లాక్డౌన్ పొడిగింపునకు సంసిద్ధం కావాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్పొడిగింపుపై బీజేపీ కార్యకర్తలు సంసిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సూచించారు. దేశ హితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ... లాక్డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా బీజేపీ శ్రేణులు సేవా (‘ఫీడ్ ది నీడ్’) కార్యక్రమాల్లో పాల్గొన్నాలన్నారు.
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు దృష్ట్యా లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని బండి సంజయ్ హితవు పలికారు. మర్కజ్ వెళ్లినవారికి కరోనా పాజిటివ్ నిర్థారణ అవుతున్న తరుణంలో కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేయడం సరికాదని అన్నారు.