breaking news
Ashwin Rao
-
‘అశ్విన్రావు’ అరెస్ట్
హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఎస్ఐటీ అధికారులు నేడు లోకాయుక్త పదవికి ‘భాస్కర్రావు’ రాజీనామా! బెంగళూరు: ‘లోకాయుక్త’ అవినీతికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్రావు కుమారుడు అశ్విన్రావును ప్రత్యేక విచారణ బృందం(ఎస్ఐటీ) అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లో అశ్విన్రావును అరెస్ట్ చేసిన ఎస్ఐటీ అధికారులు ఆయన్ను బెంగళూరు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అశ్విన్రావును లోకాయుక్త ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి అనుమతి కోరనున్నట్లు ఎస్ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అశ్విన్రావుతో పాటు మరో వ్యక్తిని సైతం ఎస్ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరిస్తున్నారు. ఓ లోకాయుక్త న్యాయమూర్తి కుమారుడిని అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయడం లోకాయుక్త చరిత్రలోనే ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కాగా, లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్ఐటీ అధికారులు అశ్విన్రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు అశ్విన్రావు స్పందించకపోవడంతో కేసులో తదుపరి విచారణకు గాను ఎస్ఐటీ అధికారులు అశ్విన్రావును అరెస్ట్ చేశారు. ఇక ఇదే సందర్భంలో అశ్విన్రావు అరెస్ట్ నేపథ్యంలో లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్రావు నేడు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. లోకాయుక్త సంస్థ పై అవినీతి ఆరోపణలు రావడం, ఈ అంశంలో స్వయంగా లోకాయుక్త న్యాయమూర్తి కుమారుడు అశ్విన్రావే భాగస్వామి అయ్యారనే వార్తలు వచ్చినప్పటి నుంచి భాస్కర్రావు రాజీనామా కోసం డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం రాజీనామాకు సిద్ధపడలేదు. ఇక అశ్విన్రావును ఎస్ఐటీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్రావు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో గవర్నర్ వజుభాయ్ వాలాను మంగళవారం కలిసి లోకాయుక్త భాస్కర్రావు తన రాజీనామాను అందజేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అశ్విన్రావు అరెస్టుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. అశ్విన్రావు తనను బెదిరిస్తున్నట్లు నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న చెన్నబసప్ప గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే అశ్విన్రావును అరెస్టు చేశారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. రియాజ్కు 12 రోజుల జుడీషియల్ కస్టడీ ఇక లోకాయుక్త అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త ప్రజా సంబంధాల శాఖ అధికారి రియాజ్ను ఆదివారం రాత్రి పొద్దు పోయాక అరెస్ట్ చేసిన ఎస్ఐటీ అధికారులు ఆయన్ను సోమవారమిక్కడి లోకాయుక్త ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా రియాజ్ను 12 రోజుల జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. -
లోకాయుక్తకు ‘గవర్నర్’ ఫోన్
అవినీతి ఆరోపణలపై లోకాయుక్త న్యాయమూర్తికి ఫోన్ చేసిన గవర్నర్ పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు బెంగళూరు: లోకాయుక్త సంస్థ పేరును అడ్డుపెట్టుకొని లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్రావు కుమారుడు అశ్విన్రావు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా(వి.ఆర్.వాలా) స్పందించారు. ఈ మొ త్తం వ్యవహారంపై లోకాయుక్త భాస్కర్రావుతో గవర్నర్ వి. ఆర్.వాలా సోమవారమిక్కడ ఫోన్లో సంభాషించినట్లు సమాచారం. లోకాయుక్త వ్యవహారంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న గవర్నర్ వి.ఆర్.వాలా, లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలుఉధృతమవుతుండడంతో ఈ అంశంపై గవర్నర్ స్పందించారు. లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలతోపాటు ఎలాంటి ఫిర్యాదులు తీసుకోవద్దంటూ లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్రావు లోకాయుక్త అధికారులకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం గవర్నర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. లోకాయుక్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం గవర్నర్ వి.ఆర్.వాలా ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సైతం గవర్నర్ ఒకింత అసహనాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. లోకాయుక్త న్యాయమూర్తి పైనే అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇదిలాగే కొనసాగితే ప్రజలు ఏ దర్యాప్తు సంస్థను కూడా నమ్మే పరిస్థితి ఉండదని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. లోకాయుక్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీని గవర్నర్ వి.ఆర్.వాలా ఆదేశించినట్లు సమాచారం. 4.