‘లాక్‌’తెంచుకున్న ‘కిక్కు’ 

Illegal Liquor Selling In Telangana - Sakshi

‘లాక్‌డౌన్‌’లోనూ విచ్చలవిడిగా మద్యం అక్రమ విక్రయాలు

బ్రాండ్‌ను బట్టి ధర.. పట్టణ, నగరాల్లో యథేచ్చగా దందా

వైన్‌షాప్‌ యజమానుల సిండికేట్‌.. సహకరిస్తున్న ‘ఎక్సైజ్‌’

షాపులు సీజ్‌ చేయాలన్న మంత్రి ఆదేశాలు బేఖాతరు

ఆరు నెలల గడువు తీరిపోవడంతో

వినియోగానికి పనికిరాని బీరు

బేవరేజెస్‌ ఇతరత్రా నిల్వ స్టాకు విలువ రూ.240 కోట్ల పైమాటే..

ఏప్రిల్, మే నెలల్లో రూ.1,200 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలకు బ్రేక్‌

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో అన్నీ బంద్‌ అయ్యాయి కానీ, ‘మందు దందా’మాత్రం ఆగలే దు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన 37 రోజుల తర్వా త కూడా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. కాకపోతే కావాల్సిన బ్రాండ్‌ దక్కించుకోవడం కాస్త ‘ఖరీదైన’వ్యవహారమే.. ఆబ్కారీ అధికారులకు తెలిసి మరీ బ్లాక్‌మార్కెట్‌లో లభిస్తోన్న ఈ మ ద్యం కొనాలంటే జేబు ఫుల్లుండాలి. లాక్‌డౌన్‌ పు ణ్యం, వైన్‌షాప్‌ యజమానుల కక్కుర్తి, ఆబ్కారీ అధికారుల సహకారం వెరసి రాష్ట్రంలో మద్యం మేలిమి బంగారమంత ఖరీదైపోయింది. వైన్స్‌  నుంచి దొడ్డిదారిన తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇందుకు ఎక్సైజ్‌ యంత్రాంగం కూడా సహకరిస్తుండటంతో వాడపల్లి నుంచి వాంకిడి వరకు, అచ్చంపేట నుంచి భద్రాచలం వరకు అన్ని పట్టణ ప్రాంతాల్లో మద్యం దొరకని చోటంటూ లేదు.

విచ్చలవిడిగా సరుకు బయటకి.. 
వాస్తవానికి, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు వైన్‌ షాపులకు సీల్‌ వేయలేదు. లాక్‌డౌన్‌ గడువు తొలిసారి పెంచినప్పుడు ఆబ్కారీ శాఖ లిఖితపూర్వకంగా ఉత్తర్వులిచ్చింది కానీ అందులో షాపులు సీజ్‌ చేయాలని పేర్కొనలేదు. ఇదే అదనుగా వైన్స్‌ యజమానులు సరుకు అక్రమంగా బయటకు తీసుకువచ్చారనే ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెంటనే మద్యం దుకాణాలు సీజ్‌ చేయాలని ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ తర్వాత కూడా కొన్నిచోట్ల మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తూ వైన్‌షాపులకు సీల్‌ వేయలేదనే ఆరోపణలున్నాయి. వైన్స్‌ సిండికేట్లకు ఆబ్కారీ అధికారులు సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని వినిపిస్తోంది.

ఎంతగా అంటే ఇటీవల హైదరాబాద్‌ శివారులోని ఓ దుకాణం నుంచి మద్యం తరలిస్తున్నారని తెలిసి కూడా చర్యలు తీసుకోలేదనే కారణంతో ఒక ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మొక్కుబడిగా అక్కడక్కడా మద్యం పట్టుకున్నట్టు కొద్దోగొప్పో సరుకును ఎక్సైజ్‌ అధికారులు చూపిస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ మద్యం ఖమ్మం సరిహద్దు జిల్లాలైన తెలంగాణలోని సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నుంచి వచ్చిందని చెబుతున్నారు. జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి మనుషులు రావడమే గగనమైతే మద్యం ఎలా రాగలిగిందో చెక్‌పోస్టుల సిబ్బందికి, ఎక్సైజ్‌ అధికారులకే తెలియాలి.

ఎవరి వాటా వారికే! 
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచే మద్యం విక్రయాలు ఏదో రూపంలో సాగుతున్నాయి. ముందుగానే సరుకు తెచ్చుకున్న వైన్‌షాపుల యజమానులు దళారుల ద్వారా ఈ మద్యాన్ని కమీషన్లు ఇచ్చి అమ్మిస్తున్నారు. పనిలో పనిగా ఆబ్కారీ అధికారుల చేతులూ తడుపుతున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే, మద్యం అక్రమ అమ్మకాలు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపుల్లో సరుకు ఎప్పుడో ఖాళీ అయిపోయింది. కొన్నిచోట్ల పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు మందు తెచ్చినా రేట్లు ఎక్కువ ఉండడంతో ఎవరూ కొనడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా వరకు పట్టణ ప్రాంతాల్లోనే ఈ వ్యాపారం మూడు క్వార్టర్లు, ఆరు ఫుల్లులుగా కొనసాగుతోంది. 

గ్రేటర్‌లో  సర్వీస్‌ చార్జీ అదనం!
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బస్తీల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి మద్యం ధరలతో పోలిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ధరలు తక్కువేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాయల్‌ స్టాగ్‌ (రూ.4,600), ఐబీ (రూ.3,700), ఎంసీ డైట్‌ (రూ.3,700), బ్లెండర్స్‌ ప్రైడ్‌ (రూ.6,000), బ్లాక్‌ లేబుల్, వైట్‌ లేబుల్‌ (రూ.11,000), సిగ్నేచర్‌ (రూ.5,500), రాయల్‌ గ్రీన్‌ (రూ.4,600) చొప్పున అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.100–350 వరకు సర్వీస్‌ చార్జీ కూడా వసూలు చేస్తున్నారు. ఈ రేట్లకు అమ్మేందుకు యువకులు గ్రూపులుగా పనిచేస్తున్నారు. అమ్మిన తర్వాత పెట్టుబడిదారుడికి ఇవ్వాల్సింది పోను మిగిలిన డబ్బులతో ‘పార్టీ’చేసుకుంటున్నారు. కాగా, బీర్లు నిల్వ ఉండవు కనుక రాష్ట్రంలో ఎక్కడా ఇవి దొరకడం లేదు. ఎక్కడైనా ఉన్నా లైట్‌ బీర్‌ రూ.400–500కి అమ్ముతున్నారు. ఖమ్మం మార్కెట్‌లో పలుకుతున్న రేట్లకు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రేట్లకు కొంచెం తేడా ఉంది. బ్రాండ్, అవసరాన్ని బట్టి రూ.500 ఎక్కువ తక్కువకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో అయితే.. కొనేవాళ్ల కెపాసిటీని బట్టి రేటు ఫిక్స్‌ చేసి అమ్ముతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top