ఫలించిన ప్రయోగాలు..

Hyderabad Police Reduced Road Accidents - Sakshi

12 శాతం తగ్గిన ‘ప్రాణాంతక ప్రమాదాలు’

ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన చర్యల ఫలితమే

సిటీ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి,సిటీబ్యూరో/గన్‌ఫౌండ్రి: రోడ్డు ప్రమాదంలో ప్రత్యక్షంగా మరణించేది ఒక్కరే అయినా పరోక్షం గా ఆ కుటుంబం మొత్తం క్షతగాత్రమవుతుంది. ఎందరివో కలలు కల్లలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఫలితంగా తొలి ఆరు నెలల గణాంకాలను పరిశీలిస్తే ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాల్లో 12 శాతం, రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో 10 శాతం తగ్గుదల నమోదైనట్లు స్పష్టవుతోంది. శుక్రవారం డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌తో కలిసి గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు.

మందుబాబుల్లో 18 శాతం జైలుకే
నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మద్యం తాగి వాహనం నడిపే వారిపై అదే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారాంతాలతో పాటు ఆకస్మికంగా అప్పుడప్పుడు డ్రంక్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఇది ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 15,133 కేసులు నమోదు కాగా వీరిలో 18 శాతం మందికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించాయి. పట్టుబడిన మందుబాబులకు ముందుగా టీటీఐల్లో కౌన్సిలింగ్‌ చేస్తున్నారు.

ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకున్నారు
నగర ట్రాఫిక్‌ పోలీసులు కేవలం ప్రమాదాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు/వాహనచోదకులకు ఎదురవుతున్న ఇబ్బందుల్నీ దృష్టిలో పెట్టుకున్నారు. వీటిని నిరోధించడానికీ పెద్ద పీట వేస్తూ ఈ ఏడాది చర్యలు తీసుకున్నారు. ఆ తరహా ఉల్లంఘనల పైనా పలుమార్లు స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించారు. దీంతో పాటు బడులకు వెళ్లే చిన్నారుల భద్రతకూ ప్రాధాన్యం ఇచ్చారు.

క్షతగాత్రులు పెరిగారు
రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్‌ విభాగం అధికారులు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇచ్చాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే తొలి ఆరు నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగినా... అందులో మృతుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. అనేక ప్రమాదాల్లో వాహనచోదకులు క్షతగాత్రులుగా మారి బయటపడటంతో గాయపడిన వారి సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మరోపక్క పాదచారుల భద్రతకూ ట్రాఫిక్‌ పోలీసులు ప్రాధాన్యం ఇవ్వడంతో వారి మరణాలు తగ్గాయి.

కీలక చర్యలివీ...
సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా నగరంలో మొత్తం 85 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నారు.
ఆయా విభాగాల సహకారం, సమన్వయంతో కీలక ప్రాంతాల్లో పెలికాన్‌ సిగ్నల్స్, క్యారేజ్‌ వేలు, కాజ్‌ వేలు ఏర్పాటు చేయించారు.
ఫ్రీ లెఫ్ట్‌ల వద్ద బొల్లార్డ్స్, కోన్లు ఏర్పాటు చేయడం ద్వారా రహదారులను విభజించారు.
టర్నింగ్స్‌ ఉన్న చోట రిఫ్లెక్టివ్‌ సైనేజెస్‌ ఏర్పాటు చేసి రాత్రి వేళల్లోనూ వాహనచోదకులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రమాదకర ప్రాంతాలను గుర్తిస్తూ అక్కడ హజార్డ్‌ మార్కర్స్‌ ఏర్పాటు చేశారు.
వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ రంబ్లర్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయించారు.
క్యారేజ్‌ వేల్లో వాహనాలు నడవడానికి ఇబ్బందికరం, ప్రమాదకరంగా మారిన పోల్స్‌ తదితరాలను తొలిగించారు.  

ప్రమాదకర ఉల్లంఘనలపైఉక్కుపాదం
రహదారి భద్రత నిపుణులు నిబంధనల ఉల్లంఘనలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ముప్పుగా మారేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పుగా పరిణమించేవి. మొదటి తరహా వాటి కంటే రెండోవి, రెండో వాటి కంటే మూడో తరహాకు చెందిన వాటిపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ ఉల్లంఘన అయితే వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందో వాటిపై వరుసపెట్టి స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

 సమన్వయంతో పని చేశాం
నగరంలో ప్రాణాంతరకంగా మారే ప్రమాదాలను తగ్గించడానికి అన్ని విభాగాలతో కలిసి పని చేశాం. దీనికి తోడు ట్రాఫిక్‌ విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేయడం ద్వారా సమస్యలు గుర్తించి ఆయా ప్రభుత్వ సంస్థల సాయంతో వాటిని పరిష్కరించడం ఫలితాలు ఇచ్చింది. బ్లాక్‌స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అవసరమైన చర్యలు తీసుకున్నాం. మైనర్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్, మద్యం తాగి వాహనాలు నడపటంపై ఉక్కుపాదం, రాంగ్‌ సైడ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, సీటు బెల్ట్‌ లేకుండా నడపటం, సిగ్నల్‌ జంపింగ్, ఓవర్‌ స్పీడింగ్‌... ఇవన్నీ అత్యంత ప్రమాదకరం. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు చేపట్టాం. ఫలితంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో గతేడాదితో పోలిస్తే 15 ప్రాణాలు కాపాడగలిగాం.         – అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top