మరో సింగపూర్ సిటీగా మహేశ్వరం | maheshwaram as other singapur city | Sakshi
Sakshi News home page

మరో సింగపూర్ సిటీగా మహేశ్వరం

Aug 22 2014 12:17 AM | Updated on Mar 28 2018 11:08 AM

తెలంగాణ ప్రభుత్వంలో మహేశ్వరాన్ని మరో సింగపూర్ సీటిగా తీర్చిదిద్దుతామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు.

మహేశ్వరం: తెలంగాణ ప్రభుత్వంలో మహేశ్వరాన్ని మరో సింగపూర్ సీటిగా తీర్చిదిద్దుతామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. మహేశ్వరం ప్రజలు తొందరపడి భూములు అమ్ముకోవద్దని సూచించారు.

మహేశ్వరం, రావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, మన్సాన్‌పల్లి గ్రామాలకు భారీ ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతలో కంపెనీలు, పరిశ్రమలు నెలకొల్పడానికి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమగ్ర సర్వేతో అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. వర్షాలు సకాలంలో కురిపించి పాడీ పంటలు సమృద్ధిగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.

 అంతకుముందు గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసరి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ ఆనందం, నాయకులు కూన యాదయ్య, డి. అశోక్, రాఘవేందర్‌రెడ్డి, ఎం.ఎ. సమీర్, మల్లేష్, తడకల యాదయ్య, సంజయ్, షఫీ, సలీం, చంద్రశేఖర్‌రెడ్డి ,ఠాగూర్ నాయక్ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement