గిరిజన జేఏసీ నిరసన | Ravindra Naik commented on Telangana government | Sakshi
Sakshi News home page

గిరిజన జేఏసీ నిరసన

Sep 3 2018 2:43 AM | Updated on Sep 3 2018 2:43 AM

Ravindra Naik commented on Telangana government - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచినా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభను వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన తెలిపారు. కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రవీంద్ర నాయక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో దళిత గిరిజనులు దగాపడ్డారని అన్నారు. 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోవడంతో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తే అణచివేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రానున్న ఎన్నికలకు ముందే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ కన్వీనర్‌ గణేశ్‌ నాయక్, జేఏసీ నాయకులు టీక్యా నాయక్, రవి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

పలువురు నాయకుల అరెస్ట్‌..
ప్రగతి నివేదన సభను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న గిరిజన జేఏసీ కన్వీనర్‌ గణేశ్‌నాయక్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులను సైతం వాహనం ఎక్కించేందుకు పోలీసులు యత్నించారు. సీఐ భీంరెడ్డి, ఎస్సైలు ఆంజనేయులు, రంగారెడ్డితోపాటు ఇతర సిబ్బంది నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement