మడికొండ ఐటీ సెజ్‌లో మహీంద్రా కేంద్రాల ప్రారంభం | KTR Launching Tech Mahindra Center Today At Madikonda IT SEZ In Warangal | Sakshi
Sakshi News home page

ఐటీ హబ్‌గా వరంగల్‌

Jan 7 2020 10:33 AM | Updated on Jan 7 2020 10:33 AM

KTR Launching Tech Mahindra Center Today At Madikonda IT SEZ In Warangal - Sakshi

సాక్షి, మడికొండ(వరంగల్‌): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంగా వరంగల్‌కు పేరు ఉంది. అయితే, కొన్నేళ్ల క్రితం నుంచి అభివృద్ధి పరుగులు తీస్తున్నా బహుళ జాతి కంపెనీలు వరంగల్‌లోకి అడుగు పెట్టడం లేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను పరిచయం చేయాలన్న భావనతో కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు తొలిసారి జిల్లాలోని మడికొండలో ఉన్న పారిశ్రామిక వాడలో ఐటీ సెజ్‌ ఏర్పాటుచేయగా.. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యాన ఇంక్యుబేషన్‌ సెంటర్‌ మొదలైంది. అక్కడ తొలుత 2016లో సైయంట్‌ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించగా..ఆ కంపెనీ అయిదు ఎకరాల్లో కొత్త సెంటర్‌ ఏర్పాటుచేసింది. దీనికి తోడు టెక్‌ మహీంద్రా కూడా తన సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఈ రెండు కేంద్రాలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రాంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అక్టోబర్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా...
మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్‌ మహేంద్ర, సైయంట్‌ ఐటీ సెంటర్లను మంగళవారం మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించనున్నారు. సైయంట్‌ సంస్థ కార్యాలయాన్ని ఆక్టోబర్‌లోనే ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. అప్పట్లో అనివార్య కారణాలతో ప్రారంభోత్స వం వాయిదా పడింది. ఇంతలోనే టెక్‌ మహీంద్ర సంస్థ సైతం తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం రెండు కేంద్రాలను కేటీఆర్‌ ప్రారంభి స్తారు. సైయింట్‌ ఐదు ఎకరాల స్థలంలో సుమారు రూ.25కోట్లతో సెంటర్‌ నిర్మించింది. ఇందులో ప్రస్తుతం 120 మందితో కార్యకలాపాలు సాగుతుండగా.. ఆరు బ్లాక్‌ల్లో 800 వరకు పని చేయడానికి అనుకూలంగా ఉందని కంపెనీ సీనియర్‌ మేనేజర్‌ కే.తిరుపతిరెడ్డి తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, చీఫ్‌ విప్‌
సైయంట్, టెక్‌ మహీంద్ర సంస్థల కార్యాలయాలను మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించనున్న క్యాబిన్లు, సమావేశ హాల్‌లు పరిశీలించిన అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ కూడా ప్రాంగణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్‌డీఓ వెంకారెడ్డి, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, కార్పొరేటర్‌ జోరిక రమేష్, నాయకులు దువ్వ కనుకరాజ్, పల్లపు నర్సింగరావు, రాజేందర్, వినోద్‌ పాల్గొన్నారు.

ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం..
హన్మకొండ: ఐటీ హబ్‌గా వరంగల్‌ను తీర్చిదిద్దనున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మాట్లాడారు. హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి విద్యార్థులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం సైయంట్, టెక్‌ మహీంద్రా కంపెనీల సెంటర్లు ఏర్పాటుచేసేలా కృషి చేసిందని తెలిపారు. ఈ కంపెనీలను కేంద్రాలను మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు.

ఉదయం 11.30 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు బోయినిపల్లి రంజిత్‌రావు, వేము ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకులు సంగంరెడ్డి సుందర్‌రాజు, మాడిశెట్టి శివశంకర్, బొర్ర అయిలయ్య, నయీముద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement