యథాస్థానాలకు.. | Sakshi
Sakshi News home page

యథాస్థానాలకు..

Published Thu, Sep 18 2014 2:19 AM

effect for mpdo on the posts

ఎంపీడీవోల పోస్టింగ్‌లపై కోర్టు ఎఫెక్ట్
- ఉన్నతాధికారులకు షాక్
- ఎన్నికల బదిలీల్లో మారిన పోస్టింగ్‌లు
- అదే బాటలో మరికొంతమంది
 కరీంనగర్ సిటీ : జిల్లాలో ఎంపీడీవోల పోస్టింగ్‌ల వ్యవహారం మ్యూజికల్ చైర్‌ను తలపిస్తోంది. పైరవీలతో అనుకూలమైన పోస్టింగ్‌లు పొందే ఎంపీడీవోలు, ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించి మరీ తమ స్థానాలు ‘దక్కించుకుంటున్నారు’. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడ ం, ఎన్నికల కోడ్ ఎత్తివేశాక తిరిగి పాత స్థానాలకు పంపించడం సాధారణంగా జరిగే వ్యవహారం. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎంపీడీవోల బదిలీలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో ఉన్న 33 మంది ఎంపీడీవోలు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు బదిలీ అయ్యారు.
 
మారిన స్థానాలు
ఎన్నికల కోడ్ అనంతరం జూలై నెలలో ఇతర జిల్లాలకు వెళ్లిన ఎంపీడీవోలంతా తిరిగి వచ్చారు. జిల్లాకు వచ్చిన ఎంపీడీవోలకు యథాస్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా కరీంనగర్, బెజ్జంకి, రాయికల్, కథలాపూర్, కమాన్‌పూర్, పెగడపల్లి ఎంపీడీవోల పోస్టింగ్‌లను ఉన్నతాధికారులు వివిధ కారణాలతో మార్చారు. కరీంనగర్ ఎంపీడీవోగా బదిలీపై వెళ్లిన దేవేందర్‌రాజుకు ఎలిగేడు, రాయికల్ ఎంపీడీవో నర్సింహా రెడ్డికి భీమదేవరపల్లి, కథలాపూర్ ఎంపీడీవో శివాజీకి కోరుట్ల, బెజ్జంకి ఎంపీడీవో ఓబులేశ్‌కు ముస్తాబాద్ , కమాన్‌పూర్ ఎంపీడీవో వీరబుచ్చయ్యకు కరీంనగర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. పెగడపల్లి ఎంపీడీవోగా ఉన్న కుమారస్వామి డ్వామాకు బదిలీ చేసి ఆ తర్వాత బెజ్జంకికి పోస్టింగ్ ఇచ్చారు.

ఈ పోస్టింగ్‌ల మార్పుల వ్యవహారంలో కొన్ని పైరవీలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తారుు. కాగా ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన ఎంపీడీవోలకు పాత స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని జీవో నంబర్ 3172, తేదీ 01-06-2014 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును ఆసరాగా తీసుకొని తనకు పాత స్థానంలో పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని కరీంనగర్ ఎంపీడీవో దేవేందర్‌రాజు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇందుకు ప్రభుత్వ జీవోను ఆధారంగా చూపించారు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం దేవేందర్‌రాజుకు కరీంనగర్ ఎంపీడీవోగానే పోస్టింగ్ ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. దీంతో దేవేందర్‌రాజు బుధవారం కరీంనగర్ ఎంపీడీవోగా విధుల్లో చేరారు.

Advertisement
Advertisement