ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం | We are committed to a 12 per cent reservation for Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

Jul 30 2014 12:32 AM | Updated on Oct 16 2018 6:01 PM

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం - Sakshi

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన హామీ ప్రకారం 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

తాండూరు టౌన్: ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన హామీ ప్రకారం 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో మంగళవారం ఉదయం చెన్‌గేష్‌పూర్ రోడ్డులోని ఈద్గా మైదానానికి చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి మహేందర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
 
ముస్లింలకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత సామరస్యత పాటిస్తూ ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని అన్నారు. పేద ముస్లింలకు, విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుందన్నారు. పలు అభివృద్ధి పనుల నిమిత్తం ముస్లింలకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్, మున్సిపల్ కమిషనర్ గోపయ్య, సీపీఎం నాయకులు జనార్దన్‌రెడ్డి, టీడీపీ నాయకులు నరేష్, కాంగ్రెస్ నాయకులు అఫు, శ్రీనివాసాచారి, రాములు, టీఆర్‌ఎస్ నాయకులు కొట్రిక వెంకటయ్య, అబ్దుల్ రవూఫ్, సంపత్, అమిత్, అయ్యూబ్‌ఖాన్, రవిగౌడ్, న రేందర్, సురేందర్‌రెడ్డి తదితరులు ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
 
బందోబస్తును పరిశీలించిన ఎస్పీ
సామూహిక ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ రాజకుమారి ఈద్గా మైదానం వద్దకు చేరుకుని బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
పారిశ్రామిక జిల్లాగా మారుస్తా
జిల్లాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక జిల్లాగా మారుస్తానని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ లో పరిశ్రమలు స్థాపించాలనుకునే పారిశ్రామిక వేత్తలకు స్వాగతిస్తున్నామన్నారు. తాండూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ  రాష్ట్రంలో కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని, నూతన పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. విప్రో, టాటా, ఇన్ఫోసిస్ తదితర ఐటీ పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారన్నారు. పరిశ్రమల స్థాపన జరిగితే నిరుద్యోగం తగ్గుతుందన్నారు. రంజాన్, బోనాల పండుగ ఒకే నెలలో రావడం శుభసూచకమన్నారు. వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement