మోదీ మళ్లీ వస్తేనే దేశాభివృద్ధి

Smriti Irani Comments About Modi - Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ప్రధాని నరేంద్ర మోదీ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాను న్న పార్లమెంట్‌ ఎన్నికలను పురస్కరించుకుని సోమ వారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో స్మృతి ఇరానీ పాల్గొని మాట్లాడారు. దేశ సంక్షేమం కోసం, అవినీతిపరుల నుండి డబ్బును కక్కించేందుకు బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. మోదీ మళ్లీ వస్తేనే దేశాభివృద్ధి  జరుగుతుందన్నారు. అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ విషయమై బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంకుఠిత దీక్షతో పని చేయాలని పిలుపునిచ్చారు. పేదల ఆరోగ్యం కోసం, రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేందుకు కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని నీరుగార్చేందుకు కుట్రలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. బీజేపీ మహిళలకు గౌరవం ఇచ్చి గౌరవించిందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ కొన్ని పార్టీల కారణంగా రాజకీయాల్లో విలువలు నశించిపోతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top