ప్లీజ్‌.. ప్రణయ్‌ దగ్గరికి తీసుకువెళ్లండి

Miryalaguda Honor killing victim Pranay Wife Emotional Words - Sakshi

కన్నీరు మున్నీరుగా విలపించిన అమృత వర్షిణి

పెళ్లికి కావాల్సింది రెండు మనసుల కలయికే కానీ కులాలతో సంబంధం లేదనుకుంది. అందుకే పెద్దల అంగీకారం లేకుండానే మనసిచ్చిన వ్యక్తిని వివాహమాడింది. కొన్నాళ్లు గడిస్తే తల్లిదండ్రులే తమను చేరదీస్తారని భావించింది. అనుకున్నట్లుగానే తండ్రి ఫోన్‌ చేయడంతో.. తాము ఇక సంతోషంగా ఉండవచ్చని అనుకుంది. కానీ అదంతా నాటకంలో భాగమని ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే పరువు కోసం పాకులాడే తండ్రి దుర్మార్గానికి భర్త బలైపోవడంతో తట్టుకోలేకపోతోంది.

సాక్షి, మిర్యాలగూడ : ‘నా కళ్ల ముందే కొట్టి చంపేశారు అంకుల్‌.. ప్రణయ్‌ని ఆ పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. జీవితాంతం హ్యాపీగా ఉందామనుకున్నాం. కానీ..... ప్లీజ్‌ అంకుల్‌ నేను ప్రణయ్‌ను చూస్తా. నన్ను తన దగ్గరికి తీసుకువెళ్లండి. అంకుల్‌ ప్లీజ్‌.. ప్రణయ్‌ని చూడకపోతే ఎట్లా.. ప్లీజ్‌ నన్ను వదిలిపెట్టండి. ప్రణయ్‌ను నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంకుల్‌’  అంటూ పరువు హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి కంటతడి పెట్టిన తీరు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. భర్త ప్రేమకు గుర్తుగా తన బేబీని పెంచుకుంటానంటూ ఐదు నెలల గర్భిణి అమృత విలపించిన తీరు అందరితో కంటతడి పెట్టిస్తోంది. గర్భిణి అయిన కారణంగా ఆమెను రెస్టు తీసుకోవాల్సిందిగా కోరిన వైద్యురాలు, గుత్తా సుఖేందర్‌ రెడ్డితో అమృత మాట్లాడిన మాటలు ఇవి.(చదవండి: ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం)

కాగా అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్‌లను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు.(చదవండి: పరువు హత్య; సంచలన విషయాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top