breaking news
cash smuggling
-
ఆదిలాబాద్: రూ.10 కోట్లు పట్టివేత
-
రూ.10 కోట్లు పట్టివేత
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో నగదు అక్రమ తరలింపు మొదలైంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు డబ్బు అక్రమంగా తరలుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి రసీదులూ లేకుండా తరలిస్తున్న రూ.10 కోట్ల నగదును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్నడస్టర్ వాహనం (కెఏ46 ఎం 6095) డిక్కీలో బెంగళూర్కు చెందిన వినోద్శెట్టి, శబరీష్ ఈ మొత్తాన్ని తరలిస్తుండగా జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. నాగ్పూర్ జిల్లా జామ్ నుంచి హైదరాబాద్కు ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు నిందితులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పట్టుకున్న ఇద్దరిని పోలీసుల విచారిస్తున్నారు. గన్నీ సంచుల్లో నోట్ల కట్టలు.. తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో ఒకేసారి రూ.10 కోట్లను తరలిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోసమే ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం నుంచి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లావాదేవీలకు సంబంధించి సరైన వివరాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో పిప్పర్వాడ వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసి శుక్రవారం తనిఖీలు చేస్తున్నారు. జైనథ్ ఈవోపీఆర్డీ సంజీవ్రావు, ఏఎస్సై జీవన్ వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న డస్టర్ వాహన డిక్కీని తెరిచారు. ఐదు తెల్లటి గన్నీ సంచులు ఉండటంతో అనుమానించి వాటిని విప్పి చూశారు. రూ.500, రూ.2వేల నోట్ల కట్టలు క్రమపద్ధతిలో పేర్చి ఉన్నాయి.ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, జైనథ్ సర్కిల్ సీఐ స్వామి, ఎస్సై తిరుపతి హుటహుటిన చెక్పోస్ట్ వద్దకు చేరుకున్నారు. నగదును తరలిస్తున్న వినోద్శెట్టి, శబరీష్ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 కోట్ల మొత్తాన్ని లెక్కించి రశీదులు అడుగ గా, నిందితులు ముఖాలు తేలేశారు. వాహనంతోపాటు నగదును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ వాహనం మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్లు నిర్ధారించారు. ఆ నగదు ఎవరిది, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో, ఎందుకోసమో తెలియాల్సి ఉంది. శనివారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరి కోసం ఈ సొమ్ము..? దసరా ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయి కాబట్టి, పోలీసు యంత్రాంగం కూడా పండుగ హడావుడి నుంచి బయటికి రారనే ఆలోచనతో భారీ మొత్తంలో నగదును తరలించే ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. నాగ్పూర్ జిల్లా జామ్ నుంచి కారులో వస్తున్నట్లు నిందితులు చెబుతుండటం గమనార్హం. శనివారం తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పర్యటన ఉంది. భైంసా, కామారెడ్డిలో ఆయన బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుపడటం చర్చనీయాంశం అయింది. అలాగే నాగ్పూర్ ఎంపీగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. దీంతో పోలీసులు రాజకీయంగా ఈ కోణాల్లో విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం పోలీసులు అధికారికంగా మీడియాకు వివరాలు అందించే అవకాశం ఉంది. -
‘ఎన్నికల డబ్బుకు’ హుండీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సీజన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు తరలింపుపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. జోరుగా తనిఖీలు సాగుతుండటంతో నేరుగా తీసుకువెళితే ఇబ్బందనే ఉద్దేశంతో అక్రమ రవాణా కోసం హుండీ మార్గాన్ని అనుసరిస్తోంది. రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలో అంతర్గతంగా జరిగే దాన్ని హుండీ అని అంటారు. ఈ బాధ్యతల్ని ఎక్కడికక్కడ స్థానిక నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి జగిత్యాలకు హుండీ మార్గంలో పంపుతున్న రూ.60 లక్షల్ని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. ఈ నగదును తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్కుమార్, ఆయన స్నేహితుడు సైఫాబాద్కు చెందిన వర్మ సమకూర్చారని టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్రావు తెలిపారు. ఆయన వాహనంలోనే, సొంత డ్రైవర్ తరలించారని వివరించారు. పన్ను ఎగ్గొట్టడంతో పాటు అక్రమ కార్యకలాపాల కోసం సాగే ఈ దందాలు ఎన్నికల నేపథ్యంలో జోరందుకుంటూ ఉంటాయి. ఈసీ సైతం అభ్యర్థుల బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచడంతో ప్రత్యామ్నాయ మార్గాలు సాగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాల్సిందిగా పోలీసు విభాగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా వరుసపెట్టి హుండీ ముఠాలు చిక్కుతున్నాయి. పక్కా సమాచారంతో దాడి... నగరంలోని కోఠి ప్రాంతంలో భారీ మొత్తం నగదు మార్పిడి జరుగుతున్నట్లు మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో వలపన్నిన బృందం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిసరాల్లో మఫ్టీల్లో కాపుకాసింది. బుధవారం రాత్రి తెలుపు రంగు వెర్నా కారు (ఏపీ 09 సీఎఫ్ 1144)లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుతో అక్కడి పూజ ఫ్యాషన్స్ పేరుతో ఉన్న రెడీమేడ్ వస్త్రదుకాణంలోకి వెళ్లడాన్ని గమనించారు. మఫ్టీ పోలీసులు వీరిని నీడలా వెంటాడుతూ ఆ దుకాణంలోకి వెళ్లగా... బ్యాగులో ఉన్న నగదును ఆ దుకాణం యజమాని నరేశ్ తండ్రి గుమన్సింగ్ రాజ్పురోహిత్కు కొంత, సిరిసిల్ల అవినాశ్కు మరికొంత అందించారు. గుమన్సింగ్కు ఇచ్చిన మొత్తాన్ని ఆ దుకాణంలో పని చేసే నేపాల్ సింగ్ లెక్కిస్తుండగా... దాడి చేసిన టాస్క్ఫోర్స్ ఫోర్స్ టీమ్ మొత్తం ఐదుగురినీ అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో వెర్నా కారులో నగదు తీసుకువచ్చింది వల్లభనేని అనిల్ కుమార్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్ అని గుర్తించిన పోలీసులు ప్రశ్నించగా... ఆ మొత్తం తన యజమానే ఇచ్చారని వెల్లడించాడు. తన వెంట ఉన్న మరో వ్యక్తి తన బావమరిది డి.శ్రీనివాసరావు అని, సాయం కోసం తీసుకువచ్చానని చెప్పాడు. మొత్తం రూ.60 లక్షలతో పాటు వాహనాన్నీ తనకు అప్పగించిన యజమాని అనిల్కుమార్, స్నేహితుడు వర్మ రూ.50 లక్షలు పూజ ఫ్యాషన్స్ యజమానికి, రూ.10 లక్షలు అవినాశ్కు ఇవ్వాలని సూచించారని చెప్పాడు. జూబ్లీహిల్స్ రేసులో అనిల్కుమార్?.. అనిల్ కుమార్ స్వస్థలం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పాత బెల్లంకొండవారి పాలెం. సాధారణ కుటుంబానికి చెందిన ఇతని తండ్రి ఓ రైతు. దాదాపు 20 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చారు. అప్పట్లో ద్విచక్ర వాహనం సైతం లేకుండా కాలినడకన తిరిగినట్లు సమాచారం. తొలినాళ్లలో సినిమా నిర్మాణ సమయంలో జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేస్తుండేవాడు. ప్రస్తుతం తెలంగాణ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా ఉన్న అనిల్కు రూ.కోట్లలో ఆస్తి ఉందని సమాచారం. నందిగామలోనూ బినామీ పేర్లతో భారీగా కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరఫున నందిగామ ఎమ్మెల్యేగా నిలబడే వారి కోసం అనిల్ ప్రత్యేకంగా ప్రచార రథాలు హైదరాబాద్లో రూపొందించి పంపేవారు. ఇటీవల అమరావతి వెళ్లిన అనిల్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తనకు తెలుగుదేశం తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం. వస్త్ర వ్యాపారం ముసుగులో దందా... వస్త్రవ్యాపారం ముసుగులో నరేశ్, కంప్యూటర్ ఆపరేటర్ ముసుగులో అవినాశ్ ఏళ్లుగా హుండీ, హవాలా దందాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 కమీషన్ తీసుకుంటూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ నగదు తరలిస్తూ ఉంటారని వెలుగులోకి వచ్చింది. ఈ రూ.60 లక్షల్ని జగిత్యాలలో ఉన్న కళ్యాణ్ డ్రస్సెస్కు పంపాలని వీరు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో హవాలా దందా నిర్వహించే ఆ దుకాణ నిర్వాహకులు అక్కడి తెలుగుదేశం నాయకులకు నగదు అప్పగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్, గుమన్సింగ్, నేపాల్ సింగ్, శ్రీనివాస్, అవినాశ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వల్లభనేని అనిల్కుమార్కు చెందిన వాహనం, సెల్ఫోన్లు, మరో ద్విచక్ర వాహనంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును లెక్కించగా రూ.59,00,500 ఉన్నట్లు తేలింది. ఈ నగదు పంపడంలో కీలకంగా వ్యవహరించిన వర్మ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కీలక నేతకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ ఇంట్లో కీలక నేతల భేటీ... మణికొండ చిత్రపురికాలనీలోని ఓ మండపంలో మంగళవారం రాత్రి జరిగిన పూజ కార్యక్రమాలకు ఈ నేతతో పాటు మరికొందరు కీలక టీటీడీపీ నాయకులు హాజరయ్యారని తెలిసింది. పూజ ముగిసిన తర్వాత అక్కడే ఉన్న అనిల్కుమార్ ఇంట్లో వీరంతా దాదాపు రెండు గంటల పాటు సమావేశమై కీలకాంశాలు చర్చించారని సమాచారం. ఇది జరిగిన మరుసటి రోజే అనిల్, వర్మ జగిత్యాలకు రూ.60 లక్షలు హుండీ రూపంలో పంపే ప్రయత్నం చేయడంతో ఇది ఎన్నికల ఖర్చులకు సంబంధించిన డబ్బే అని, దీని వెనుక సదరు టీటీడీపీ నాయకుల పాత్ర సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం ఐదుగురితో పాటు నగదునూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. ఈ నగదు తరలింపు వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఇలాంటి దందాలు జోరందుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న హవాలా, హుండీ ఏజెంట్లపై డేగకన్ను వేశారు. -
ముంబై టు న్యూయార్క్
- విమానంలో కరెన్సీ అక్రమ తరలింపు - న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయిన పైలట్ ఆకాశమార్గంలో నగదు అక్రమ తరలింపునకు పాల్పడ్డ పైలట్ ఉదంతం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. నిందితుడి దగ్గర లభించిన అక్రమ కరెన్సీ ముంబై నుంచి సరఫరా కావటంతో ఇటు భారతీయ అధికారులూ కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ కు చెందిన ఆంటోనీ వార్నర్ (55) ఓ కమర్షియల్ పైలట్. వేరొక మిమానంలో ముంబై నుంచి న్యూయార్క్ కు భారీగా అక్రమ డాలర్లు తరలిస్తున్న ఆయనను లిబర్టీ ఇంజర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ల్యాప్ టాప్ బ్యాగులో దాచిన రెండు లక్షల యూఎస్ డాలర్లతోపాటు భారీగా ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డబ్బు, నగలపై వార్నర్ వివరణ అనుమానాస్సదంగా అనిపించడంతో అతణ్ని అరెస్టుచేశామని ఇమిగ్రేషన్ అధికారుల చెప్పారు. కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సైతం దర్యాప్తులో పాలుపంచుకుంటున్న ఈ కేసులో నేరణం నిరూపణ అయితే వార్నర్ కు గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది. అయితే ముంబై నుంచి న్యూయార్క్ కు వార్నర్ ప్రయాణించిన విమానం ఏ సంస్థకు చెందిందో తెలిపేందుకు నిరాకరించారు అధికారులు!