యాదాద్రి ఆలయానికి మూడు వాకిళ్లు

Three doors to Yadadri temple - Sakshi

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి మూడు వాకిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గర్భాలయానికి అమర్చిన మూడో వాకిలిని బంగారంతో తాపడం చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరు మల తరహాలోనే బంగారు వాకిలిని రూపొందించడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏడంతస్తుల ప్రధాన రాజగోపురానికి అమర్చనున్న మొదటి వాకిలికి 27 అడుగుల ఎత్తులో టేకు చెక్కతో భారీ ద్వా రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండవ వాకిలి ద్వా రాన్ని టేకుతో తయారు చేసి, దానిపై వెండి తాపడం చేయనున్నారు. దీన్ని 18 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. అలాగే గర్భాలయం లోపల భాగంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయాన్ని అన్ని హంగులతో శోభాయమానంగా రూపుదిద్దడానికి మరో మూడు నెలలు పట్టనుందని వారు పేర్కొన్నారు.  

5 నుంచి వరుణయాగం  
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఈ నెల 5 నుంచి 7 వరకు వరుణ యాగం తలపెట్టారు. ఈ యాగానికి 16 మంది రుత్వికులకు ఆహ్వానాలు పంపాలని తీర్మానించారు. భక్తులు సైతం పాల్గొని వరుణ యాగాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5వ తేదీన  ఉదయం 10 గంటలకు గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించి రాత్రి 8 వరకు నిర్వహించనున్నారు. ఇలా మూడు రోజుల పాటు యాగం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top