ఆ చైర్‌పైనే దృష్టి | heavy competition for Post | Sakshi
Sakshi News home page

ఆ చైర్‌పైనే దృష్టి

Mar 14 2014 2:24 AM | Updated on Sep 2 2017 4:40 AM

ఇల్లెందు చెర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌కావడంతో పతులకు బదులు సతులు బరిలో నిలుస్తున్నారు.

ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: ఇల్లెందు చెర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌కావడంతో పతులకు బదులు సతులు బరిలో నిలుస్తున్నారు. కొందరు తమ కూతుళ్ల ను, సోదరీమణులను కూడా బరిలో నిలిపేం దుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే 14వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మడత వెంకట్‌గౌడ్ సతీమణి మడత రమా.. వెంకటరెడ్డి వర్గం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు పోటీగా పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, రేణుకవర్గానికి చెందిన గోచికొండ శ్రీదేవి కూడా బుధవారమే నామినేషన్ వేశారు. వెంకట్‌గౌడ్ ప్యానల్ ఇప్పటికే సీపీఐతో పొత్తుకుదుర్చుకుంది.

 ఈ పొత్తును రేణుక వర్గానికి చెందిన నేతలు వ్యతిరేకిస్తున్నారు. వీరిద్దరూ చైర్‌పర్సన్ సీటే లక్ష్యంగా బరిలో నిలిచారు. ఐదో వార్డు నుంచి (బీసీ మహిళ) రాంరెడ్డి వర్గానికి చెందిన కొక్కు నాగేశ్వరరావు కూతురు, మాజీ కౌన్సిలర్ నల్ల సరిత నామినేషన్ వేశారు. ఈమెకు పోటీగా రేణుక వర్గీయురాలు మరో మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. మరో కాంగ్రెస్ నేత సతీష్‌నాయుడు తన సోదరిని బరిలో నిలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి జేకే శ్రీను భార్య రాధిక 13వ వార్డుకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎండీ షంషాద్ పదో వార్డు అభ్యర్థినిగా నామినేషన్ వేశారు.

20వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్, టీడీపీ జిల్లా నాయకులు మడుగు సాంబమూర్తి భార్య వెంకటలక్ష్మి బుధవారం నామినేషన్ వేశారు. చైర్‌పర్సన్ సీటే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీ తరఫున బీఫామ్ పొందేందుకు ఢిల్లీ వరకు రాయబారాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వార్డుల్లో అధికారం చెలాయిస్తున్న పలువురు నేతలు దాన్ని నిలబెట్టుకోవాలని రకరకాల పాట్లు పడుతున్నారు. దీనిలో భాగంగానే భార్యాబిడ్డలను బరిలో దించుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement