
సాక్షి, సిద్ధిపేట: వ్యవసాయం దండగ కాదని.. పండగగా చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ మండలం దాతర్పల్లిలో నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 29న సీఎం కేసీఆర్ చేతుల మీదగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభమవుతుందని చెప్పారు. నియంత్రిత పంటల సాగు కాదు.. ప్రాధాన్యత సాగు అని రైతులకు వివరించాలని అధికారులకు ఆయన సూచించారు.
(వివాహిత కారు చోరీ.. విచారణకు సీఐ డుమ్మా)
దాతర్ పల్లి అంటేనే ఆదర్శ గ్రామమని, ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిందన్నారు. గతంలో పంటలు పండించడం కోసం అప్పులు కోసం షావుకారు దగ్గరకి వెళ్లేవారని.. నేడు ఆ పరిస్థితి లేదని.. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం రైతు బంధు కింద రూ.5 వేలను అందిస్తుందని తెలిపారు. పండించిన ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తున్నామని పేర్కొన్నారు. నెలలోగా లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. వర్షాకాలం మక్కలు పండిస్తే నష్టం వస్తుందని.. కందిపంటను సాగు చేసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లలో ఫేస్బుక్లు,పబ్జీ గేమ్లు పక్కనపెట్టి.. పంటల పండించేందుకు తల్లిదండ్రులకు సహకరించాలని యువతకు మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
(సరిహద్దుల్లో అప్రమత్తం)