వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కరపత్రాలు, వాల్పోస్టర్లతో గ్రామాల్లో...
- భీమదేవరపల్లిలో ‘మన ఊరు-మన బడి’
- ఉచిత విద్య, ఆంగ్లంలోనే బోధన అంటూ..
- ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం
భీమదేవరపల్లి : వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కరపత్రాలు, వాల్పోస్టర్లతో గ్రామాల్లో తిరుగుతూ తమ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండంటూ ప్రచారం చేయడం సాధారణమే. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరుగుతూ సర్కారు పాఠశాలల పనితీరును వివరిస్తూ సీడీలు, కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార రథాల ద్వారా మీ పిల్లలను మన పాఠశాలలో చేర్పించాలంటూ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపారు.
భీమదేవరపల్లిలో మొత్తం 43యూపీఎస్, పీఎస్, 12 జెడ్పీ పాఠశాలలున్నాయి. గతంలో ప్రతి తరగతిలో 40మందికి పైగా విద్యార్థులతో కళకళలాడేవి. ఒక్కో తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సెక్షన్లు సైతం ఉండేవి. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలో కొరవడిన మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంగ్లిష్ మీడియానికి పెరిగిన ఆధరణ తదితర కారణాల వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మండలంలోని మక్త్యానాయక్, నరహరి, కొత్తపల్లి తండాలలో పీఎస్ పాఠశాలలను సైతం మూసి వేసి అక్కడి ఉపాధ్యాయులను డెప్యూటేషన్పై ఇతర పాఠశాలలకు పంపారు.
మనుగడ కష్టమని భావించి...
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాఠశాలల సంఖ్య పెరగాల్సిన నేటి రోజుల్లో కొత్త పాఠశాలల సంగతి దేవుడెరుగు, ఉన్న పాఠశాలలే మూతపడుతున్న తరుణంలో ఇక ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టమనే అభిప్రాయానికొచ్చారు ఇక్కడి ఉపాధ్యాయ బృందం. ‘సర్కార్ బడిని బతి కించుకోవాలే...రేపటి సమాజానికి మార్గదర్శులం కావాలి’ అంటూ ఎంఈవో మారెపల్లి అర్జున్, ఉపాధ్యాయ సంఘా లు నిర్ణయించుకున్నారు. కార్యచరణను రూపొందించారు.
ప్రత్యేక సమావేశాలు
ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తేవాలనే దృఢ సంకల్పంలోనుంచి ఉద్బవించేందే ‘మన ఊరు-మన బడి’ నినాదం. నెల క్రితం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో ఎంఈవో అర్జున్ అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంపీపీ సంగ సంపత్, ఎంపీడీవో వంగ నర్సిం హారెడ్డితో పాటుగా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయంటూ సర్కారు బడిని బతికించుకునే బాధ్యత అందరిపై ఉందని ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఆంగ్లంలో బోధిస్తేనే తిరిగి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయనే అభిప్రాయానికొచ్చారు.
భాస్కర్రావు చేయూత
కాగా ప్రతి పాఠశాలకు సైతం ఎల్ఈడీ ఇస్తానంటూ హామీ ఇచ్చిన మండలంలోని గట్లనర్సింగపూర్కు చెందిన కావేరీ సీడ్స్ అధినేత గుండావరపు భాస్కర్రావు ఇటీవలే 20ఎల్ఈడీలను బహూకరించారు.
వినూత్న ప్రచారం
కాగా ప్రభుత్వ పాఠశాలలో చేరండంటూ ఎంఈవో అర్జున్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక గ్రామాన్ని సందర్శిస్తున్నారు. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వార్డుసభ్యులు, విద్యావేత్తలు తదితరుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించి ప్రధా న కూడళ్ళ వద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని కేటాయించారు. పాటల ద్వారా గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఆంగ్లంలోనే బోధన .. ఎం. అర్జున్, ఎంఈవో
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ విద్యావిధానాన్ని ప్రవేశపెడ్తున్నాం. ప్రైవేట్ కు ధీటుగా విద్యబోధన, వసతులు కల్పిస్తాం. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సహకారంతో మండలంలో ప్ర భుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చి ముందుకెళ్తున్నాం.