దక్షిణాది తారల అపూర్వ కలయిక!
దక్షిణాది తెరవేల్పులు మరోసారి కలుసుకోనున్నారు. 80వ దశకంలో సినిమా పరిశ్రమను ఏలిన నటీనటులు ఒకచోట కలుసుకుని ఊసులు కలబోసుకోవాలని భావిస్తున్నారు. అందరూ కలిసి ఆనందోత్సాహాలతో గడపాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందొకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాదిలోని నాలుగు సినిమా పరిశ్రమలకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
అయితే ఈసారి సీనియర్ నటులకు యువ తారలు ఈ ప్రైవేటు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. సీనియర్ నటుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ యువతారలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. శింబు.. రజనీకాంత్, కమలహాసన్ పాటలకు డ్యాన్సులు చేయనున్నాడు.
శ్రీప్రియగా నీతుచంద్ర అలరించనుంది. బిందు మాధవి తన ప్రదర్శనతో సిల్క్ స్మితకు నివాళి అర్పించనుంది. ఎయిటీస్ గ్లామర్ డాల్స్ రోల్ లో నమిత సందడి చేయనుంది. వీరితో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, వేదిక, మహత్, వైభవ్ కూడా హుషారెత్తించే ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.