నాచావుకు కారణం ఆమే..


నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలందుగ్యాల్ర గామంలో ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారణం ఎంపీడీవో సరస్వతి అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు...  ఉపాధిహామీ  పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసే పరమేశ్(32) కూలీల పేర్లతో సుమారు రూ 32 వేలు డ్రా చేసుకున్నాడు. ఆడిట్ లో విషయం బయట పడటంతో ఎంపీడీవో సరస్వతి ఆదేశాల మేరకే తాను అలా చేసినట్లు పరమేశ్ బయటపెట్టాడు.



అయితే తన పేరు ఎందుకు చెప్పావని ఎంపీడీవో సరస్వతి మంగళవారం పరమేశ్ ను మందలించినట్టు తెలిసింది. దీంతో పరమేశ్ అర్ధరాత్రి సమయంలో పురుగు మందు తాగి ఇంటి నుంచి పొలానికి వెళ్లి పడిపోయాడు. బయటికి వెళ్లిన పరమేశ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తెల్లవారు జామున కుటుంబ సభ్యులు వెతగ్గా.. పొలంలో శవమై కనిపించాడు. పరమేశ్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top