బంగ్లాదేశ్లో ఓ భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. అయితే ఒక్క దొంగ కూడా బ్యాంకులోకి ప్రవేశించకుండానే ఈ దోపిడీ జరిగిపోయింది. ఎలాగంటారా? హ్యాకర్ల మహిమ ఇది. కోటిన్నర రూపాయలను హ్యాకర్లు దోచేసుకున్నట్లు ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
బంగ్లాదేశ్లో ఓ భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. అయితే ఒక్క దొంగ కూడా బ్యాంకులోకి ప్రవేశించకుండానే ఈ దోపిడీ జరిగిపోయింది. ఎలాగంటారా? హ్యాకర్ల మహిమ ఇది. లక్ష కాదు.. పది లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలను అక్కడి ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి హ్యాకర్లు దోచేసుకున్నట్లు ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోనాలీ బ్యాంకు వార్షిక సదస్సు జరిగినప్పుడు ఆయనీ విషయాన్ని బయటపెట్టారు. హ్యాకర్లు బ్యాంకు సెర్వర్లోకి ప్రవేశించి, దాదాపు కోటిన్నర రూపాయలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు బ్యాంకు కార్యదర్శి మహ్మద్ అస్లాం ఆలం తెలిపారు.
ఈ సదస్సులోనే బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి ఎ.ఎం.ఎ. ముహిత్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. బ్యాంకు రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సి ఉందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆలం తెలిపారు. గతంలోనూ కిషోర్గంజ్ సోనాలీ బ్యాంకు దోపిడీ జరిగిందని, అలాగే గత సంవత్సరం మే 5న కొంతమంది దుండగులు బ్యాంకు ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారని, భద్రత సరిగా ఉంటే ఈ రెండు సంఘటనలను నివారించి ఉండేవారిమని ఆయన చెప్పారు.