
సాక్షి, కరీంనగర్: సమాజంలో పోలీసులు పాత్ర చాలా ముఖ్యమైనది. ఒకవైపు తన కుటుంబాన్ని చూసుకుంటూ, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. పోలీస్ కమిషనర్ స్థాపించిన టాస్క్ఫోర్సుకు చెందిన సిబ్బంది అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాక వారి మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా అనారోగ్యంతో రోడ్డుపై పడిపోయిన వారిని సైతం ఆదుకుంటున్నారు. అందుకు కరీంనగర్లోని ఎల్ఐసీ కార్యాలయం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం.
కరీంనగర్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో సంతోష్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న కందుకూరి పవన్ ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా అతని ఆ దారిన వెళ్లేవారెవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో విధి నిర్వహణకు వెళ్తున్న ఎస్సై సంతోష్ అతడిని గమనించారు. హృదయం చలించి మానవత్వంతో వెంటనే 108కు ఫోన్ చేశారు. అతనే స్వయంగా అంబులెన్స్లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను అక్కడ చూసిన వారంతా మానవత్తాన్ని చాటుకున్న ఆ ఎస్సైని అభినందించారు.