ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం జరగడంతో ఆ యువకుడు ఉన్మాదిగా మారాడు.
కుంటాల (ఆదిలాబాద్): ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం జరగడంతో ఆ యువకుడు ఉన్మాదిగా మారాడు. యువతికి చెందిన గ్రామంలోని తాగునీటి బావిలో విషపు గుళికలు కలిపాడు. ఆ నీటిని సేవించి ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం బూగురుపల్లి జి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు... సారంగాపూర్ మండలం నేకతండాకు చెందిన ఆడెరాజు బూరుగుపల్లికి చెందిన ఓ యువతిని గతంలో ప్రేమించాడు. అయితే ఆమెకు నేకతండాకు చెందిన వేరొక వ్యక్తితో పెళ్లి జరగడంతో తనకు దక్కుండా పోయిందని ఉన్మాద చర్యకు పాల్పడ్డాడు.
ఆదివారం రాత్రి బూరుగుపల్లికి బైక్పై వచ్చి గ్రామస్తులు తాగునీటికి వినియోగించే బావిలో విషపు గుళికలు కలిపాడు. సోమవారం ఈ నీటిని సేవించి గ్రామంలోని ఐదుగురు అస్వస్థత పాలయ్యారు. దీంతో అధికారులు స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీటి నమూనాలను ల్యాబ్కు పంపించారు. కాగా నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.