‘ఏజెన్సీ’లో ప్రత్యేక అంబులెన్సులు | Special ambulances in 'agency' | Sakshi
Sakshi News home page

‘ఏజెన్సీ’లో ప్రత్యేక అంబులెన్సులు

Dec 6 2017 2:02 AM | Updated on Oct 9 2018 7:52 PM

Special ambulances in 'agency' - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టా లని మంత్రి అజ్మీరా చందూలాల్‌ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ద్వారా ఆస్పత్రులను నిర్వహిస్తున్నప్పటికీ.. అత్యవసర సేవలను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందించాలని సూచించారు. ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయాలని, వాటిని మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధా నం చేయాలని ఆదేశించారు. మంగళవారం డీఎస్‌ఎస్‌ భవన్‌లో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశంలో చందూలాల్‌ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్, పారామెడికల్‌ ఖాళీలన్నీ వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. భద్రాచలం, ఊట్నూరు, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏలలో గిరిజన బాలికల కోసం ప్రత్యేకం గా నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. గిరిజన అనాథలు, నిరాశ్రయ మహిళలను ఆదుకునేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్టేట్‌ హోమ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళల అక్రమ రవాణాపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో అది కార్యరూపం దాల్చుతుందన్నారు. 

రోడ్లు మెరుగుపరుస్తున్నాం.. 
రోడ్లు లేని తండాలు, గూడేలకు రవాణా వసతిని మెరుగుపరుస్తున్నామని, ఇందుకోసం రూ.517 కోట్లు కేటాయించామని చందూలాల్‌ తెలిపారు. ఇప్పటికే టెండర్ల దశ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. చెంచు ప్రాంతాలకు బీటీ రోడ్లు నిర్మించాలని, దీనిపై ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు స్వయం ఉపాధి కింద గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ శాఖ ల్లో ఖాళీగా ఉన్న గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన గురుకులాల్లో బోధన సమస్యను అధిగమించేందుకు తాత్కాలిక వలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఈ సమావేశానికి పలు శాఖల కార్యదర్శులు గైర్హాజరవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇది పునరావృతం కావొద్దని హెచ్చరించా రు. వచ్చేనెలలో మరోసారి సమీక్ష నిర్వహించి.. అన్ని అంశాలపై చర్చ పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ లక్ష్మణ్, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్‌ నికోలస్, ఎంపీ సీతారాంనాయక్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement