తగ్గిన విద్యుత్ డిమాండ్ | Reduced electricity demand | Sakshi
Sakshi News home page

తగ్గిన విద్యుత్ డిమాండ్

Oct 27 2014 3:52 AM | Updated on Sep 2 2017 3:25 PM

తగ్గిన విద్యుత్ డిమాండ్

తగ్గిన విద్యుత్ డిమాండ్

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, తగ్గిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో... తెలంగాణలో విద్యుత్ డిమాండ్ తగ్గింది. కొద్దిరోజులుగా దాదాపు 1

విస్తారంగా కురుస్తున్న వర్షాలే కారణం
సాగర్‌లో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
అవసరమైతే మళ్లీ ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అధికారులు
శ్రీశైలంలో కొంతసేపు నిలిపివేసి.. తిరిగి ప్రారంభం
రిజర్వాయర్‌లోకి స్వల్పంగా చేరుతున్న వరద
విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ప్రభుత్వ నిర్ణయం
పరిశ్రమలకు పవర్ హాలిడేను ఒకరోజుకు కుదించే యోచన

 
హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, తగ్గిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో... తెలంగాణలో విద్యుత్ డిమాండ్ తగ్గింది. కొద్దిరోజులుగా దాదాపు 150 మిలియన్ల దాకా చేరిన విద్యుత్ డిమాండ్.. ఏకంగా ఆదివారం 40 మిలియన్ యూనిట్ల మేర తగ్గి, 110 నుంచి 115 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న విద్యుత్ కోతలను ప్రభుత్వం ఆదివారం నుంచి ఎత్తివేసింది.  గత వారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 150 నుంచి 160 మిలియన్ యూనిట్లకు చేరింది. ఎక్ఛేంజీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసినా.. రోజూ 10 నుంచి 20 మిలియన్ యూనిట్ల కొరత ఎదురైంది. కానీ తాజాగా డిమాండ్ తగ్గడంతో.. తాత్కాలికంగా నాగార్జునసాగర్‌లో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం నిలిపివేసినట్లు జెన్‌కో వర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం ఆదివారం పగలంతా ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు... తిరిగి సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. రెండు జనరేటర్ల నుంచి 290 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా... 14,832 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.098 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇందుకు 0.7 టీఎంసీల నీటిని వాడారు. అయితే వర్షాల నేపథ్యంలో ఆదివారం రోజా గేజింగ్ పాయింట్ నుంచి 8,800 క్యూసెక్కుల స్వల్ప వరదనీటి ప్రవాహం విడుదలైంది. ఈ జలాలు సోమవారం సాయంత్రానికి శ్రీశైలం డ్యామ్‌కు చేరుతాయి. దీంతోపాటు కర్నూలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి స్వల్పంగా నీరు చేరుతోంది. ఆదివారం పగలంతా విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం, వర్షాలతో నీరు చేరుతుండటంతో సాయంత్రానికి నీటి మట్టం అతి స్వల్పంగా పెరిగింది. ఆదివారం ఉదయానికి 856.4 అడుగుల నీటిమట్టం ఉండగా.. సాయంత్రానికి 856.5 అడుగులుగా నమోదయింది.

కోతలు ఎత్తివేత..

ఖరీఫ్ పంట కాలం ముగిసే సీజన్ కావడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట కలిగించాయి. దీంతో వీలైనంత మేరకు కోతలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు ఆదివారం సీఎం కేసీఆర్‌తో టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీ ప్రభాకర్‌రావు సమావేశమయ్యారు. ఇప్పుడున్న డిమాండ్, సరఫరాపై చర్చించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు  వారంలో రెండు రోజుల పాటు కొనసాగుతున్న పవర్ హాలిడేను.. ఒక రోజుకు కుదించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి  మెరుగైతే ఆ ఒక్క రోజు పవర్ హాలిడేను కూడా ఎత్తేయాలని నిర్ణయించారు. కాగా.. శనివారం శ్రీశైలం నుంచి 3.11 మిలియన్ యూనిట్లు, నాగార్జునసాగర్ నుంచి 6.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో వెల్లడించింది. డిమాండ్ తగ్గిన కారణంగా ఆ రెండు ప్లాంట్లతో ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశామని అధికారులు చెప్పారు. అవసరాన్ని బట్టి మళ్లీ ఉత్పత్తి చేస్తామని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement