అంతర్రాష్ట్ర అనుమతి

kaleshwaram project gets interstate permissions - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుకు మంజూరు చేసిన కేంద్రం

కలిసొచ్చిన మహారాష్ట్రతో ఒప్పందాలు

ఇప్పటికే పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులు

ఇక కాస్ట్‌ అప్రైజల్, ఇరిగేషన్‌ ప్లానింగ్‌ అనుమతులే కీలకం

సాక్షి, హైదరాబాద్‌ : వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి.. కోటి ఎకరాల సాగు స్వప్నాన్ని సాధించే దిశగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అనుమతుల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే ప్రాజెక్టుకు ప్రధానమైన పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులురాగా.. తాజాగా అంతర్రాష్ట్ర అనుమతులు (ఇంటర్‌ స్టేట్‌ క్లియరెన్స్‌) ఇస్తున్నట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ బీపీ పాండే రాష్ట్రానికి సమాచారమిచ్చారు. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

కలిసొచ్చిన ‘మహా’ఒప్పందం
దాదాపు పదేళ్ల కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. అయితే మహారాష్ట్ర అనుమతి లేకుండానే తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించి.. తదనుగుణంగా కాలువల పనులు కూడా మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుతో మహారాష్ట్రలో కొంత భూమి ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మహారాష్ట్రలో ముంపు లేకుండా ప్రాజెక్టు నిర్మించుకుంటే తమకు అభ్యంతరమేమీ లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులో చేపట్టే రిజర్వాయర్ల సామర్థ్యంపై కేంద్ర జల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది. తమ్మిడిహెట్టితోపాటు కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద కూడా బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఈ మార్పులకు అనుగుణంగా మహారాష్ట్ర అంగీకారం తప్పనిసరైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలు జరిపింది. 2016 ఆగస్ట్‌ 23న ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఎన్నో ప్రయోజనాలు
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతోపాటు మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగనుండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇక తమ్మిడిహెట్టితో రాష్ట్ర పరిధిలో రెండు లక్షల ఎకరాలకు.. మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్‌ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే మహారాష్ట్ర అంతరాష్ట్ర ఒప్పందం చేసుకుంది. అనంతరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకారం తెలిపిందని, ఈ మేరకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీని కోరింది. తర్వాత వరుసగా సంప్రదింపులు జరుపుతూ.. సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ వచ్చింది. మొత్తంగా ఈ అంశంపై సంతృప్తి చెందిన కేంద్ర జల సంఘం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతులు మంజూరు చేసింది. ఇక ప్రాజెక్టుకు ఇరిగేషన్‌ ప్లానింగ్, కాస్ట్‌ అప్రైజల్‌ వంటి రెండు కీలక అనుమతులు మిగిలి ఉన్నాయని.. అవి వచ్చేస్తే ప్రాజెక్టుకు నెలకొన్న ఆటంకాలన్నీ తొలగినట్లేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

మళ్లీ తెరపైకి జాతీయ హోదా..!
ప్రతిష్టాత్మమైన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం కొలిక్కి రావడం, వివిధ కేంద్ర డైరెక్టరేట్‌ల నుంచి కీలక అనుమతులు లభిస్తుండడంతో ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగిరం చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై మరోమారు కేంద్రం తలుపు తట్టాలని నిర్ణయించినట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇది వరకే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో... కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ పలుమార్లు ప్రధానమంత్రికి విన్నవించారు కూడా. పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెల చివరి వారంలో ప్రధాని రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయమై మరోమారు నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top