breaking news
Advanced Buildings
-
హైవేలపై డ్రైవర్లకు భవనాలు: మోదీ
న్యూఢిల్లీ: ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై తగినంత విశ్రాంతి తదితర సౌకర్యాల నిమిత్తం కొత్త పథకం తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘ఇందులో భాగంగా తొలి దశలో అన్ని సదుపాయాలతో కూడిన 1,000 అధునాతన భవనాలు నిర్మిస్తాం. వాటిలో ఫుడ్ స్టాళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, విశ్రాంతి స్థలాల వంటివిన్నీ ఉంటాయి’’ అని వెల్లడించారు. శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2024లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది ఇందులో కీలక పాత్ర కానుందన్నారు. దేశ మొబైల్ పరిశ్రమకు ఇది స్వర్ణయుగమన్నారు. -
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్లోనే. దాంతో భారత్లో జెమ్ క్యాపిటల్గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్కు ఆహ్వానించగా భారత్కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్హీట్ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
వినియోగంలోకి తెస్తే ప్రతిష్టాత్మకమే..
కాగజ్నగర్ రూరల్ : కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామ సమీపంలో 21వ శతాబ్ది గురులకు విద్యాలయం కోసం నిర్మించిన అధునాతన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 12 కోట్లతో నిర్మించిన అధునాన భవనాలు నాలుగేళ్లుగా నిరూపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్తోపాటూ ఇతర సాంకేతిక విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 21వ శతాబ్ధి గురుకులాలను మంజూరు చేసింది. ఎంసెట్లో సీటు రాని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్రెడ్డి 21వ శతాబ్ధి గురుకులాలకు రూపకల్పన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలికి అప్పగించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కాాగజ్నగర్ మండలం గన్నారంలో గురుకుల భవనాలు నిర్మించారు. గ్రామ సమీపంలోని 50 ఎకరాల భూమి కేటాయించి రూ. 12 కోట్లు విడుదల చేశారు. 12 కోట్లతో భనవ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎనిమిది బ్లాకులు, 384 గదులతో అధునాతన సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాక్కు మూడు అంతస్తులు, ప్రతీ అంతస్తుకు 16 చొప్పున మొత్తం 384 గదులను నిర్మించారు. 2010 సంవత్సరం నాటికే ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు వసతీసౌకర్యం కల్పించేలా అధునాతన ఏర్పాట్లు చేపట్టారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి మృతి చెందడంతో అనంతర కాలంలో ఈ గురుకులాల గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ భవనాలు నిరూపయోగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ భవనాలను పట్టించుకుని వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 50 ఎకరాల విశాల స్థలంలో అధునాతన భవనాలు నిర్మించి ఉండడంతో ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తేనే భవనాలు వినియోగంలోకి రావడమే కాకుండా ఈ ప్రాంతంకూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు ఈ భవనాలను వినియోగంలోకి తెచ్చే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. ఈ భవనాలను గిరిజన యూనివర్శిటీకి కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రశేఖర్రావుకు వివరించడం జరిగిందని, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థులకు ఈ భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తీసుకువస్తే జిల్లాకే తలమానికం కానున్నాయి.