
అబ్బాయికి బాబాయ్ దిమ్మదిరిగే షాక్!
అబ్బాయి అఖిలేశ్ యాదవ్- బాబాయ్ శివ్ పాల్ యాదవ్ మధ్య సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన అంతర్గత ఆధిపత్య పోరు సమసిపోయినట్టు పైకి కనిపిస్తున్నా..
అబ్బాయి అఖిలేశ్ యాదవ్- బాబాయ్ శివ్ పాల్ యాదవ్ మధ్య సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన అంతర్గత ఆధిపత్య పోరు సమసిపోయినట్టు పైకి కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం కుంపటి ఇంకా మండుతున్నట్టే కనిపిస్తోంది. ఎస్పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రంగంలోకి దిగడంతో బలవంతంగా అఖిలేశ్-శివ్ పాల్ యాదవ్ మధ్య రాజీ కుదిరింది. ఈ వివాదంలో ములాయం తనయుడిని మందలించి.. తమ్ముడు శివ్ పాల్ కు మద్దతునివ్వడంతో ఆయన వర్గం పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఎస్పీ కొత్త అధ్యక్షుడైన శివ్ పాల్ యాదవ్ ముగ్గురు ఎమ్మెల్సీలు సహా ఏడుగురు నేతలపై వేటు వేశారు. వారిని పార్టీ నుంచి తొలగించారు. ఈ ఏడుగురు సీఎం అఖిలేశ్ కు విధేయులు కావడం గమనార్హం. పార్టీ నుంచి బహిష్కృతులైన ఏడుగురిలో సునీల్ సింగ్ యాదవ్ (ఎమ్మెల్సీ), ఆనంద్ బహదూరియా (ఎమ్మెల్సీ), సంజయ్ లాథర్ (ఎమ్మెల్సీ), ఎండీ ఎబాద్ (రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు), బ్రిజేష్ యాదవ్ (సమాజ్వాదీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడు), గౌరవ్ దూబే (పార్టీ యూత్ బ్రిగేడ్ జాతీయ అధ్యక్షుడు), దిగ్విజయ్ సింగ్ దేవ్ (ఛత్రా సభ రాష్ట్ర అధ్యక్షుడు) ఉన్నారు.
ఇప్పటికే భూకబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోపాల్ యాదవ్ మేనల్లుడు, ఎమ్మెల్సీ అరవింద్ ప్రతాప్ యాదవ్ పై శివ్ పాల్ యాదవ్ వేటువేశారు. పార్టీ సీనియర్ నేత, ములాయం కజిన్ సోదరుడైన రాంగోపాల్ 'బాబాయ్-అబ్బాయి పోరు'లో అఖిలేశ్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే సీఎం అఖిలేశ్ వర్గాన్ని బలహీనపరిచే రీతిలో శివ్ పాల్ యాదవ్ చర్యలు ఉండటం గమనార్హం. అఖిలేశ్ వద్ద ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని ములాయం తాజాగా శివ్ పాల్ కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా అఖిలేశ్ బాబాయి మంత్రిత్వశాఖలకు కోత పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య మొదలైన రగడ చివరకు ములాయం జోక్యంతో ముగిసిన సంగతి తెలిసిందే.