బీజేపీ పేర్కొంది. ప్రతి ద్వైపాక్షిక చర్చల్లో అందరి భాగస్వామ్యం కోసం పట్టుపట్టటం వాంఛనీయం కాదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వేర్పాటువాద హురియత్ నేతలు విమర్శించారు. చర్చలు రద్దుకావటానికి కారణం వారేనని, వెనక్కు తగ్గి ఉండాల్సిందని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తప్పుపట్టారు. భారత్ - పాక్ల మధ్య చర్చలు రద్దుకావటం పట్ల అమెరికా నిరాశ వ్యక్తంచేసింది. ఇరు దేశాలూ త్వరలో చర్చలు పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఉఫాలో భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లు నిర్ణయించిన మేరకు.. పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ సోమవారం ఢిల్లీలో భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో సమావేశమై చర్చలు జరపాల్సి ఉండగా.. అజీజ్ ఢిల్లీలో హురియత్ నేతలను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరో అంశాన్ని లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేయటంతో పాక్ ఆ చర్చలను శనివారం నాడు రద్దుచేసుకున్న విషయం తెలిసిందే. పాక్ నేతలు భారత్ వచ్చినపుడు హురియత్ నేతలను కలవటం మామూలేనని, కశ్మీర్ అంశం లేనిదే చర్చలు నిష్ర్పయోజనమని పేర్కొన్న పాక్.. ఈ అంశాలపై భారత్ ముందస్తు షరతులు పెడుతోందని ఆరోపిస్తూ చర్చలు రద్దుచేసుకుంది. అయితే.. తాము ముందస్తు షరతులు పెట్టలేదని.. ఉఫాలో ఒప్పందం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా ప్రకారం కేవలం ఉగ్రవాదం, దానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరపాలని, సిమ్లా ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక చర్చల్లో మూడో పక్షానికి తావులేదని.. ఈ రెండు ఒప్పందాల స్ఫూర్తిని గౌరవించాలని మాత్రమే తాము చెప్తున్నామని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయమూ విదితమే. ఈ పరిణామాలపై ఆయా పార్టీల ప్రతిస్పందనలివీ... మూడో పక్షానికి తావులేదు: కేంద్రం ‘‘కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్ ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు కలిసినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అది ఎజెండాలో ఎన్నడూ లేదు. ఎన్ఎస్ఏల చర్చలు రద్దుకావటం విచారకరం. ఉఫాలో ఇరువురు ప్రధానుల సమావేశం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ దారిమళ్లాల్సింది కాదు. ఎన్ఎస్ఏ చర్చల్లో మూడో పక్షానికి (హురియత్) తావులేదు. ఈ చర్చలకు ముందు కానీ, మధ్యలో కానీ, తర్వాత కానీ ఇతరులతో చర్చలు జరపటమనే ప్రశ్నే లేదు. ముందు నిర్ణయించినట్లు ఉగ్రవాదంపై పాక్ చర్చలు జరపాల్సింది. భవిష్యత్తులో ఎలాంటి చర్చలైనా సాధ్యమవుతాయా లేదా అన్నది పాక్ పైనా ఆధారపడి ఉంది.’’ - రాజ్నాథ్సింగ్, కేంద్ర హోంమంత్రి పాక్ ఆటలో పావు అయింది: కాంగ్రెస్ ‘‘పాక్ ఆడిన ఆటలో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా లేకపోవటం, సంసిద్ధంగా లేకపోవటం, దృష్టి కేంద్రీకరించి లేకపోవటం వల్ల పావుగా మారింది. ఉగ్రవాదంపై చర్చల నుంచి తప్పుకుపోవటానికి ఆ దేశానికి అవకాశమిచ్చింది.’’ - అభిషేక్సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాక్ వైఖరి తేటతెల్లమైంది: బీజేపీ ‘‘చర్చల నుంచి పాక్ వైదొలగటం చాలా విచారకరం. ఉగ్రవాదంపై చర్చిస్తే ప్రపంచం ఎదుట తన బండారం బయటపడుతుందని పాక్కు తెలుసు. చర్చల నుంచి పాక్ వైదొలగటంతో.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ వేదికపై ఆ దేశ వైఖరిని మా ప్రభుత్వం బట్టబయలు చేసింది.’’ - సంబిత్పాత్రా, బీజేపీ అధికార ప్రతినిధి ‘‘వేర్పాటు నేతలను కలవాలని పాక్ ఎన్ఎస్ఏ పట్టుపట్టటం సరికాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎస్పీ పూర్తి మద్దతు ఇస్తోంది.’’ - రామ్గోపాల్యాదవ్, ఎస్పీ నేత ‘‘హురియత్ నేతలు పాక్ దౌత్యకార్యాలయంలో కార్యక్రమానికి హాజరుకాకుండా ఏ చట్టం కింద నిరోధించవచ్చు? మోదీ నరేంద్రమోదీ మాట్లాడాలి. నా జీవితంలో అత్యంత నిరుత్సాహకరమైన వ్యక్తి ఆయన.’’ - రాంజెఠ్మలాని, బీజేపీ మాజీ నేత లేహ్లో పారికర్ పర్యటన.. లదాఖ్ సరిహద్దుల వెంట, సీమాంతర చొరబాట్ల విషయంలో రక్షణ సంసిద్ధత సహా జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్షించారు. లదాఖ్ పర్యటనలో భాగంగా పారికర్ సైన్యం చీఫ్ జనరల్ దల్బీర్సింగ్తో కలిసి ఆదివారం లేహ్ వచ్చారు. భారత్ను తప్పుపట్టిన పాక్ మీడియా భారత్-పాక్ల మధ్య ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దుకావటానికి.. ముందస్తు షరతులు పెట్టిన భారత్ వైఖరే కారణమని పాక్ మీడియా తప్పుపట్టింది. ప్రధాన వార్తాపత్రికలన్నీ చర్చల రద్దు కావటంపై ఆదివారం తొలి పేజీలో కథనాలు ప్రచురించాయి. పాక్ ఎన్ఎస్ఏ ఢిల్లీలో భారత్ ఎన్ఎస్ఏను కలసి ఉగ్రవాదం సహా అన్ని అంశాలపైనా చర్చించాల్సి ఉందని.. కానీ భారత్ ముందస్తు షరతులు పెట్టిందని.. దానివల్లే చర్చలు రద్దయ్యాయని విమర్శించాయి. డాన్, న్యూ ఇంటర్నేషనల్, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తదితర పత్రికలు భారత్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. గిలానీ సదస్సు ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు శ్రీనగర్: అతివాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ గిలానీ ఆదివారం శ్రీనగర్లోని తన నివాసంలో పార్టీ సదస్సు నిర్వహించటానికి చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వాధికారులు విఫలం చేశారు. హైదర్పోరాలోని గిలానీ నివాసానికి వెళ్లే ఎయిర్పోర్ట్ రోడ్ వెంట భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి దారిని మూసివేశారు. దీంతో ఆగ్రహించిన హురియత్ కార్యకర్తలు సమీపంలోని ప్రార్థనామందిరం వద్ద సమావేశమై.. పోలీసు వలయం నుంచి దూసుకెళ్లటానికి ప్రయత్నించారు. కార్యకర్తలకు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్, లాఠీలు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. డీజీఎంఓ చర్చలు జరుగుతాయి: పాక్ ఇస్లామాబాద్: ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను రద్దు చేసుకున్న పాకిస్తాన్.. ఆ మరుసటి రోజే రెండు దేశాల డీజీఎంఓల (డెరైక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) భేటీలు యథావిధిగా జరుగుతాయని పేర్కొంది. ఉఫా ప్రకటన మేరకు పాక్ రేంజర్లు - బీఎస్ఎఫ్ ప్రతినిధుల చర్చలు జరుగుతాయని పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ ఆదివారం వెల్లడించారు. వచ్చే నెల 6న నిర్ణయించిన ఈ భేటీకి.. మరింత వ్యవస్థీకరణ అవసరమన్నారు. ఎన్ఎస్ఏ చర్చల రద్దుకు భారతే కారణమన్నారు. ‘‘కశ్మీర్ అంశంపై చర్చలు జరపటం ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఉఫా భేటీ లక్ష్యం.. ఉద్రిక్తతను తగ్గించటం. కాబట్టి కశ్మీర్పై చర్చించాల్సిన అవసరముంది’’ అని అన్నారు. -
సంచలనమేమీ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తను సమావేశం కావడంలో ఎలాంటి సంచలనం లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. హోంమంత్రితో భేటీ సాధారణ సమావేశమేనని, ఇందులో చెప్పడానికి ఏమీ లేదన్నారు. గురువారం సాయంత్రం హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్తో 10 నిమిషాలు, ఆ తర్వాత హోం మంత్రి రాజ్నాథ్తో పావుగంట పాటు నరసింహన్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత హామీలు, షెడ్యూల్ 9, 10లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పినట్టు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్లు గైర్హాజరైన విషయాన్ని రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై అడగ్గా.. ‘థాంక్యూ’ అని బదులిచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దుతారా అని ప్రశ్నించగా, ‘చూద్దాం. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు అధిగమిస్తాం’ అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ను పరామర్శించిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించి సంతాపం తెలియచేశారు.