బస్సు.. భవితవ్యంపై కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

బస్సు.. భవితవ్యంపై కీలక నిర్ణయం

Published Mon, Nov 25 2019 2:37 AM

KCR Review On TSRTC Future - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ భవితవ్యంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సంస్థ మనుగడ, రూట్ల ప్రైవేటీకరణ, సమ్మెలో ఉన్న కార్మికుల భవితవ్యంపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసు కోవాలని గత గురువారం సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. 5,100 రూట్ల ప్రైవేటీ కరణకు కేబినెట్‌ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి సోమవారం నాటికి అందు బాటులోకి రానుందని, అదే రోజు కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆర్టీసీపై కీలక నిర్ణ యాలు తీసుకుంటారని రవాణాశాఖ వర్గాలు పేర్కొం టున్నాయి.

ఆర్టీసీని నడపడానికి ప్రతి నెలా రూ. 640 కోట్లు కావాలని, ఈ మొత్తాన్ని భరించే శక్తి సంస్థకు లేదా తమకు లేదని ప్రభుత్వం చేతు లెత్తేసింది. దీన్నుంచి బయట పడేందుకు బస్సు చార్జీల పెంపు ఒకటే మార్గమని, కానీ దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడ తారని అభిప్రాయ పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథా విధిగా నడపడం సాధ్యం కాదని ప్రకటించింది. ఈ పరిస్థితు లను కారణంగా చూపుతూ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. రూట్ల ప్రైవేటీకరణకు ఇప్పటికే రవాణాశాఖ ముసాయిదా విధివిధానాలను రూపొం దించింది.

సోమవారం ఈ అంశంపైనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చేసిన ప్రకటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి కోసం సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనిపైనా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.  

Advertisement
Advertisement