మోతాదుకు మించిన మందులే కారణం | Report reveals Shashi Tharoor's wife died of drug overdose | Sakshi
Sakshi News home page

మోతాదుకు మించిన మందులే కారణం

Jan 21 2014 3:38 AM | Updated on Jun 14 2018 4:21 PM

కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మరణానికి మోతాదుకు మించిన మందులే కారణమని శవపరీక్షలో తేలింది.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మరణానికి మోతాదుకు మించిన మందులే కారణమని శవపరీక్షలో తేలింది. మందులు మోతాదుకు మించినందున అంటే... మందులు విషపూరితం కావడం వల్ల ఆమె మరణించినట్లు శవపరీక్ష నివేదికలో పేర్కొన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) అలోక్ శర్మకు ఎయిమ్స్ వైద్యులు సోమవారం సాయంత్రం శవపరీక్ష నివేదికను సమర్పించారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో శుక్రవారం సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
 
-     ఈ సంఘటనపై విచారణ చేస్తున్న ఎస్‌డీఎం అలోక్ శర్మ, శవపరీక్ష నివేదికలోని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
-     మంత్రి థరూర్, సునంద సోదరుడు సహా పలువురి వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలతో పాటు శవపరీక్ష నివేదికను పరిశీలించనున్నట్లు చెప్పారు.
-     ఆ తర్వాతే ఒక నిర్ధారణకు వస్తానని, దర్యాప్తు కొనసాగించాలా వద్దా అనే దానిపై పోలీసులకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు.
-     కాగా, ఎస్‌డీఎం నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి రాగలమని పోలీసులు తెలిపారు.
-     సునందా పుష్కర్ మృతదేహానికి తొలుత డాక్టర్ సుధీర్ కే గుప్తా నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం శనివారం ప్రాథమిక శవపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
-     సునంద మరణించిన హోటల్ గదిలో యాంటీ డిప్రెసంట్ ఔషధమైన ఆల్‌ప్రోజాలం మాత్రల ఖాళీ స్ట్రిప్‌లు రెండు పోలీసులకు లభించాయి.
-     వాటి ఆధారంగా ఆమె కనీసం 27 ట్యాబ్లెట్లు మింగి ఉండవచ్చని, దానివల్లే మరణించి ఉండవచ్చని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement