18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర | ys Sharmila visitation trip to the second round of 18 | Sakshi
Sakshi News home page

18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర

Feb 11 2015 12:20 AM | Updated on Jul 25 2018 4:09 PM

18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర - Sakshi

18 నుంచి షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో .....

నల్లగొండ జిల్లాలో ఐదు రోజుల యాత్ర
17 కుటుంబాలకు పరామర్శ
వైఎస్సార్‌సీపీ నేత శివకుమార్ వెల్లడి
15న పార్టీ తెలంగాణ కార్యాలయం ప్రారంభం
 

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో   రెండో విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిల రెండో విడత యాత్ర ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులు జరుగుతుందని చెప్పారు. ‘‘భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో షర్మిల 509 కిలోమీటర్లు పర్యటిస్తారు. దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని జీర్ణించుకో లేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లకాల్వ సభలో ప్రజలకు మాటివ్వడం తెలిసిందే. ఆ మాట కోసమే షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్నారు.

రెండో విడత యాత్రలో 17 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు’’ అని శివకుమార్ వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందా అని ప్రశ్నించగా, నల్లగొండలో రెండో విడత యాత్ర పూర్తయ్యాక దానిపై ఆలోచిస్తామని బదులిచ్చారు. వైఎస్ మృతి పట్ల చలించి హైదరాబాద్‌లో 10 మంది, రంగారెడ్డిలో 20 మంది మరణించారని గుర్తుచేశారు. మరోవైపు, సచివాలయ మార్పును వైసీపీ వ్యతిరేకిస్తుందని శివకుమార్ చెప్పారు. దీనిపై త్వరలో తాము గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి మార్చొద్దంటూ వైఎస్సార్‌సీపీ ధర్నా నిర్వహించిందని గుర్తు చేశారు.

15న పార్టీ కార్యాలయం ప్రారంభం

బుధవారం (11వ తేదీన) జరగాల్సిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవం వైఎస్ జగన్ అందుబాటులో లేని కారణంగా వాయిదా పడిందని శివకుమార్ తెలిపారు. కార్యాలయాన్ని 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్‌లో ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర పార్టీ యంత్రాంగమంతా హాజరవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement