ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మాదిరిగా భావిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మాదిరిగా భావిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సింగపూర్ వారికి రాజధాని నిర్మించిన అనుభవం ఉందా? వారికి వ్యవసాయం గురించి తెలుసునా అని రోజా ప్రశ్నించారు.
ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చేపడుతున్న ధర్నాలో రోజా మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంతో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు పరిగెత్తుకుపోయారని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేస్తున్నా ఎల్లో మీడియా మాట్లాడటం లేదని విమర్శించారు. ఇటీవల ఓ పత్రికలో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఓ వార్త రాశారని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరాడేది వైఎస్ జగన్ ఒక్కరేనని రోజా పేర్కొన్నారు. ఆ పత్రికలు ఇప్పటికైనా ప్రజలు గౌరవించేలా వ్యవహరించాలని హితవు పలికారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రుణమాఫీ, ప్రత్యేక హోదా, విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, తహశీల్దార్ వనజాక్షిపై దాడి అంశాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు.