భావజాల అన్వేషణలో ‘ఆప్‌’

భావజాల అన్వేషణలో ‘ఆప్‌’ - Sakshi


జాతిహితం

అధికారాన్ని కోరుకుంటున్నా ఆమ్‌ ఆద్మీ పార్టీ తన ప్రధాన భావజాల సారం ‘వ్యవస్థకు వ్యతిరేకమైనది’ అన్న ముద్రను ఇంకా ఎలాగో కాపాడుకోవడం విశేషం. అన్నా హజారే ఉద్యమం మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత, అది ఒక జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. బలమైన నాయకుని నేతృత్వంలో అది ఒక భావజాలం కోసం అన్వేషిస్తోంది. ఆ భావజాలం, ఆ నాయకుడు నిజంగా విశ్వసించేదే కానవసరం లేదు. కనీసం మనకు సుపరిచితం కాని భావజాలమది.



ఎనిమిదేళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమం రాజకీయవేత్తల/ రాజకీయాల వ్యతిరేక సమర నాదంతో మొదలైంది. భారత సమాజంలోని, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలలోని చెడులన్నిటికీ రాజకీయాలను, రాజకీయవేత్తలను అది తప్పుపట్టింది. ‘‘నేత’’ అనే మాటే తిట్టయిపోయింది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయాలని ఆయన కోరుకోరనుకోండి. త్వరలోనే ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం, మధ్యస్థ స్థాయికి చెందినవారు, పట్టణ వృత్తిజీవులు ‘‘కుళ్లు’’ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే ఒక విధమైన తిరుగుబా టుగా పరిణమించింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ప్రముఖులు, దాని సాను భూతిపరులు, నిలకడగల వామపక్షవాదులను ఆ ఉద్యమం ఆకట్టుకుంది. బాబా రామ్‌దేవ్‌ నుంచి జనరల్‌ వీకే సింగ్‌ వరకు, కిరణ్‌ బేడీ నుంచి ప్రశాంత్‌ భూషణ్, షబనా ఆజ్మీ, ఓంపురి, అమీర్‌ ఖాన్‌ల వరకు మద్దతుగా ముందుకు వచ్చారు. భావజాలాలకు అతీతంగా ఆ ఉద్యమం అందరినీ ఆకట్టుకుందనే దానికి ఇది మంచి ఉదాహరణ.



కేజ్రీవాల్‌ నేతృత్వంలో అన్నా హజారే, ఆయన వీరయోధులు ఆ ఆగ్రహావేశపు తరంగంపైనే ఎగిసివచ్చారు. ఎన్నికల తతంగం అంతా అవినీతిపరుల కోసమేనని, ప్రజలు ఓ సీసా మందు కోసమో లేదా రూ. 500 నోటు కోసమో ఓటు వేసేవారని, పార్లమెంటు అత్యా చారాలు చేసేవారు, బందిపోట్లు, దొంగలకు నిలయం మాత్రమేనని తీసిపారే శారు. అలాంటి పార్లమెంటులోని ఈ 800 మంది (ఉభయ సభల మొత్తం సభ్యులు) 125 కోట్ల మంది తలరాతలను ఎలా రాస్తారు? అని నిలదీశారు. అధికారం ఆవిర్భవించాల్సి ఉంది, పరిపాలన, చట్టాల రూపకల్పన అట్టడుగు  నుంచి పైకి సాగాలి, వ్యవస్థను తలకిందులు చేయాలి. ఒక్క ముక్కలో చెప్పా లంటే ఇప్పుడు కావాల్సింది విప్లవమే తప్ప, అంతకు తక్కువ కాదు.



ఎన్నికల బాటలో ‘విప్లవం’

అన్నా హజారే, గాంధీలా నటిస్తుండగా, యువ కార్యకర్తలు, నానా రకాల సోషలిస్టులు, అందరికంటే ముఖ్యంగా టీవీ యాంకర్లు ఆయనకు నీరా జనాలు పట్టారు. ఆయన తన ప్రధాన ఆయుధమైన  ఆమరణ నిరహార దీక్ష కూడా గాంధీ నుంచి అరువు తెచ్చుకున్నదే. కాకపోతే ఆయన ప్రయోగించిన సంకేతాలు, అభిభాషణలు మాత్రం గాంధేయమైనవి కావు. భగత్‌సింగ్, సుభాష్‌ చంద్ర బోస్‌లకు, చివరకు మహారాణా ప్రతాప్‌కు అవి దగ్గరగా ఉండేవి. రామ్‌లీలా మైదాన్‌లో అన్నా చేతులు జాపి ‘‘దిల్‌ దియా హై జాన్‌ భీ దేంగే, ఏ వతన్‌ తేరే లియే’’ అనే దిలీప్‌ కుమార్‌ పాట చరణాన్ని వినిపించ డాన్ని గానీ, లేదా అరెస్టయి, పోలీసు బస్సులో పోతూ కిరణ్‌ »ే డీ టీవీ కెమె రాల వైపు తిరిగి ‘‘అబ్‌ తుమ్హారే హవాలే వతన్‌  సాథియో’’ అని ఆలాపించ డాన్నిగానీ గుర్తుతెచ్చుకోండి. అయితే ఆమె ఉపయోగించినది ఎన్నటికీ మర పురాని హఖీకత్‌ చిత్రంలో కైఫీ అజ్మీ రాసినదో లేక బాగా ఇటీవలి కాలపు అమితాబ్‌–అక్షయ్‌–బాబీ డియోల్‌ల చెత్త చిత్రం లోనిదో తెలియదు. కానీ ఆ సందేశం మాత్రం ఏదో ఒక కొత్త చట్టం, కనీసం మొత్తం రాజకీయాధికారం కావాలి అనేది మాత్రం కాదు.. ‘‘వ్యవస్థను’’ మార్చే విప్లవం సాగించాలనేదే.



అన్నా ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్న ఆనాటి నుంచి నేడు అది ఎక్కడికి చేరిందో చూద్దాం. అన్నా హజారే ఎక్కడుండాలో అక్కడికే చేరారు. రాలెగావ్‌ సిద్ధిలో ఏకాంతంగా తన ఊహాలోకంలోని దయ్యాలతో పోరాటం సాగిస్తు న్నారు. అప్పుడప్పుడూ ప్రధాని చేపట్టిన ఏ చిన్నపాటి చర్యనో ప్రశంసిçస్తూ లేదా కేజ్రీవాల్‌ చేసే చాలా పనులను విమర్శిస్తూ విజయవంతంగా పతాక శీర్షికలను వేటాడుతున్నారు. ఆయన ఉద్యమంలో ప్రధాన భూమికను పోషిం చిన కీలక వ్యక్తుల్లో ఏ ఒక్కరూ నేడు ఆయనతో లేరు. కిరణ్‌ బేడీ, మనీష్‌ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్‌ భూషణ్, మేధా పాట్కర్‌ తదితరు లంతా ఎన్నికల రాజకీయాల్లో చేరారు. వైఖరి, పద్ధతి, ఉద్దేశాలకు సంబం ధించి అన్నా ఉద్యమాన్ని ప్రశ్నిస్తూ దానితో తలపడ్డ మాలాంటివారి విషయా నికి వస్తే్త... మౌలిక మేధోపరమైన చర్చలో గెలుపొందామని మేం ప్రకటించగలం.



వ్యవస్థను మార్చాలంటే, మీరు దాన్ని వాటేసుకోవాల్సిందే, దాన్ని మార్చాలంటే మీరు అధికారంలోకి రావాల్సిందే. ఎన్నికల రాజకీయాలను రొచ్చుగుంట అన్నాగానీ, మీరు దాన్ని ఈదుకుంటూ పోవాల్సిందే. అంటే, అధికారాన్ని చేపట్టడానికి ఉన్న ఏకైక మార్గం బ్యాలెట్‌ ద్వారా ప్రజా బాహు ళ్యపు ఆమోదాన్ని పొందటమే అని. ఎన్నికల ప్రక్రియ ఆవశ్యకంగా న్యాయ  మైనది, ఓటర్లు తెలివిగలవారు, చాలావరకు అవినీతి సోకని బాపతే. కేజ్రీ వాల్‌ ఢిల్లీని తుడిచిపెట్టేశాక, పంజాబ్, గోవాలతో జాతీయస్థాయి రంగ ప్రవేశం చేయనున్నాడు, గుజరాత్‌లోనూ సరికొత్త సవాలుదారు కావచ్చని భయపెడుతున్నాడు. రాజకీయాలు, ఎన్నికలు అన్నీ బూటకమేనని కేజ్రీవాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఇక ఎంత మాత్రమూ అనలేరు. అన్నా హజారే ఉద్యమం రాజకీయాలకు వ్యతిరేకమైనదిగా నటించడాన్ని విమర్శస్తూ మనలో కొందరు చెప్పింది సరిగ్గా ఇదే కాదా? ‘‘నిజాయితీగా మీకు రాజకీ యాధికారం కావా లని చెప్పండి’’ అని మేం నిలదీశాం.



కేజ్రీవాల్‌ బ్రాండ్‌ రాజకీయం

ఆమ్‌ ఆద్మీ పంజాబ్‌లో మొదటి స్థానంలో ఉన్నా లేక రెండో స్థానంలో ఉన్నా లేదా గోవాలో ఏ స్థానంలో నిలిచినా... దాని జనాకర్షణ మాత్రం విస్తరి స్తోంది. గుజరాత్‌లో ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకలాపాలు సైతం అదే సూచి స్తున్నాయి. అధికారాన్ని కోరుకుంటున్నా ఆప్‌ తన ప్రధాన భావజాల సారం ‘వ్యవస్థకు వ్యతిరేకమైనది’ అన్న ముద్రను ఇంకా ఎలాగో కాపాడుకోవడం విశేషం. భావజాలేతరమైన పార్టీగా ఉన్న దాని ఆకర్షణకు తోడు, బీజేపీకి దీటైన అతి జాతీయవాదపు నగిషీలు, అలంకారాలూ సైతం ఉన్నాయి (ఇంకా అది భగత్‌సింగ్‌ పేరును వాడుతూనే ఉంది). కేజ్రీవాల్‌ తన ప్రచార కార్య క్రమాల్లో అరుదుగా తప్ప ప్రత్యేకించి ఏ ఒక్క పార్టీపైనా దాడి చేయరు. అన్నిS పార్టీలపైనా, అంటే ఆచరణలో ‘‘వ్యవస్థ’’కు సంబంధించిన  రాజకీయ వేత్త లందరిపైనా దాడి చేస్తారు. ఆయన బ్రాండుకు ఉన్న కీలకమైన ఆకర్షణ ‘గొప్ప విచ్ఛిన్నకుడు’ అనే ఆ గుర్తింపే.



కేజ్రీవాల్, ఆయన కీలక అనుచరులు అందరిదీ యువతరం, సాధార ణంగా వారు అవినీతిపరులు కారన్నట్టుగానే కనిపిస్తారు (ఢిల్లీ పోలీసు, సీబీ ఐల ఎఫ్‌ఐఆర్‌లను నమ్మేవారు లేరు). అతి పెద్ద యువ ఓటర్ల పునాదిలో ఆయనకు సానుకూలాంశం. ఆయన ప్రత్యర్థులలో కొందరు, సుఖబీర్‌ బాదల్, రాహుల్‌ గాంధీ అంత పెద్దవారేమీకారు, చిన్నవారు కూడా. అయినా గానీ వారు సంపన్నుల రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించేవారు. కాగా, కేజ్రీవాల్‌ స్వీయకృషితో రాణించినవారు. గత చరిత్ర లేకపోవడం, అనుభవ రాహిత్యాలను ఆయన తనకు అనుకూలతగా, అమాయకత్వానికి మారుపే రుగా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల, మాకు కనీసం ఒక్క అవకాశం ఇవ్వండి అనే ఆయన మాట యువ ఓటర్లను మరింత ఎక్కువగా ఒప్పించ గలిగేదిగా ఉంటోంది.



భావజాలం కోసం అన్వేషిస్తున్న భావజాలరహిత పార్టీ

కాంగ్రెస్‌ ఓట్లను తుడిచిపెట్టేయడం ద్వారానే కేజ్రీవాల్‌ ఢిల్లీలో ఘన విజయం సాధించారని మనకు తెలుసు. పంజాబ్‌లో ఆయన అకాలీ–బీజేపీ కూటమి ఓట్లను ఎక్కువగా రాబట్టుకుంటారనడం సమంజసమే అవుతుంది.  నిజమైన భావజాలమంటూ లేకపోవడం లేదా ఒక రాష్ట్ర రాజకీయ అవసరాలకు పూర్తిగా అనుగుణమైనది కాగలిగినదిగా ఆవిర్భవిస్తున్న భావజాలం ఉండ టం దానికి సానుకూలతగా లెక్కించాలి. అయితే ఇంతకు మించి ఆప్‌ను సువ్యవస్థితమైన పార్టీల నుంచి వేరుచేసేది ఏమైనా ఉందా? ఆ పార్టీలలో మనం ఉన్నాయనుకుంటున్న లోపాలన్నింటి జాబితాను తయారు చేయండి.



అవినీతి, వయసు, అధికారంలో ఉండటం అనే అంశాలను మినహాయిస్తే... అందులో ఉన్న వ్యక్తిపూజ, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, అధిష్టాన వర్గపు సంస్కృతి, మీడియా విమర్శల పట్ల అసహనం, లోతైన ఉదారవాద వ్యతిరేకత, ఎలాంటి అసమ్మతిని, ప్రశ్నించడాన్ని సహించని అత్యంత శక్తి వంతుడైన సుప్రీమ్‌ తరహా నేత తదితరాలను చూడండి. వాటిలో ఏమన్నా  ఆప్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో కనిపించనివి ఏమైనా ఉన్నాయేమో సరి చూడండి. ఆ పార్టీ నేత ఎంతటి అత్యంత శక్తివంతుడంటే తాను పరిపాలి స్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రాన్ని(ఢిల్లీ) వదలి దాదాపు రెండు వారా లుగా సుదూరంలోని నగరంలో గడుపుతున్నారు. ఏ రాజ్యాంగపరమైన లేదా పార్టీపరమైన జవాబుదారీతనం లేని రాహుల్‌ ఏడాది చివర్లో ఒక వారం విశ్రాంతి తీసుకున్నందుకు విమర్శల వెల్లువను ఎదుర్కొన్నారు.



అన్నాహజారే ఉద్యమం మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత, అది ఒక జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. బలమైన నాయకుని నేతృత్వంలో అది ఒక భావజాలం కోసం అన్వేషిస్తోంది. ఆ భావజాలం, ఆ నాయకుడు నిజంగా విశ్వసించేదే కానవసరం లేదు. కనీసం మనకు సుపరిచితం కాని భావజాలమది. నిలకడగా నిలిచిపోయిన, విసుగెత్తించే మన రాజకీయాలకు అది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. అది రాజకీయ రిపోర్టర్లుగా, అభి ప్రాయ రచయితలుగా మన ఉద్యోగాల్లోకి మరింత సరదాను తెచ్చింది. మనం మరి కొంత ధూషణను ఎదుర్కొంటే పోయిందేముంది?



తాజా కలం: గతవారం ‘జాతిహితం’లో నేను పంజాబ్‌లో ఆప్‌ పెద్ద శక్తిగా ఆవిర్భవించడం గురించి రాసినందుకు నన్ను ప్రశ్నలు ముంచెత్తాయి. ఆప్‌ ఆధినేత సోషల్‌ మీడియాలో నన్ను తిట్టిపోసినాగానీ నేనిలాంటి సాను కూల నివేదికను ఎలా ఇస్తానని ప్రశ్నించారు. ఎవరైనా నన్ను తిట్టిపోసినంత మాత్రాన నేను నా వార్తా నివేదికల్లో అబద్ధాలాడాలా? తద్వారా నా పాఠకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవాలా? ట్రంప్‌ లేదా నరేంద్ర మోదీ లేదా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎవరి విషయంలోనైనా వార్తలను అందించేటప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అదే అని భావిస్తాం.



- శేఖర్‌ గుప్తా

twitter@shekargupta

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top