పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీని వీడిన వారి ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది.
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీని వీడిన వారి ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది. పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన పార్టీ ద్రోహుల ఫొటోలను గాంధీభవన్లో ఉంచాల్సిన అవసరమ లేదని టీపీపీసీ ముఖ్యనాయకుడొకరు గురువారం ప్రదిపాదించారు. ఈ ప్రతిపాదనతో టీపీసీసీ నేతలంతా అంగీకరించారు. మరోసారి ముఖ్యులతో మాట్లాడి, ఈ ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించారు.
పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారి ఫోటోలు, వారు పని చేసిన కాలం వంటివాటితో అందరి ఫొటోలను గాంధీభవన్లో వరుసగా పెట్టే సంప్రదాయం ఉంది. అయితే, పార్టీ నుంచి పోయినవారి ఫొటోలను ఇప్పటిదాకా గాంధీభవన్ నుంచి తొలగించిన దాఖాలాల్లేవు. పార్టీ నుంచి బయటకు పోయి, కాంగ్రెస్ పార్టీనే తిడుతున్న ద్రోహుల ఫోటోలను ఎందుకు పెట్టాలంటూ పలువురు నేతలు ప్రశ్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.